రిపోర్టర్ : సంతోష్
లొకేషన్ : వరంగల్
గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటూ పాఠాలు బోధించే గురువుని సైతం దేవుడిలా భావించే మన సంస్కృతికి సిగ్గుచేటు ఈ ఘటన. యావత్ ఉపాధ్యాయులు తలదించుకునేలా చేస్తున్నాడు ఓ తాగుబోతు ఉపాధ్యాయుడు. మద్యం తాగి వచ్చి, అసభ్యంగా ప్రవర్తించే మాథ్స్ టీచర్ మాకు వద్దని విద్యార్థుల ధర్నా నిర్వహించారు.
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని సీతంపేట స్కూల్ లో చోటుచేసుకుంది ఈ ఘటన. ఈ పాఠశాలలో మాథ్స్ బోధన చేసే టీచర్ మద్యం సేవించి స్కూలుకు వచ్చి విద్యార్థులను తిట్టడం, టాయిలెట్లకు వెళ్లే విద్యార్థులు విద్యార్థినిల వెంట వెళ్లడం చేస్తున్నాడని.. ఎన్నిసార్లు చెప్పినా ఉపాధ్యాయుడిలో మార్పు రాలేదని పిల్లలు వాపోతున్నారు.
అధికారులు వెంటనే చర్యలు తీసుకొని టీచర్ ను సస్పెండ్ చేయలని డిమాండ్ చేశారు. టీచర్ ను విచారించి చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు తెలపడంతో విద్యార్థులు ధర్నా విరమించారు. జెడ్పి ఉన్నత పాఠశాలలో 10వ తరగతి బోధిస్తున్న లెక్కలు బోధించే ఉపాధ్యాయుడు కృష్ణ తాగి వచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తూ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ.. విద్యార్థులు, ఉపాధ్యాయులపై సదరు ఉపాధ్యాయుడు అసభ్య పాదజాలంతో దూషిస్తున్నారని వాపోయారు. ఈ ఘటనపై డీఈఓ రామారావును వివరణ కోరగా ఉపాధ్యాయుడిపై తక్షణమే చర్యలు తీసుకొని మరో ఉపాధ్యాయుడిని నియమిస్తామని తెలిపారు.
సమాజంలో ఇలాంటి ఉపాధ్యాయులు ఉన్నంతవరకు ఉపాధ్యాయులకు చెడ్డపేరు వస్తుందని, ఇలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యార్థులను కన్న పిల్లల్లా భావించి తల్లిదండ్రుల స్థానంలో ఉండి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాలి కానీ ఇదెక్కడి పాడుబుద్దని అంటున్నారు. ఇలాంటి సంఘటనల వల్ల తమ పిల్లలను పాఠశాలలకు పంపాలన్నా భయపడాల్సి వస్తుందని తల్లిదండ్రులు వాపోతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Telangana, Warangal