రిపోర్టర్ : సంతోష్ కుమార్
లొకేషన్ : వరంగల్
దైవదర్శనానికి తిరుపతి వెళ్ళిన ఓ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. ఇంట్లో శుభకార్యం చేసుకొని దైవదర్శనాల కోసం తీర్థయాత్రలకు వెళ్లిన ఓ కుటుంబానికి చేదు అనుభవం ఎదురయింది. కుటుంబ సమేతంగా దైవదర్శనానికి వెళ్లగా ఇంట్లో చోరీ జరిగిన సంఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోనాపురంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోనాపురం గ్రామానికి చెందిన శోభా సుధాకర్ దంపతులు వారి కుమారుడు నాగరాజుకు వివాహం ఈనెల 17న జరిపించారు. కాగా నూతన వధూవరులతో దైవ దర్శనం కోసం సాయంత్రం కుటుంబ సమేతంగా ఇంటికి తాళం వేసి వేములవాడ వెళ్లారు.
అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఇంటిముందు పశువులను కట్టి వేయడం కోసం ఏర్పాటుచేసిన గడ్డపార సహాయంతో ఇంటి తాళాన్ని ధ్వంసం చేసి ఇంట్లోకి చొరబడి అల్మారా లో ఉన్న ఏడు తులాల బంగారం, మూడు లక్షల నగదును దొంగిలించుకుని వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఉదయం ఇంటికి సమీపంలో ఉన్న సుధాకర్ తల్లి సరోజ వచ్చి చూడగా ఇంటి తలుపు తాళం ధ్వంసం చేసి ఉండగా చుట్టుపక్కల వారిని పిలిచింది. వారు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న నర్సంపేట అసిస్టెంట్ కమిషనర్ సంపత్ రావు, నెక్కొండ సిఐ మహేందర్ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి క్లూస్ టీంను రప్పించి వేలిముద్రలను సేకరించారు.
గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న బాధిత కుటుంబ సభ్యులు వేములవాడ నుంచి వచ్చారు. సుమారు ఎనిమిది లక్షలు నష్టం జరిగిందని ఆవేదనకు గురయ్యారు. సుధాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలు ఇల్లు వదిలి ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో వెళ్లినా , తీర్థయాత్రలకు వెళ్తే పండుగల సమయంలో ఊరు వదిలి వెళ్ళేటప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన సదరు ఇంటిపై పోలీసులు నిఘా వేసి ఉంచుతారన్నారు. ప్రజలు ముందుగా ఈ మేరకు సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Robbery, WARANGAL DISTRICT