హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు, ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్ పై కాల్పుల ఘటనకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒవైసీ కాన్వాయ్ పై కాల్పుల ఉదంతాన్ని హైదరాబాద్ సహా అన్ని రాష్ట్రాల్లోని ఐఎంఐం శ్రేణులు నిరసించాయి. కేంద్రం సైతం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. కానీ సాక్షాత్తూ అసదుద్దీన్ సతీమణి మాత్రం కాల్పుల ఘటనను నమ్మలేదట..
యూపీలోని చిజారసీ టోల్ ప్లాజా వద్ద కాన్వాయ్ పై కాల్పులు, తృటిలో ప్రాణాలతో బయటపడి వేరే కారులోకి ఎక్కిన తర్వాత మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఢిల్లీలో ఉన్న తన భార్య ఫర్హీన్ ఒవైసీకి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పారు. కానీ కాల్పుల ఉదంతాన్ని ఆమె అసలే నమ్మలేదు. ‘ఏంటి? మరో కొత్త కథ చెబుతున్నారా?’అని దాదాపు నిలదీశారు. నిజానికి ఫర్హీన్ హైదరాబాద్ వెళ్లిపోవాల్సి ఉన్నా, ఒవైసీ కోరడంతో ఆమె గురువారం కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఇద్దరూ కలిసి ఆ సాయంత్రం ఢిల్లీలోని రెస్టారెంట్లో డిన్నర్ కు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. డిన్నర్ ప్రోగ్రామ్ ఎగ్గొట్టడానికే భర్త ఇలా కట్టుకథ చెబుతున్నాడేమోనని ఫర్హీన్ భావించారట. ఆ తర్వాత..
కాన్వాయ్ పై కాల్పుల ఉదంతాన్ని భార్య ఎంతకీ నమ్మకపోవడంతో, కావాలంటే టీవీ చూడమని ఒవైసీ సూచించారు. దీంతో ఫర్హీన్ టీవీ పెడుతుండగానే, పెద్ద కూతురు ఖుద్సియా ఫోన్ చేసింది. తండ్రి కాన్వాయ్ పై దాడి జరిగిందని, అయితే ఆయన క్షేమంగానే ఉన్నారని కూతురు చెప్పాకగానీ ఒవైసీ భార్యలో ఆందోళన పెరిగింది. భార్యకు ఫోన్ చేసిన ఒవైసీ తన మాటలను ఆమె ఎంతకూ నమ్మకపోయే సరికి పక్కనున్న మజ్లిస్ నేతలతో.. ‘నేను బుల్లెట్ల నుంచి బచాయించాను గానీ భార్య అనుమానపు చూపుల నుంచి తప్పించుకోలేకపోయా..’అని ఒవైసీ సరదాగా వ్యాఖ్యానించారు.
ఆ రోజు ఒవైసీ ఢిల్లీకి ఆలస్యంగా రావడం, ఘటన తర్వాత ఢిల్లీ పెద్దల వరుస ఫోన్లతో బిజీగా ఉండటంతో భార్యతో డిన్నర్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. కాన్వాయ్ పై కాల్పుల తర్వాత ఒవైసీ కుటుంబంలో చోటుచేసుకున్న ఘటనలపై ‘ఇండియన్ ఎక్స్ ప్రెస్’ ఈ మేరకు కథనాలు రాసింది. హైదరాబాద్ ప్రముఖ రాజకీయ కుటుంబ వారసుడైన అసదుద్దీన్ ఒవైసీకి ఫర్హీన్ తో 1996లో పెళ్లయింది. వారికి ఆరు గురు సంతానం. పెద్ద కూతురు ఖుద్సియా, రెండో కూతురు యాస్మిన్ లకు పెళ్లిళ్లుకాగా, అమీనా, మహీన్, అతికా ఒవైసీలు చదువుకుంటున్నారు. అసద్ కొడుకు సుల్తానుద్దీన్ ఒవైసీ వయసు ప్రస్తుతం 11 ఏళ్లు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఒవైసీ తన పార్టీ నేతలతో కలిసి మీరట్ నుంచి ఢిల్లీకి వస్తుండగా గురువారం నాడు చిజారసీ టోల్ ప్లాజా వద్ద కాల్పులు జరగడం, ఒవైసీ ప్రయాణిస్తోన్న వాహనానికి బుల్లెట్లు తగలడం, ప్రాణాపాయం నుంచి బయటపడ్డ ఆయన మరో కారులో ఢిల్లీకి వెళ్లడం, ఈ ఘటనను కేంద్ర హోం శాఖ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సీరియస్ గా తీసుకోవడం, మజ్లిస్ నేతకు జెడ్ కేటగిరీ భద్రత కేటాయించడం తెలిసిందే. అయితే, తాను ఏ కేటగిరీ పౌరుడిగా ఉండాలని కోరుకుంటానేతప్ప, జెడ్ ప్లస్ కేటగిరీ వద్దని అసద్ పార్లమెంటులో ప్రకటించారు. కాల్పుల ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. ఒవైసీపై కాల్పుల ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫిబ్రవరి 7న పార్లమెంటులో వివరణ ఇచ్చే అవకాశాలున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AIMIM, Asaduddin Owaisi, Assembly Election 2022, Shooting, Uttar Pradesh Assembly Elections