ప్రైవేట్ రంగంలో ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఎప్పుడు అకస్మాత్తుగా ఉద్యోగం నుంచి తొలగిస్తారోనన్న భయం ఉద్యోగులను వెంటాడుతోంది. కరోనా తర్వాత ఈ పరిస్థితి మరింత తీవ్రమైంది. ఇప్పటికే నిర్వహణ భారంతో అనేక కంపెనీలు లక్షలాది మంది ఉద్యోగులను తొలగించాయి. అయితే ఉద్యోగం నుంచి తీసివేయాలంటే దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. ఈ విషయాన్ని సదరు ఉద్యోగికి కనీసం నెల రోజుల ముందు చెప్పాలి. కానీ అమెరికాకు చెందిన ఓ కంపెనీ సీఈవో జూమ్ కాల్ మీటింగ్లోనే ఏకంగా 900 మంది ఉద్యోగులను తీసేస్తున్నట్లు చెప్పి షాక్ ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అమెరికాకు చెందిన ప్రముఖ గృహ రుణాలు, తనఖా సంస్థ బెటర్.కామ్కు భారత్, అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక శాఖలున్నాయి. డిసెంబర్ 1న భారతదేశం, అమెరికాలోని ఉద్యోగులతో సీఈవో విశాల్ గార్గ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. అందరూ రెగ్యులర్ జూమ్ మీటింగ్ అనుకున్నారు. కానీ, ఎవ్వరూ ఊహించని వార్త చెప్పి షాకిచ్చారు.
జూమ్ కాల్లో ఉద్యోగులతో మాట్లాడుతూ ‘‘ఇలాంటి వార్త మీరెవరూ వినాలని కోరుకోరు. కానీ ఒకవేళ మీరు దురదృష్టవశాత్తూ ఈ కాల్ గ్రూప్లో ఉన్నట్లయితే.. మీ ఉద్యోగాన్ని తక్షణమే తొలగిస్తున్నాం. ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి నేను చాలా బాధపడుతున్నాను. కానీ మార్కెట్ మందగమనం, కంపెనీ నష్టాలు, పనితీరు ఆధారంగా తొలగించాల్సిన అనివార్యత ఏర్పడింది. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నా కెరీర్లో ఇది రెండోసారి. గతంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు నేను ఎంతగానో బాధపడి ఏడ్చాను కూడా. కానీ ఇప్పుడు స్ట్రాంగ్గా ఉండాలని నిర్ణయించుకున్నా. ఎవరి ఉద్యోగం పోయింది అనేది కంపెనీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ–మెయిల్ వస్తుంది. ఆయా ఉద్యోగులకు ఒక నెల రోజుల వేతనంతో పాటు రెండు నెలల కవర్ అప్ లభిస్తుంది.” అని విశాల్ గార్గ్ తన ఉద్యోగులకు పిడుగులాంటి వార్త చెప్పారు.
సోషల్మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..
గతేడాది నవంబర్లో వ్యాపార పత్రిక ఫోర్బ్స్లో విశాల్ కాగ్ స్థానం సంపాదించారు. ఇప్పుడు ఆయనే స్వయంగా 900 మంది ఉద్యోగులను తొలగించడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ ఉద్యోగి ఇటీవల సోషల్మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అకస్మాత్తుగా తమను ఉద్యోగాల నుంచి తొలగించడంపై ఉద్యోగస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కంపెనీ వాదన మాత్రం మరోలా ఉంది. రోజుకు 8 గంటలు పనిచేయాల్సిన ఉద్యోగులు కనీసం సగటున 2 గంటలు కూడా పనిచేయడం లేదని, దీని వల్ల నష్టాలు వస్తున్నాయని కంపెనీ పేర్కొంది. ఉద్యోగుల ఉత్పాదకత తక్కువగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి చర్యలు తీసుకోక తప్పట్లేదని సంస్థ వెల్లడించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: VIRAL NEWS