రిపోర్టర్ : సంతోష్
లొకేషన్ : వరంగల్
ఈ గ్రామంలోని విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలంటే పొలాల గట్లపై పడుతూ లేస్తూ పాములు, తేళ్ల మధ్య నుండి పాఠశాలలకు వెళ్లాలి. స్కూల్ కి వెళ్లిన తమ పిల్లలు మళ్ళీ తిరిగి క్షేమంగా పాఠశాల నుండి ఇంటికి తిరిగి వెళ్తారా లేదా అన్న నమ్మకం వారి తల్లిదండ్రులకు కూడా లేదు. కాకతీయ కట్టడాలు, కళావైభవంతో చారిత్రాత్మకప్రదేశంగా పిలవబడేది ఓరుగల్లు. ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన ఈ జిల్లాలో ఇప్పటికీ మారుమూర ప్రాంతాల్లో పాఠశాలలకు వెళ్లేందుకు రోడ్లు కూడా లేవు.
ఉమ్మడి వరంగల్ జిల్లా నరసింహులపేట మండలం బస్సు తండ గ్రామ శివారు మంగలితండ ప్రాథమిక పాఠశాలకు చిన్నారులు పొలం గట్లపై వెళ్ళవలసి వస్తుంది. కొన్ని సంవత్సరాల క్రిందట తండాలో ఓ దాతపంట పొలాల్లో స్థలం ఇవ్వడంతో ప్రభుత్వం ప్రాథమిక పాఠశాల భవనాన్ని అక్కడే నిర్మించారు. ఈ పాఠశాలలో 1 తరగతి నుండి 5వ తరగతి వరకు విద్యాభ్యసిస్తున్నారు. ఇక్కడ సుమారుగా 25 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే.. ఈ పాఠశాలకు వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో ఇక్కడ చదివే పిల్లలు.. ఇలా పొలం గట్లపై నడుస్తూ ఇబ్బందులు పడుతున్నారు.
వానొచ్చినా, వరదొచ్చినా ఈ దారినే స్కూల్ వెళ్లాల్సి వస్తుందని.. ఒకానొక సందర్భంలో పొలం గట్లపై పాములు, తేళ్లు దర్శనమిస్తున్నాయని విద్యార్థులు వాపోయారు. పాఠశాలకు వెళ్లేప్పుడు.. పాఠశాల నుండి తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో ఎప్పుడు ఏమవుతుందోనని భయాందోళనకు గురవుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు వినతిపత్రం అందించినా పట్టించుకోవడం లేదని..పాఠశాలకు సరైన రోడ్డు మార్గం కల్పించడంలో ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇప్పటికైనా పాఠశాలకు వెళ్లేందుకు దారిని ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Telangana, Warangal