(M. Venu, News18, Mulugu)
ఎంబీబీఎస్ (MBBS) చదివి డాక్టర్ అవ్వాలంటే ఎంతో వ్యయప్రయాసలతో పాటు బోలెడంత జ్ఞానం, ఓపికతో కూడుకున్న పని. కానీ కొందరు కేటుగాళ్లు మాత్రం ఎలాంటి విద్యార్హతలు లేకుండానే ఎంబీబీఎస్ డాక్టర్ల పేరుతో చలామణీ అవుతూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. పలానా ఎంబీబీఎస్ అని బోర్డు పెడితే చాలు గుడ్డిగా నమ్మి నకిలీ డాక్టర్ల వద్ద వైద్యం చేసుకునే అనేకమంది అమాయకులు ఈ రోజుల్లో అనేకం. వరంగల్ నగరంలో నకిలీ డాక్టర్ (fake Doctor) గుట్టు రట్టయింది. ఎటువంటి అర్హత లేకుండానే మార్కెట్లో వైద్యుడిగా (Doctor) చలామణి అవుతూ ఏకంగా నాలుగేళ్లలో 43 వేల మంది రోగులకు వివిధ ఆరోగ్య పరీక్షలను నిర్వహించాడు. పక్కా సమాచారంతో వరంగల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఈ నకిలీ డాక్టర్నీ అరెస్టు చేశారు.
ఈమేరకు పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ముజాతాబా అహ్మద్ అనే వ్యక్తి బీఫార్మసీ చదువును మధ్యలో ఆపేసి స్థానికంగా ఓ డాక్టర్ వద్ద అసిస్టెంట్గా పనిచేశాడు. అసిస్టెంట్గా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో.. ఎలాగూ సహాయకుడిగా పనిచేసిన అనుభవం ఉంది, డాక్టర్ కావాలంటే ఇంకేం కావాలి అనుకున్నాడేమో ఏకంగా ఎంబీబీఎస్ డాక్టర్ అవతారం ఎత్తాడు ముజాతాబా అహ్మద్. దీంతో పాటు ఎయిమ్స్లో (AIIIMS) ఎంబీబీఎస్ పూర్తిచేసినట్టు తనకుతానే నకిలీ సర్టిఫికెట్ సృష్టించాడు. తనతో పాటు సంతోష్ కుమార్ను ల్యాబ్ టెక్నీషియన్గా పెట్టుకున్నాడు ముజాతాబా అహ్మద్. వీరిద్దరు కలిసి వరంగల్ నగరంలోనీ చింతల్ ప్రాంతంలో హెల్త్ కేర్ ఫార్మసీ (Health care Pharmacy) పేరుతో హాస్పిటల్ ప్రారంభించారు.
మూడు సూదులు, ఆరు గోళీలుగా సాగిన వ్యాపారం:
ఇద్దరు కలిసి స్థాపించిన హాస్పిటల్ (Hospital) మూడు సూదులు ఆరు గోలీలు అన్న మాదిరిగా వ్యాపారం కొనసాగింది. ఏకంగా బోర్డుకు ఎంబీబీఎస్ డాక్టర్ అని పెట్టడంతో అనేకమంది అమాయక ప్రజలు ఇక్కడ వైద్యం చేయించుకున్నారు. చికిత్స నిమిత్తం వచ్చిన వారికి అనేక రకాలుగా ల్యాబ్, వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన చికిత్స కోసం ఇతర డాక్టర్లకు రెఫరెన్స్ చేస్తూ కమీషన్ తీసుకునేవాడు ముజాతాబా అహ్మద్. ఇలా నాలుగు సంవత్సరాలలో 43 వేల మందికి పైగా రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక నకిలీ వైద్యుడి గురించి సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు ముజాతాబా అహ్మద్, సంతోష్ కుమార్ లను అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ. 1,90,000 నగదుతో పాటు ఒక ల్యాప్ టాప్, మూడు ఫోన్లు, ల్యాబ్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇద్దరు నిందితులలో ముజాతాబా అహ్మద్ వరంగల్ (Warangal) నగరానికి చెందిన వాడు కాగా, సంతోష్ దామర గ్రామానికి చెందిన వాడుగా పోలీసులు గుర్తించారు. హనుమకొండ, వరంగల్ జంట నగరాలు ఎక్కువ జనాభాతో రద్దీగా ఉంటాయి. హనుమకొండ ప్రాంతంలో ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నాయి. కానీ ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎవరు అసలు డాక్టర్? ఎవరు నకిలీ డాక్టర్? అనే విషయం మాత్రం ప్రజలకు అర్థం కావడం లేదు. ప్రజలకు తెలిసిందల్లా ఒక్కటే, అనారోగ్యానికి గురైతే ఆసుపత్రికి వెళ్లాలి. బోర్డుపై డాక్టర్ పేరు, వారి అర్హత ఎంబీబీఎస్, ఎమ్మెస్ సర్జన్, ఆర్థోపెడిక్.. ఇలాంటి ఎన్నో రకాల అర్హతలు పెట్టుకుంటారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నగరంలో డాక్టర్ల ముసుగులో ఉన్న నకిలీ డాక్టర్లను గుర్తించి సామాన్య ప్రజలను కాపాడాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Doctors, Fake medicine, Local News, Medicine, Police arrest, Treatment, Warangal