పెళ్లి వయసు.. ఇప్పుడీ అంశం మన దేశంలో హాట్ టాపిక్ గా నడుస్తోంది. అమ్మాయిల పెళ్లికి కనీస వయసును 18 నుంచి 21కి పెంచిన కేంద్రం.. ఈ మేరకు రూపొందించిన ‘బాల్య వివాహాల నిషేధ (సవరణ) బిల్లు-2021’ను పార్లమెంట్ లోనూ ప్రవేశపెట్టింది. 75 సంత్సరాలు ఆలస్యంగా అమ్మాయిలకు సమాన హక్కులు అందిస్తున్నామని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ఇకపై స్త్రీ, పురుషులు 21 ఏళ్ల తర్వాతే వివాహ నిర్ణయం తీసుకునే వీలుంటుందని చెప్పారు. కాగా, 18ఏళ్లకే ఓటు హక్కు కల్పించి, పెళ్లి హక్కును మాత్రం 21కి పెంచడం సమ్మతం కాదంటూ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. పెళ్లి వయసు పెంపు వ్యక్తిగత జీవితాలపై నియంత్రణే అవుతుందని ప్రతిపక్ష ఎంపీలు వాదించారు. పెళ్లి వయసుకు సంబంధించి పార్లమెంటులో గొడవ జరుగుతున్న సమయంలోనే పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఓ సంచలన తీర్పు చెప్పింది. అబ్బాయికి 21 ఏళ్లు లేకున్నా, 18ఏళ్లు నిండిన అమ్మాయి సమ్మతిస్తే కలిసి సహజీవనం చేసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. అదే సమయంలో 21ఏళ్లలోపువారు పెళ్లి చేసుకోవడానికి మాత్రం తాము సమ్మతించబోమని జడ్జిలు వ్యాఖ్యానించారు. వివరాల్లోకి వెళితే..
మన దేశంలో చట్టపరంగా ఓ పురుషుడు పెళ్లి చేసుకోవాలంటే తప్పనిసరిగా 21 సంవత్సరాలు నిండి ఉండాలి. మహిళలకు ఈ పరిమితి 18 ఏళ్లుగా ఉంది(దానిని 21కి పెంచే బిల్లు ప్రస్తుతం పార్లమెంట్ ముందుంది). కానీ 18 ఏళ్లు నిండిన తరువాత పెళ్లి చేసుకోకపోయినా స్త్రీ, పురుషులు ఇద్దరూ కలిసి ఉండొచ్చని సంచలన తీర్పును వెలువరించింది పంజాబ్, హర్యానా హైకోర్టు. 18 సంవత్సరాలు నిండితే వివాహం జరగకుండానే ఇష్టపూర్వకంగా కలిసి ఉండవచ్చని 2018 మేలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరిస్తూ తామీ ఆదేశాలిస్తున్నట్లు జడ్జిలు తెలిపారు.
పంజాబ్ లోని గురుదాస్పూర్ జిల్లాకు చెందిన ఓ ప్రేమ జంట తమకు రక్షణ కల్పించాలని వేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. వారిద్దరికీ 18 ఏళ్లు నిండాయి కానీ యువకుడికి ఇంకా పెళ్లి చేసుకునే వయసు రాలేదు. విచారణ సందర్భంగా 18 ఏళ్లు నిండిన స్త్రీ, పురుషులను పెద్దలుగా పరిగణించాలని, ఆ వయసులో మహిళలకు వివాహం కూడా చేయవచ్చని కోర్టు తెలిపింది. అయితే హిందూ వివాహ చట్టం ప్రకారం పురుషులకు 18 ఏళ్లు నిండితే పెద్దలుగా పరిగణించినప్పటికీ పెళ్లికి మాత్రం 21 ఏళ్లు ఉండాలని స్పష్టం చేసింది.
గురుదాస్ పూర్ జంటకు 21ఏళ్లు నిండకున్నా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నకారణంగా కుటుంబాల నుంచి బెదిరింపులు వస్తున్నాయని, రక్షణ కావాలని కోర్టును కోరగా.. ‘రాజ్యాంగం ప్రకారం ప్రతి వ్యక్తికి జీవించే హక్కు ఉంటుందని, ఈ కేసులో రెండో పిటీషనర్(పురుషుడు)కు వివాహం చేసుకునే వయసు రాకున్నా భారతీయులుగా రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను ఎవ్వరూ నిరోధించలేరని, వాళ్లకు భద్రత కల్పించే బాధ్యత గురుదాస్పూర్ పోలీసులదేనని సింగిల్ బెంచ్ జడ్జి జస్టిస్ హర్నేశ్ సింగ్ తీర్పు ఇచ్చారు. పార్లమెంటులో పెళ్లి వయసుపై దుమారం కొనసాగుతున్న సమయంలోనే 21 ఏళ్లు లేకున్నా యువతీ యువకులు కలిసి జీవించొచ్చని హైకోర్టు వక్కాణించడం చర్చనీయాంశమైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: High Court, Marriage, Marriage act