AT THIS HANUMAN TEMPLE PRESS A BUTTON AND POUR OIL FROM A DISTANCE GH VB
Hanuman Temple: కరోనా వేళ.. నిబంధనలు పక్కా.. దేవాలయంలో దేవుడికి నూనె ఎలా సమర్పిస్తున్నారో చూడండి..
హనుమాన్ టెంపుల్
ప్రస్తుత కరోనా(Corona) సమయంలో దేవాలయాలకు వెళ్లేందుకు ప్రజలు సందేహిస్తున్నారు. రద్దీగా ఉండే ఆలయాల్లో ఎవరి నుంచి వైరస్(Virus) సంక్రమిస్తుందోననే భయం వల్ల భక్తుల సంఖ్య తగ్గిపోతోంది. ఈ క్రమంలో జనాలు రాక దేవుళ్ల మందిరాలు వెలవెలబోతున్నాయి.
ప్రస్తుత కరోనా(Corona) సమయంలో దేవాలయాలకు వెళ్లేందుకు ప్రజలు సందేహిస్తున్నారు. రద్దీగా ఉండే ఆలయాల్లో ఎవరి నుంచి వైరస్(Virus) సంక్రమిస్తుందోననే భయం వల్ల భక్తుల సంఖ్య తగ్గిపోతోంది. ఈ క్రమంలో జనాలు రాక దేవుళ్ల మందిరాలు వెలవెలబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే వడోదర (Vadodara)లోని శ్రీ భిద్భంజన్ మారుతీ మందిర్ (Shri Bhidbhanjan Maruti Mandir) ఆలయ నిర్వాహకులు వినూత్నమైన ఆలోచన చేశారు. కోవిడ్-19 కాలంలోనూ భక్తులు నిర్భయంగా ఆలయానికి వచ్చి సురక్షితంగా ఆంజనేయుడికి నైవేద్యం సమర్పించేలా మందిర నిర్వాహకులు ఓ మెకానికల్ సిస్టం (Mechanical System)ను ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లతో భక్తులు హనుమంతుడికి దూరం నుంచే నూనెను సమర్పించవచ్చు. హర్ని (Harni) ప్రాంతంలో ఈ హనుమాన్ మందిరం ఉంటుంది. దూరం నుంచే సురక్షితంగా హనుమంతుడికి నూనెను సమర్పించేలా ఈ ఆలయ నిర్వాహకులు చేసిన ఆలోచన ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.
"చాలా మంది భక్తులు ప్రతి శనివారం మతపరమైన ఆచారంలో భాగంగా విగ్రహానికి నూనె సమర్పించాలని కోరుకుంటారు. భక్తులు రోజూ నూనెను కూడా అందిస్తారు. కానీ మహమ్మారి దృష్ట్యా దేవుడికి నైవేద్యం అందించే భక్తులను ఆలయ గర్భగుడి లోపలకు అనుమతించడం మంచిది కాదు. అలాగే అది భద్రతా మార్గదర్శకాలను, కరోనా నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుంది” అని పూజారి మహంత్ హర్షద్ గిరి గోస్వామి స్థానిక మీడియాకి తెలిపారు.
"ఇది మాత్రమే సమస్య కాదు. హనుమాన్ విగ్రహానికి నూనె సమర్పించాలనుకునే భక్తులను నిలువరించడం సాధ్యం కాదు. కాబట్టి, కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ ప్రజలు ఆచారాలను నిర్వహించేందుకు వీలుగా ఓ వ్యవస్థను అభివృద్ధి చేయాలని మేం ఆలోచించాం. ఆ ఆలోచన నుంచే విద్యుచ్ఛక్తితో నడిచే ఆటోమేటెడ్ మెషిన్ను తయారు చేయించాం. ఇటీవలే దాన్ని ఆలయంలో అమర్చాం” అని గోస్వామి వెల్లడించారు.
ఈ ఆటోమేటెడ్ మెషిన్ సాయంతో భక్తులు పెద్దగా చేయాల్సిన పనేం ఉండదు. వారు హనుమాన్ ఆలయ ప్రాంగణంలోని గర్భగుడి వెలుపల ఉన్న కొన్ని బటన్లను నొక్కితే చాలు.. హనుమంతుడి విగ్రహంపై నూనె నైవేద్యంగా వస్తుంది. ఈ సమయంలో గర్భగుడిలో ఒక మంత్రం ప్రతిధ్వనిస్తుంది. "భక్త జనులు రూ. 5, రూ.10, రూ.20 రూ. 50 ఖరీదైన నూనెను సమర్పించవచ్చు. ఈ వ్యవస్థ భక్తులు, పూజారి ఒకరికొకరు సురక్షితమైన దూరంలో ఉంచేలా ఉపకరిస్తుంది. అలాగే, తాము నూనెను అందించామనే సంతృప్తి భక్తులు పొందుతారు” అని గోస్వామి వెల్లడించారు.
విగ్రహంపై నూనెను సమర్పించినప్పుడు.. గర్భగుడి ఆటోమేటిక్ గా ప్రకాశిస్తుంది. తద్వారా భక్తుడికి చక్కగా భగవంతుని దర్శనభాగ్యం దక్కుతుంది. తమ ఆలయం పురాతన తంత్ర, మంత్ర, యంత్ర విధానాన్ని అనుసరిస్తోందని.. ఈ ఏర్పాటు పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పూజారి చెప్పుకొచ్చారు. కోవిడ్కు ముందు ఆలయంలో అన్ని శనివారాల్లో దాదాపు 2,000 మంది భక్తులు వచ్చేవారు. అయితే గత రెండేళ్లలో ఈ సంఖ్య దాదాపు 500కి పడిపోయిందట. ప్రస్తుతం మెకానికల్ వ్యవస్థ ఏర్పాటు చేసినప్పటికీ.. కోవిడ్ సేఫ్టీ ప్రోటోకాల్లను అనుసరిస్తూ స్వామికి నూనె సమర్పించడం సంతృప్తికరంగా ఉందని భక్తులు చెబుతున్నారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.