తెలంగాణ(Telangana)లోకి గ్రహాంతరవాసులొచ్చారా..? వికారాబాద్(Vikarabad)లో ఆకాశం నుంచి దిగిన ఆ వింత వస్తువేంటి? దానిని ఎవరు పంపించారు? ఎందుకోసం వచ్చింది? అసలు అందులో ఏముంది? తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ దీని గురించే హాట్ హాట్గా చర్చ జరిగింది. వికారాబాద్ (Vikarabad) జిల్లా మర్పల్లి మండలం మొగిలిగుండ్ల గ్రామంలో ఇవాళ ఉదయం ఓ వింత వస్తువు తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. అది ఆకాశంలో ఎగురుతూ కనిపించింది. దానిని చూసి స్థానిక ప్రజలు ఆశ్చర్యపోయారు. అదేంటో అర్థం కాక గందరగోళానికి గురయ్యారు. నక్షత్రం రాలి పడుతోందని.. గ్రహాంతరజీవులు (Aliens) ప్రయాణించే వాహననౌక అని.. టైమ్ మెషీన్ అని.. శత్రుదేశాలు ప్రయోగించిన అస్త్రమని.. ఇలా రకరకాలుగా ప్రచారం జరగడంతో... అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
పంట పొలాల్లో ఓ వింత వస్తువు దిగిందని పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో.. జనాలు అక్కడికి పరుగులు తీశారు. అది పెద్ద బెలూన్లా ఉంది. తలుపులు ఉన్నాయి. ల్యాండ్ అయ్యేందుకు వీలుగా స్టాండ్ కూడా ఉంది. కానీ లోపల ఏముందో ఎవరికీ అర్ధం కాలేదు. మనుషులు ఎవరైనా ఉన్నారని.. స్థానికులు గట్టిగా కేకలు వేశారు. కానీ లోపలి నుంచి ఎలాంటి సమాధానం లేదు. ఇంతలోనే పోలీసులు, స్థానిక ఎమ్మార్వో అక్కడికి చేరుకున్నారు. కానీ దానిపై వారికి కూడా క్లారిటీ లేదు.
కొందరు శాస్త్రవేత్తలు మాత్రం..అది వాతావరణ మార్పులను అధ్యయనం చేసేందుకు ఆకాశంలోకి పంపిన హీలియం బెలూన్ అని తెలిపారు. ఐనప్పటికీ అదేంటన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కొన్ని గంటల ఉత్కంఠ తర్బాత.. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR) సంస్థ వారు.. ఇది తాము ప్రయోగించిన స్పేస్ క్యాప్సుల్ అని చెప్పడంతో.. అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
Telangana: తెలంగాణలో యమధర్మరాజు గుడి.. ఇలా చేస్తే ఆయుష్సు పెరుగుతుందట
స్పెయిన్కు చెందిన హాలో స్పేస్ సంస్థ ఈ స్పేస్ క్యాప్సుల్ని తయారుచేసింది. అంతరిక్షంలోకి పర్యాటకులను తీసుకెళ్లాలనే లక్ష్యంతో హీలియం బెలూన్తో మెషీన్ను రూపొందించారు. ఈ యంత్రంలో నాలుగు సీట్లుంటాయి. అందులో కూర్చొని.. ఆకాశంలో విహరించవచ్చు. ఈ ప్రాజెక్టుపై చాలా కాలంగా పనిచేస్తున్న హాలో స్పేస్.. భారత దేశంలో TFIRతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ క్రమంలోనే TFIR సంస్థ మన దేశంలో ప్రయోగాలు చేస్తోంది.
హైదరాబాద్(Hyderabad)లోని ఈసీఐల్ కేంద్రంగా పనిచేసే TFIR .. బుధవారం తెల్లవారుఝామున నాలుగున్నర గంటలకు పారాచూట్ సాయంతో స్పేస్ క్యాప్సుల్ని గాల్లోకి పంపింది. అది ఎగురుకుంటూ 40 కి.మీ. ఎత్తుకు వెళ్లింది. మొదట భువనగిరి వైపు కనిపించింది. ఆ తర్వాత మేడ్చల్, సదాశివపేట వైపు వెళ్తుందని సంస్థ ప్రతినిధులు భావించారు. కానీ అదుపుతప్పి వికారాబాద్ వైపు వెళ్లింది. ప్రయోగం విఫలమైందని గుర్తించిన శాస్త్రవేత్తలు.. దానిని నిర్మానుష్య ప్రాంతంలో ల్యాండ్ చేయాలని ప్రయత్నించారు. ఈక్రమంలోనే మర్పల్లి మండలం మొగిలిగుండ్ల గ్రామ పొలాల్లో దిగింది. పారాచ్యూట్ ఓ చోట..మెషీన్ ఒక చోట పడిపోయింది.
కాగా, హాలో సంస్థ 2025లో స్పేస్ టూరిజాన్ని లాంచ్ చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే భారత్లోనూ ప్రయోగాలు చేస్తున్నారు. ఐతే వికారాబాద్లో ఆ స్పేస్ క్యాప్సుల్ క్రాష్ ల్యాండ్ కావడంతో.. సదరు కంపెనీ తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. ఎలాంటి అనుమతి లేకుండా ఇలా ఎలా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.