మెదక్ జిల్లా.. శివునూరులో విషాదం జరిగింది. ఓ పూరింట్లో గ్యాస్ సిలిండర్ పేలి.. ఇద్దరు చనిపోయారు. వివరాల్ని గమనిస్తే.. హైదరాబాద్లో ఉంటున్న అంజమ్మ.. పెన్షన్ కోసం.. మెదక్ జిల్లాలోని తన ఊరు శివునూరుకి వెళ్లింది. పూరింట్లో ఆరేళ్ల మనవరాలు మధుతో కలిసి... రాత్రి భోజనం చేసింది. తర్వాత ఇద్దరూ నిద్రపోయారు.
అర్థరాత్రి 3 సమయంలో... ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. గ్యాస్ సిలిండర్ పేలిపోయి... క్షణాల్లో ఇల్లంతా మంటలొచ్చేశాయి. చుట్టుపక్కల వారు నిద్రలేచి చూసే సరికే.. ఇల్లు మొత్తం తగలబడిపోయింది. నిద్రలో ఉన్నవారు.. అలాగే కాలిపోయి చనిపోయారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంత దారుణంగా ఉన్నాయని స్థానికులు తెలిపారు. ఈ వార్త అందర్నీ విషాదంలో ముంచేసింది.
మనం వాడే చాలా గ్యాస్ సిలిండర్లు తుప్పు పట్టినట్లు ఉంటాయి. కొన్ని కంపెనీలేమో వాటిని మార్చవు. మళ్లీ మళ్లీ వాడుతూనే ఉంటాయి. గ్యాస్ అయిపోతే.. మరో సిలిండర్ కోసం ఆర్డర్ ఇస్తాం. ఆ వచ్చే సిలిండర్ కూడా ఏడ్చినట్టే ఉంటుంది. అది మంచిదో కాదో, పేలిపోయే ప్రమాదం ఉంటుందా అన్నది మనకు తెలియదు. నాణ్యతా పరీక్షలు సరిగ్గా జరుగుతున్నాయా అన్నది తెలియదు. అధికారులు తరచూ ఇలాంటి పరీక్షలు జరుపుతూ ఉంటే.. ఈ విషాదం జరిగేది కాదేమో. ఇద్దరి ప్రాణాలు ఆహుతైపోయాయి. ఇల్లు తగలబడిపోయింది. ఆరేళ్ల పాప.. ప్రపంచాన్ని చూడకుండానే వెళ్లిపోయింది. దీనికి ఎవరు బాధ్యులని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fire Accident, Medak, Telangana News