వాళ్లిద్దరూ నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. అతడి పరిచయంతో.. అమ్మ నాన్న లేని ఆ యువతి.. తనకు జీవితంలో ఓ తోడు దొరికాడని అనుకుంది. అతడే సర్వస్వం అనుకుంది. అతడు ఏం చెబితే అది చేసింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే తాళి కట్టని భార్యలా మారింది. ప్రేమలో ఉన్నప్పుడు ఇద్దరూ కలిసి హుషారుగా తిరిగారు. టూర్లు, షికార్లు, సినిమాలు.. తెగ ఎంజాయ్ చేశారు. కానీ కొంత కాలంగా అతడిలో ఊహించని మార్పు. ఫోన్ చేస్తే కట్ చేస్తున్నాడు. కలుద్దామంటే ఏదో పని చెప్పి.. ముఖం చాటేస్తున్నాడు. ఇది చూసి ఆ యువతికి అనుమానం వచ్చింది. విషయం ఏంటని ఆరా తీస్తే అప్పుడు అసలు సంగతి చెప్పాడు. తనకు ఇంట్లో వాళ్లు వేరే సంబంధాలు చూస్తున్నారని.. ఇప్పటిదాకా జరిగిందంతా ఓ కలలా మరిచిపోవాలని ఆమెతో చెప్పాడు. దీంతో ఆ యువతి.. ప్రియుడి ఇంటి ముందు నిరసనకు దిగింది.
నిర్మల్ జిల్లా సారాంగపూర్ మండలం ధని గ్రామంలో చోటు చేసుకుందీ ఘటన. వివరాల్లోకెళ్తే.. ప్రేమించిన యువకుడితో తన పెళ్ళి జరిపించాలని డిమాండ్ చేస్తూ ధని గ్రామానికి చెందిన యువతి ప్రియుడి ఇంటి ముందు పోరాటానికి దిగింది. గ్రామానికి చెందిన యువతి అదే గ్రామానికి చెందిన కిషోర్ యాదవ్ ప్రేమలో పడ్డారు. ఆ యువతికి తల్లిదండ్రులు లేరు. కొన్ని సంవత్సరాలుగా ఆ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. తీరా పెళ్ళి ప్రస్తావన రాగానే ప్రియుడు మొఖం చాటేశాడు. తనతో ప్రియుడు పెళ్ళికి నిరాకరించడంతో ప్రేమించిన ఆ యువకుడి తోనే పెళ్లి జరిపించాలని కోరుతూ ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది.
గత నాలుగు సంవత్సరాల నుంచి తాము ప్రేమించుకున్నామని, ప్రియుడు పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పటికీ కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో తన ప్రేమను నిరాకరించడంతో తాను పోరాటం చేస్తున్నాని బాధితురాలు పేర్కోంది. తాను అతడిని పూర్తిగా నమ్మానని.. ఒక్క తాళి కట్టలేదే తప్ప.. భార్య కన్నా ఎక్కువ సేవలు చేశానని ఆమె చెప్పుకొచ్చింది. తన ప్రియుడితో పెళ్లి జరిపించాలని ఆమె కోరుతోంది. ఈ పోరాటం చేపడుతున్న యువతికి పలువురు మద్దతుగా నిలిచారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fraud, Love, Love cheating, Nirmal, Telangana, Telangana News