ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (AP Assembly) లో ప్రతిపక్ష టీడీపీ చీఫ్ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని ఉద్దేశించి అధికార వైసీపీ ఎమ్మెల్యేలు దారుణమైన కామెంట్లు చేసినట్లుగా వచ్చిన ఆరోపణు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నాయి. నేతల రాజకీయాల్లోకి భార్యలను, కుటుంబాలను లాగడమేంటని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. గౌరవ చట్ట సభను వైసీపీ నేతలు కౌరవ సభగా మార్చేశారని, ఇందులో స్పీకర్ తమ్మినేని సీతారాం పాత్ర కూడా కాదనలేనిదని చంద్రబాబు ఆరోపించారు. తమ్మినేనికి రాజకీయ భిక్ష పెట్టిందీ తానేనని చంద్రబాబు (Chandrababu) గుర్తుచేశారు. ఈ కామెంట్లపై స్పీకర్ తమ్మినేని ఘాటుగా కౌంటరిచ్చారు. అసెంబ్లీలో భువనేశ్వరిని ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపైనా స్పీకర్ అప్పటికప్పుడే కీలక నిర్ణయం తీసుకున్నారు. వివరాలివి..
స్పీకర్ తీరుపై విచారం..
ఏపీ అసెంబ్లీలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలపై విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. తన భార్య భువనేశ్వరిని దారుణంగా అవమానించారంటూ చంద్రబాబు వెక్కి వెక్కి ఏడుస్తూ.. స్పీకర్ తమ్మినేని సీతారాం తీరుపైనా విచారం వ్యక్తం చేయడం తెలిసిందే. ‘స్పీకర్ కూడా ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఒకప్పుడు ఆయనకు రాజకీయ భిక్ష పెట్టింది నేనే. అభిప్రాయ బేధాలతో పార్టీ మారడం తప్పు కాదు. కానీ స్పీకర్ స్థానంలో ఉండి వైసీపీ కౌరవ పోకడను ఆయన నిలువరించలేకపోయారు..’అని చంద్రబాబు విమర్శించగా, స్పీకర్ తమ్మినేని సైతం అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు.
చంద్రబాబుపై స్పీకర్ ఫైర్
‘నాకు రాజకీయ భిక్ష పెట్టింది తానేనని చంద్రాబు చెప్పుకుంటున్నారు. కానీ ఇది వాస్తవం కాదు. కాంగ్రెస్ పార్టీ ద్వారా నా రాజకీయ జీవితం ఆరంభమైంది. ఆ తర్వాత ఎన్టీఆర్ నన్ను పిలిచి పార్టీలోకి ఆహ్వానించారు. నేను టీడీపీలో చేరే సమయానికి చంద్రబాబు పార్టీలోనే లేడు, కాంగ్రెస్ లో ఉన్నారు. కాలక్రమంలో ఎన్టీఆర్ ఉద్వాసన సమయంలో నేను చంద్రబాబును బపరిచి తప్పు చేశాను. అందుకు పశ్చాత్తాపపడుతున్నాను. మూడు సార్లు ఓడిపోయి, నేను టీడీపీని వీడిన తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి ములాఖత్కు పిలిచారు. వైసీపీలో చేర్చుకోవడం ద్వారా జగనే నాకు రాజకీయ పునర్ భిక్షను పెట్టారు. ఆ తర్వాత ఉన్నత పదువులు ఇచ్చారు. ఇప్పుడు సభాపతి స్థానంలో ఉన్న నన్ను అవమానించేలా చంద్రబాబు మాట్లాడారు కాబట్టే వాస్తవాలపై సభలోనే వివరణ ఇస్తున్నా..’అని స్పీకర్ తమ్మినేని చెప్పారు. కాగా,
లోకేశ్ ఎలా పుట్టాడంటూ..
నారా భువనేశ్వరి పేరు నేరుగా పలకకున్నా, ఆమెను ఉద్దేశించి ఏపీ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన కామెంట్లపై స్పీకర్ తమ్మనేని సీతారాం చర్యలు తీసుకున్నారు. వ్యవసాయ రంగంపై చర్చ సందర్భంగా వైసీపీ, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం జరగడం, ‘బాబాయి.. గొడ్డలి..’అంటూ వివేకా హత్యపై సీఎం జగన్ ను కించపరుస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేయగా, వాళ్లకు కౌంటరిస్తూ, దివంగత మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి పేరును ప్రస్తావించారు వైసీపీ ఎమ్మెల్యేలు. అంతలోనే ‘నారా లోకేశ్ ఎలా పుట్టాడో తేలాల్సిందే’నని వైసీపీ ఎమ్మెల్యే ఒకరు కేకలు వేయడం, ‘ఏయ్.. చంద్రశేఖర్ రెడ్డి.. వద్దు..’అని స్పీకర్ తమ్మినేని వారించడం లైవ్ లో ప్రసారం కావడం, సదరు వీడియోలు వైరల్ కావడం తెలిసిందే. కాగా, భువనేశ్వరిని ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన అనుచిత వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని ప్రకటించారు.
వల్లభనేని వంశీ వల్లే?
ఏపీలో గ్రడ్స్ వివాదాల క్రమంలో సీఎం జగన్ ను ఉద్దేశించి ‘బోషిడికే’అంటూ టీడీపీ నేత పట్టాభి తిట్టడం, ఆ చర్యను నారా లోకేశ్ సమర్థించిన తర్వాత, లోకేశ్ ను విమర్శిస్తూ టీడీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ చేసిన వ్యాఖ్యలే ప్రస్తుత దుమారానికి కారణంగా తెలుస్తోంది. నారా లోకేశ్ కు ఎలిమినేటి మాధవరెడ్డి పోలికలున్నాయని వంశీ అనుచిత వ్యాఖ్యలు చేయగా, సదరు కామెంట్లను జగన్ పార్టీ మీడియా విస్తృతంగా ప్రచారం చేయడం, వైసీపీ సోషల్ మీడియా శ్రేణులూ ట్రోలింగ్ కు దిగడంతో విషయం పెద్దదైంది. నిన్న అసెంబ్లీలో వంశీ ప్రస్తావన ప్రమేయం లేకున్నా, గతంలో ఆయన నోటి వెంట వెలువడిన మాధవరెడ్డి పేరును వైసీపీ నేతలు అసెంబ్లీలో ప్రస్తావించడం, లోకేశ్ పుట్టుకపైనా కామెంట్లు చేయడంతో చంద్రబాబు ఆగ్రహిస్తూ సభ నుంచి బయటికొచ్చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP Assembly, AP Speaker Tammineni Seetharam, Chandrababu Naidu, Nara Bhuvaneshwari, TDP, Ysrcp