తెలంగాణలో ఉక్కపోతలు, వేడిగాలుల నుంచి కాస్త ఉపశమనంగా రాబోయే మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. కానీ, ధాన్యం కొనుగోళ్ల సీజన్ కావడంతో అకాల వర్షాలు ఎక్కడ కొంపముంచుతాయోనని రైతుల్లో ఆందోళన నెలకొంది. వర్షాలు, ఉష్ణోగ్రతలకు సంబంధించి భారత వాతావరణ విభాగం (ఐఎండీ) చెప్పిన వివరాలివి..
తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకూ 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితలద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల గంటకు 30 కి.మీ నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని ఐఎండీ పేర్కొంది.
ఇవాళ (ఏప్రిల్ 17, ఆదివారం) నుంచి ఏప్రిల్ 20(బుధవారం) వరకు వర్షాలు కురుస్తాయని చెప్పిన ఐఎండీ.. ఈ నెల 21 నుంచి మాత్రం వాతావరణంలో పెద్దగా మార్పులేం ఉండబోవని స్పష్టం చేసింది. మరోవైపు శనివారం ఆదిలాబాద్ జిల్లా భోరజ్లో 41.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్లో 39.9, రామగుండంలో 39.4, హైదరాబాద్ శివారు దుండిగల్లో 39.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాత్రి పూట ఉక్కపోతల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక రాత్రి పూట కనిష్ట ఉష్ణోగ్రతలు నిజామాబాద్, భద్రాచలంలో 28.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
నెలరోజులపాటు నిర్విరామంగా ఎండలు దంచికొట్టడంతో ఇబ్బంది పడ్డ ప్రజలు గత రెండు, మూడు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గడంతో ఉపశమనంగా ఫీలయ్యారు. అయితే ఇది ధాన్యం కొనుగోలు, అమ్మకాల సీజన్ కావడంతో వర్షాల వల్ల పంట ఎక్కడ పాడవుతుందోనని రైతుల్లో ఆందోళన నెలకొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IMD, Imd hyderabad, Rains, Telangana, Weather report