రిపోర్టర్ : సంతోష్ కుమార్
లొకేషన్ : వరంగల్
అన్నదాతకు అండగా పోలీస్ కమిషనర్ రంగనాథ్ నిలిచారు. బాధిత రైతుపై తప్పుడు కేసు నమోదు కావడంపై సీరియస్ అయ్యారు. భూమిని అమ్మాలని రైతును భయాందోళనకు గురిచేసిన 11 మందిపై వివిధ సెక్షన్లపై కేసులు నమోదు చేయమని నర్సంపేట పోలీసులను ఆదేశించారు. వివరాలలోకి వెళ్తే.. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన నాడెం వీరస్వామి అనే రైతు తనకున్న రెండెకరాల భూమిలో ఇరవై గుంటల భూమిని 2018 మే నెలలో నర్సంపేట శివారులో గల ఏనుగుల తండాకు చెందిన ఎస్ బీఐ ఉద్యోగి బానోతు అనిల్ నాయక్ భార్యకు, అతడి సోదరుడు బానోత్ సునిల్ నాయక్కు అమ్మాడు. ఆ సమయంలో హద్దులు కూడా చూపించాడు. అప్పటి నుండి మిగితా భూమిలో వీరస్వామి వ్యవసాయం చేసుకుంటున్నాడు.
కాగా, గత కొద్ది కాలం నుంచి బానోత్ అనిల్ నాయక్, సునిల్ నాయక్ వీరస్వామిని మరో పది గుంటల భూమి తమకు అమ్మాలని ఒత్తిడి చేస్తున్నారు. అయితే, వీరస్వామి తనకు భూమి అమ్మడం ఇష్టం లేదని చెప్పాడు. అప్పటి నుంచి అనిల్ నాయక్, సునిల్ నాయక్ మరికొంత మందితో కలిసి పలుమార్లు వీరస్వామిని బెదిరించడంతోపాటు దాడికి కూడా యత్నించారు. వీరస్వామి పొలాన్ని ధ్వంసం చేశారు. హద్దు రాళ్లు తొలగించారు. వీరస్వామి ఎంత ప్రాధేయపడ్డా వినిపించుకోకపోగా, అతడిపైనే కులం పేరుతో తమను దూషించాడని ఫిబ్రవరి 27న నర్సంపేట పోలీసులకు అనిల్ నాయక్, సునిల్ నాయక్ ఫిర్యాదు చేశారు. వీరస్వామిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
అయితే, తనకు జరిగిన అన్యాయంపై పోలీస్ కమిషనర్ రంగనాథ్కు రైతు వీరస్వామి ఫిర్యాదు చేశారు. దీంతో డీసీపీ కరుణాకర్ తో సమగ్ర విచారణ జరిపిన అనంతరం రైతు వీరస్వామిపై తప్పుడు కేసు నమోదు కావడంపై సీపీ సీరియస్ అయ్యారు. రైతు వీరస్వామిపై పెట్టిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ఫాల్స్ కేసుగా పరిగణించి, తీసివేయాలని, అలాగే, బానోత్ అనిల్ నాయక్, సునిల్ నాయక్, వీరి తండ్రి సీతారాంనాయక్, చింతల నిరంజన్ తోపాటు వీరికి సహకరించిన మరో ఏడుగురిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో 11 మంది నిందితులపై 386, 290, 447, 427, 420, 506, 143, 149 సెక్షన్లపై నర్సంపేట పోలీసులు ఈనెల 11న కేసులు నమోదు చేశారు.
కాగా, పోలీస్ కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో తనకు న్యాయం జరిగిందని బాధిత రైతు నాడెం వీరస్వామి సంతోషం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేసిన వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ ఫ్లెక్సీకి రైతు నాడెం వీరస్వామి, రాజ్యలక్ష్మీ దంపతులు శుక్రవారం క్షీరాభిషేకం చేశారు. డీసీపీ కరుణాకర్కు ధన్యవాదాలు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Farmers, Local News, Warangal