తెలంగాణకు తిరుపతిలా యాదగిరిగుట్టను కేసీఆర్ సర్కారు అభివృద్ది చేసిన క్రమంలో వైష్ణవ-శైవ అనుసంధానంగా యాదగిరిగుట్టపై లక్ష్మీనరసింహస్వామి అనుబంధ శ్రీపర్వతవర్థినీ సమేత రామలింగేశ్వరస్వామి శివాలయంలో సోమవారం మహాకుంభాభిషేకం జరుగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ దంపతులు నేడు యాదగిరిగుట్ట సన్నిధికి రానున్నారు. ఈనెల 20న మహోత్సవాలు ప్రారంభంకాగా, చివరిరోజైన సోమవారం మహాకుంభాభిషేక కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరుకానున్నారు.
తెలంగాణలోని ఆలయాల విషయంలో చినజీయర్ స్వామి వ్యవహరిస్తోన్న తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆయనను, ఆయన సలహాలను పక్కన పెట్టిన సీఎం కేసీఆర్.. శ్రీరాంపురం (తొగుట) పీఠాధిపతి మాధవానంద సరస్వతిస్వామి పర్యవేక్షణలో యాదాద్రిపై శివాలయ పునరుద్ఘాటన చేపట్టారు. శ్రీరామలింగేశ్వర స్పటికలింగ ప్రతిష్ఠ, అష్టబంధం, ప్రాణప్రతిష్ఠ్ఠ, ప్రతిష్ఠాంగహోమం, ఆఘోరమంత్రహోమం, దిగ్దేతాక్షేత్రపాల బలిహరణం, శోభాయాత్ర, కలశప్రతిష్ఠ, మధ్యాహ్నం 12.30గంటలకు మహాపూర్ణాహుతి, అవబృథం, మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు.
సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి ఉదయం 10గంటలకు హెలికాప్టర్ ద్వారాగుట్టకు చేరుకోనున్నట్టు సమాచారం. శివాలయం మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో సీఎంతోపాటు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. కాగా, శివాలయంలో పంచకుండాత్మక మహాకుంభాభిషేక వైదిక పర్వాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం ఐదోరోజు దర్శన క్యూకాంప్లెక్స్లోని చరమూర్తులకు నిత్య పూజాకైంకర్యాలు నిర్వహించారు.
శివాలయ బాహ్య ప్రాకార మండపంలోని యాగశాలలో చతుస్థానార్చనలు, ద్వారతోరణ ధ్వజకుంభారాధనలు, మూలమంత్ర హవన పూజలు కూడా చేశారు. శివాలయంలో ప్రతిష్ఠించనున్న దేవతామూర్తుల విగ్రహాలకు మూలమంత్ర పఠనాలతో హోమ పూజలను సంప్రదాయరీతిలో నిర్వహించారు. కాగా, ఆలయ ఖజానాకు ఆదివారం రూ.29,00,477 ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Telangana, Yadadri, Yadadri temple