రిపోర్టర్ : సంతోష్
లొకేషన్ : వరంగల్
హనుమకొండ కేంద్రంలోని ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో 'వాల్తేరు వీరయ్య' విజయోత్సవ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి అభిమానుల సందడి నెలకొంది. హనుమకొండలో వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందంటున్నారు మెగా స్టార్ చిరంజీవి అభిమానులు.
ఇటీవల రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య విజయోత్సవ హంగామా స్టార్ట్ అయింది. సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఈ సినిమా విజయంగా నిలిచింది. దీంతో సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరుపుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీలో మైదానంలో ఫంక్షన్ ఏర్పాటు చేశారు. సంక్రాంతి బరిలో నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డికి పోటీగా రంగంలోకి దిగింది వాల్తేరు వీరయ్య సినిమా. బాలయ్య బాబు వీరసింహారెడ్డి కంటే ఒకరోజు ఆలస్యంగా థియేటర్లోకి వచ్చినా.. మెగా అభిమానులు వీరయ్యకు బ్రహ్మరథం పట్టారు. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య సినిమా హిట్ అంటున్నారు ప్రేక్షకులు.
బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ఈ సినిమాలో శృతిహాసన్, క్యాథరిన్ హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా హిట్ నిలిచిన వాల్తేరు వీరయ్య సినిమాకు విజయోత్సవ సభ ఏర్పాటు చేసి ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పాలని భావించగా..దానికి వరంగల్ ను వేదికగా ఎంచుకున్నారు. ఈ మేరకు శనివారం సాయంత్రం వేడుక నిర్వహించనున్నారు. దీంతో ఓరుగల్లు చిరంజీవి ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడు వాల్తేరు వీరయ్య టీం వస్తారా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Telangana, Valteru Veerayya Movie, Warangal