కుక్కలకు ఉండే విశ్వాసం మరే జంతువుకు ఉండదంటారు.. అందుకే యజమానులు తమ ఇళ్లలో కుక్కలను పెంచుకోవడానికి అమితంగా ఇష్టపడతారు. అటువంటి యజమానుల పట్ల కుక్కలు చూపే విశ్వాసం, విధేయత అంతా ఇంతా కాదు. సొంత కుటుంబ సభ్యుల కంటే కుక్కలే ఎక్కువ విశ్వాసం చూపిస్తాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సరిగ్గా దీన్ని నిజం చేసింది ఓ కుక్క. సూరత్లోని వెసు ప్రాంతంలో 100 ఏళ్ల జైన సన్యాసి (సాధ్వీ) ఇటీవల కన్నుమూశారు. ఈమె పార్థివ దేహాన్ని పల్లికిలో మోసుకెళ్తూ అంతిమ యాత్ర నిర్వహించారు శిష్యులు. సాధ్వీ ఇంటి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉమారా శ్మశాన వాటిక వరకు కొనసాగింది. అయితే ఈ యాత్రలో ఒక కుక్క అందర్నీ ఆశ్చర్యపర్చింది. సాధ్వీ చనిపోవడంతో ఆమెను విడిచి ఉండలేక అందరితో పాటు స్మశానం వరకు నడిచి తన విశ్వాసాన్ని చాటుకుంది కుక్క.
వెసూ ప్రాంతలోని రామేశ్వరం అపార్ట్మెంట్లో పీయూష్ వర్షా సాధ్వీ మహారాజ్ నివసించేవారు. అదే చోట సదరు కుక్క కూడా నివసించేది. సాధ్వీ నివసించినంత కాలం ఆ కుక్కకు తరచూ ఆహారం అందిస్తుండేంది. దీంతో, ఆ కుక్క తన ఆకలి తీర్చిన యజమాని పట్ల ఎంతో విధేయత చూపించేంది. ఆమె కన్నుమూయడంతో స్థానికులు, ఆమె శిష్యులు కొందరు కలిసి అంతిమ సంస్కారాల కోసం ఏర్పాట్లు చేశారు. సాధ్వీ ఇంటి నుంచి ఉమారా శ్మశానవాటిక వరకు పాల్కీ (అంతిమ) యాత్ర కొనసాగించారు. సాధ్వీ శిష్యులు, అనుచరులతో పాటు ఆ కుక్క కూడా అంతిమ యాత్రలో పాల్గొంది. కుక్కను దూరంగా పంపేందుకు కొందరు ప్రయత్నించారు. కానీ అది మాత్రం యజమానిని వదల్లేదు. మళ్లీ వచ్చి పల్లకి కింద నడవడం మొదలుపెట్టింది. పాల్కీ యాత్ర కొనసాగినంత వరకు అలానే నడిచి యజమాని పట్ల తన విశ్వాసాన్ని చాటుకుంది.
విశ్వాసానికి ప్రతీక అంటూ ప్రశంసలు
ఉమారా శ్మశానవాటికలో సాధ్వీ అంతిమ సంస్కారాలు ముగిసేంత వరకు ఆ పరిసరాల్లోనే తిరిగింది. అక్కడ జరిగిన కార్యక్రమాలన్నీ దిగాలుగా చూస్తూ ఉండిపోయింది. సాధ్వీ చివరి కర్మలు ముగిసిన తర్వాత, కొంతమంది శిశ్యులు కుక్కను కారులో ఎక్కించుకొని తిరిగి వెసు ప్రాంతంలో విడిచి వెళ్లారు. తనకు తిండి పెట్టిన యజమాని పట్ల ఇంతటి విశ్వాసం చూపించిన కుక్కను అంతా మెచ్చుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.