దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రమాదకర స్థాయికి చేరింది. ప్రస్తుత మూడో వేవ్ ఈ నెల చివరి నాటికి ప్రమాదకర స్థాయికి చేరనుంది. రాబోయే రోజుల్లో కొవిడ్ రోగుల ఆస్పత్రి చేరికలు పెరుగతాయని, అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. అయినాసరే సంప్రదాయ క్రీడ కోసం ఎందాకైనా వెళతామని తమిళులు మరోసారి నిరూపించుకున్నారు. కొవిడ్ బాధిత రాష్ట్రాల జాబితాలో తమిళనాడు పైవరుసలో ఉన్నా, ఆ రాష్ట్రంలో నమోదవుతోన్న కొత్త కేసుల్లో 85 శాతం వరకు ఒమిక్రాన్ రకాలే ఉన్నా తమిళ క్రీడ విషయంలో తగ్గేదేలేదని స్టాలిన్ సర్కారు అంటోంది. కొవిడ్ విలయంలోనూ జల్లికట్టుకు జిందాబాద్ కొట్టారు సీఎం స్టాలిన్..
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న తరుణంలో తమిళనాడులో ఏటా సంప్రదాయబద్ధంగా నిర్వహించే జల్లికట్టు క్రీడలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. జల్లికట్టు నిర్వహణకు ముఖ్యమంత్రి స్టాలిన్ సారథ్యంలోని ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా సోమవారంనాడు జారీ చేసింది.
జల్లికట్టుకు కేవలం 150 మంది వీక్షకులను లేదా మొత్తం సీటింగ్ సామర్థ్యంలో 50 శాతం మందిని మాత్రమే అనుమతించాలని స్టాలిన్ సర్కారు ఆదేశించింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, జల్లికట్టులో పాల్గొనేందుకు రిజిస్టర్ చేయించుకున్న ఎద్దుల యజమానులు, వారి సహాయకులు తప్పనిసరిగా రెండు డోసుల పూర్తి వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్ సమర్పించాలి. దీనితో పాటు కనీసం 48 గంటల ముందు తీయించుకున్న ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ నెగిటివ్ రిపోర్ట్ను తప్పనిసరిగా అందజేయాలి.
వ్యాక్సినేషన్ స్టిఫికేట్లు సమర్పించిన తర్వాత వారికి ఐడెంటిటీ కార్డులను అందజేస్తామని ప్రభుత్వం తెలిపింది. జిల్లా యంత్రాంగం ఇచ్చే ఐడెంటిటీ కార్డులున్న వారినే క్రీడాఆవరణలోకి అనుమతిస్తామని పేర్కొంది. జల్లికట్టులో పాల్గొనే జంతువులకు ఎలాంటి హాని చేయకూడదని కూడా స్పష్టం చేసింది. గతంలోనూ ఇలాంటి మార్గదర్శకాలు జారీ అయినా జల్లికట్టు అభిమానులు భారీగా తరలిరావడం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coronavirus, Covid, Jallikattu, MK Stalin, Omicron, Tamil nadu