UNION MINISTER KISHAN REDDY CLARIFIES ON MP ASADUDDIN OWAISI COMMENTS ON HYDERABAD AS UNION TERRITORY AK
Hyderabad: కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్.. క్లారిటీ ఇచ్చిన కిషన్ రెడ్డి
ప్రతీకాత్మక చిత్రం
Kishan Reddy: హైదరాబాద్ యూటీ చేస్తారని అసదుద్దీన్ మాట్లాడుతున్నారన్న కిషన్ రెడ్డి.. దీనిపై సమాధానం చెప్పేలోపే పార్లమెంట్ నుంచి పారిపోయారని కిషన్ రెడ్డి విమర్శించారు.
హైదరాబాద్తో పాటు దేశంలోని మరికొన్ని నగరాలను కేంద్ర పాలిత ప్రాంతాలు చేసే ఆలోచన కేంద్రానికి ఉందని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేసే ఆలోచన కేంద్రానికి లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ యూటీ చేస్తారని అసదుద్దీన్ మాట్లాడుతున్నారన్న కిషన్ రెడ్డి.. దీనిపై సమాధానం చెప్పేలోపే పార్లమెంట్ నుంచి పారిపోయారని కిషన్ రెడ్డి విమర్శించారు. అయినా అబద్ధాలు చెప్పడం టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు అలవాటే అని ఆయన ధ్వజమెత్తారు. హైదరాబాద్ సహా మరే ఇతర నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయబోమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
అంతకుమందు మజ్లీస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ లోక్సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే అవకాశం లేకపోలేదని వ్యాఖ్యానించారు. శనివారం జమ్మూ కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై లోక్సభలో శనివారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన అసదుద్దీన్.. "ఇది ప్రారంభం మాత్రమే. ప్రభుత్వం భవిష్యత్తులో హైదరాబాద్, చెన్నై, ముంబై వంటి నగరాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చే అవకాశం ఉంది"అని అన్నారు. అలాగే ఈ ఏడాది బడ్జెట్లో మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కేటాయింపులకు పెరిగాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను అసదుద్దీన్ ఖండించారు. మైనారిటీ వ్యవహారాల శాఖ బడ్జెట్ నుంచి రూ. 1,024 కోట్లను తగ్గించారని ఆరోపించారు. రూ. 5,029 కోట్లు అంచనా వేయబడిన బడ్జెట్ రూ. 4,005 తగ్గిందని అన్నారు. ప్రస్తుతం సంవత్సరంలో 20.36 శాతం కేటాయింపులు తగ్గాయని తెలిపారు. అయితే అసదుద్దీన్ వ్యాఖ్యలపై స్పందించిన కిషన్ రెడ్డి.. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేసే ఆలోచన కేంద్రానికి లేదని స్పష్టం చేశారు.