విశ్వనగరం హైదరాబాద్ లో జనం ఎవరు ఎవర్నీ పట్టించుకోలేనంత బిజీగా గడుపుతున్నా.. అందరిపైనా ఓ కన్నేసి ఉంచుతారు ట్రాఫిక్ పోలీసులు. సిటీ వ్యాప్తంగా వేల సంఖ్యలో అమర్చిన కెమెరాల ద్వారా ఎవరు ఏ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారో ట్రాఫిక్ పోలీసులు అంతా రికార్డు చేస్తున్నారు. ఉల్లంఘనలకు పాల్పడిన వాహనదారులు ఒకసారి కాకుంటే పదోసారైనా ట్రాఫిక్ పోలీసులకు నేరుగా దొరికిపోయి అడ్డంగా బుక్కయ్యే సందర్భాలు రోజూ చూస్తుంటాం. అయితే హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన ఓ నవాబుగారు మాత్రం ఒకటీ రెండూ కాదు ఏకంగా ఆరేళ్లపాటు ఒకే బండిపై తిరుగుతూ వందలసార్లు ట్రాఫిక్ ఉల్లంఘలకు పాల్పడ్డాడు. చివరికి ఆ బండి పోలీసులకు చిక్కే సరికి ఇదిగో ఇలా వార్త అయ్యాడు..
ట్రాఫిక్ రూల్స్ సరిగ్గా పాటించకపోతే పోలీసులు చలాన్లు వేస్తుండటం, దేవుడాంటూ వాహనదారులంతా జరిమానాలు కడుతుండటం హైదరాబాద్ నగరంలో సాధారణ విషయమే. అయితే, పెండింగ్ చలాన్లను అవార్డులుగా భావించాడో ఏమోగానీ పాతబస్తీకి చెందిన ఓ వ్యక్తి రూల్స్ పాటించకుండా 117 చలాన్లు పెండింగ్ లో ఉంచాడు. మంగళవారం నాడు నాంపల్లిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆ వ్యక్తి ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు.
ఓల్డ్ సిటీకి చెందిన మహ్మద్ ఫరీద్ ఖాన్ పేరుతో ఉన్న ఏపీ09 ఏయూ 1727 నెంబర్ గల హోండా యాక్టివాపై ఉన్న చలాన్లు చూసి ట్రాఫిక్ పోలీసులే షాకయ్యారు. ఆ చలాన్ల విలువ సుమారు రూ.30వేలుగా ఉన్నట్లు తేలింది. గడిచిన ఆరేళ్లుగా, అంటే 2015 నుంచి ఇప్పటిదాకా ఫరీద్ గారి యాక్టివా బండి పోలీసుల చేతికి చిక్కకుండా పరుగులు తీస్తూనే ఉండేది. ఆ బండిని వాడిన వ్యక్తుల్లో ఏ ఒక్కరూ ఏనాడూ హెల్మెట్ పెట్టుకోనట్లు రికార్డుల్లో ఉంది.
యాక్టివ్ బండిపై నమోదైన 117 ట్రాఫిక్ చలాన్లలో చాలా వరకు సిగ్నల్ జంప్, నో హెల్మెట్ కోటాలోనివి కాగా, కరోనా ఆంక్షల సమయంలో మాస్క్ పెట్టుకోని కారణంగానూ చలాన్లు పడ్డాయి. ఇవాళ బండిని ఆపిన పోలీసులు.. చలాన్ బిల్లు తీసి ఓనర్కు ఇద్దామని ప్రయత్నించగా, చాంతాడంత స్లిప్ వచ్చింది. పాత మోడల్ యాక్టివా బండిని మొత్తంగా అమ్మేసినా రూ. 20వేలు కూడా రావు. అలాంటిది పెండింగ్ చలాన్లు రూ.30 వేలు కట్టలేనని వాహనదారుడు చేతులెత్తేయడంతో పోలీసులు ఆ వాహనాన్ని సీజ్ చేశారు. అయితే అతనిపై కేసులేవైనా పెడతారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.