Santosh, News18, Warangal
ఈ మధ్య కాలంలో ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేయకపోతే చంపేస్తాం లేదా చస్తాం అని బెదిరించడం ఆనవాయితీగా మారింది. ముఖ్యంగా రెవెన్యూ ఆఫీసులలో ఈ తరహా ఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తహశీల్ధార్ కార్యాలయంలో గతంలో నల్గొండ జిల్లా (Nalgonda District) లో ఓ మహిళా తహశీల్దార్ పై ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఆ ఘటనలో మహిళా తహశీల్ధార్ మరణించారు. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిరసనలు కూడా జరిగాయి. అప్పుడు వీరంతా విధులను బాయికాట్ కూడా చేసారు. అయితే, అప్పుడు ప్రభుత్వం హామీ ఇవ్వడంతోవిధులకు హాజరు అవుతున్నారు. కానీ.. అప్పుడప్పుడు ఇలాంటి బెదిరింపులు మాత్రం వస్తూనే ఉన్నాయి. మరి ఇలా జరగడానికి ఉద్యోగుల తప్పిదమే కారణమా? సామాన్య ప్రజలు సహనం కోల్పోయి ఇలా చేస్తున్నారా..?
రిజిస్ట్రేషన్ చేయండి.. లేదంటే నీపై పెట్రోల్ పోసి చంపుతాం అని తాజాగా కొందరు మహిళా తహసీల్దార్ ను బెదిరించారు. ఈ ఘటన వరంగల్ జిల్లా (Warangal District) నల్లబెల్లి మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో జరిగింది. బాధిత తహసీల్దార్ దూలం మంజుల తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బిల్నాయక్ తండాకు గుగులోత్ పద్మ అనే మహిళ భూమి రిజిస్ట్రేషన్ చేయాలని స్లాట్ బుక్ చేసుకుంది. ఈ భూమిపై బ్యాంకు లోన్ తీసుకున్నట్లు గుర్తించారు. అంతే కాకుండా పేపర్లు సక్రమంగా లేకపోవడంతో రిజిస్ట్రేషన్ చేసేందుకు నిరాకరిస్తూ బ్యాంక్ నుంచి నోడ్యూస్ సర్టిఫికెట్ తీసుకురావాలని సూచించారు. ఈ విషయాన్ని పద్మ వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
కాగా, ఇదే విషయంపై బిల్నాయక్ తండాకు చెందిన కొందరు వ్యక్తులు సోమవారం సాయంత్రం తహసీల్దార్ కార్యాలయంలోకి ప్రవేశించారు. స్లాట్ బుక్ చేసుకున్నాం రిజిస్ట్రేషన్ చేయండి. నోడ్యూస్ ఎందుకు తీసుకురావాలి అంటూ నిలదీశారు. వెంటనే ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు కార్యాలయానికి చేరుకోగా, వారి ముందే రిజిస్ట్రేషన్ చేయకపోతే నీపై పెట్రోల్ పోసి చంపేస్తామని తహసీల్దార్ ను దుర్భాషలాడారు. నల్లబెల్లి నుంచి నువ్వు స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని, లేకుంటే నిన్ను చంపి జైలుకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని అంటూ భయభ్రాంతులకు గురిచేసినట్లు తహసీల్దార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆమె తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Telangana, Warangal