Santhosh, News 18, Warangal
ఉదయం రోడ్డెక్కితే కానీ పూట గడవని పరిస్థితి వారిది. ఎండైనా, వానైనా రహదారుల పక్కన వ్యాపారాలు చేసుకోకుండా కుటుంబాలను పోషించుకోలేని దుస్థితి. ప్రభుత్వ ఉద్యోగాలు రాక, ఉపాధి కరువై సొంతకాళ్లపై జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులకు అధికారులు తీసుకున్న చర్యలు శాపంగా మారుతున్నాయి. హనుమకొండ నక్కలగుట్ట, బాలసముద్రంలో రోడ్డుకు ఇరువైపులా పూల, పండ్ల దుకాణాలను కార్పొరేషన్ అధికారులు తొలగించడంతో వారి జీవితాలు ఒక్కసారిగా రోడ్డునపడ్డాయి. హన్మకొండ అంబేద్కర్ సెంటర్ ఎల్ఐసీ వద్ద కూరగాయల మార్కెట్ రోడ్డుకు ఇరువైపులా చిరు వ్యాపారులు పూలు, పండ్ల వ్యాపారాన్ని కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నారు.
చిరు వ్యాపారుల తోపుడు బండ్లు, తాత్కాలిక షెడ్లతో వాహనదారులు ట్రాఫిక్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీవాసులు ట్రాఫిక్ సమస్యతో స్థానిక కార్పొరేటర్, ఎమ్మెల్యే, అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో కొన్ని నెలల క్రితం పక్కనే ఖాళీ స్థలంలో మెప్మా నిధులతో షెడ్డు నిర్మాణం చేసి వ్యాపారస్తులకు పూలు, పండ్ల సముదాయ మార్కెట్ ను ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ప్రారంభించారు. కానీ, షెడ్లలో వ్యాపారం సరిగా సాగడంలేదని తిరిగి రోడ్లకు ఇరువైపులా వ్యాపారం చేస్తున్నారు. దీంతో కార్పొరేషన్ అధికారులు షెడ్లను రోడ్డుపక్కన తొలగించిన పూలు, పండ్ల వ్యాపారుల షెడ్డు తొలగించారు.
వ్యాపారులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.
20 ఏళ్లుగా ఇక్కడే వ్యాపారం చేస్తున్నామని, కార్పొరేషన్ అధికారులు నిర్మించిన షెడ్డులో కొనుగోలు చేసేందుకు ఎవరూ రావడం లేదని వ్యాపారులు వాపోయారు. బతుకుదెరువు కోసం రోడ్లపై వ్యాపారం కొనసాగిస్తున్నామని చెప్పారు. షెడ్లు నిర్మించినా సరైన వసతులు కల్పించలేదని అన్నారు.
పూలు, పండ్లు అమ్ముకొని కుటుంబాన్నిపోషించడం తప్ప వేరే పని రాదని దాదాపు 40 మంది ఇదే వ్యాపారం చేస్తున్నామని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. కుటుంబ సభ్యులమంతా ఉదయం 4 గంటలకే చేరుకుని వ్యాపారం చేస్తే తప్ప పుటగడవదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న ఫలంగా ఖాళీ చేయిస్తే ఎలా బతకాలని న్యూస్ 18 తో అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Telangana, Warangal