ఉద్యోగం (Job) చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న వ్యక్తి హఠాత్తుగా మరణిస్తే ఆ కుటుంబ సభ్యులు ఆసరా కోల్పోతారు. ఇబ్బందుల్లో కూరుకుపోతారు. ఆరోగ్య కారణాల రీత్యా ఉద్యోగం చేయలేని అసక్తత ఏర్పడినా అదే పరిస్థితి. ఇలాంటి కుటుంబాలను ఆదుకోడానికే కారుణ్య నియామకాలను (compassionate appointments ) ప్రవేశపెట్టారు. తాజాగా తెలంగాణలోని ఓ విభాగంలో కారుణ్య నియామకాలకు రంగం సిద్ధమైంది. ఆర్టీసీ (TSRTCలో కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. కార్పొరేషన్ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు మరణించిన ఉద్యోగి కుటుంబ సభ్యుల్లో ఒకరిని ఉద్యోగంలోకి తీసుకోనున్నారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గురువారం సర్క్యూలర్ విడుదల చేశారు.
కొవిడ్ -19 విపత్కర పరిస్థితులు, డీజిల్, ఇతర ఖర్చుల పెరుగుదల, ఉద్యోగుల క్రమబద్ధీకరణతో సంస్థకు అదనపు సిబ్బంది అవసరం పెరిగింది. ఈ మేరకు 2019 నుంచి పెండింగ్లో ఉంటూ వస్తున్న కారుణ్య నియామకాలను (Karunya appointments) భర్తీ చేయాలని సంస్థ నిర్ణయించినట్లు ఎండీ పేర్కొన్నారు. ఉద్యోగి మరణించిన తేదీ ఆధారంగా సీనియారిటీని అనుసరించి కారుణ్య నియామకాలు చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు.
మూడేళ్ల పనితీరు ఆధారంగా..
ఉత్తర్వు ప్రకారం.. ఉద్యోగి కుటుంబ సభ్యుల అర్హతలను అనుసరించి డ్రైవర్ గ్రేడ్ – 2, కండక్టర్ గ్రేడ్-2, ఆర్టీసీ కానిస్టేబుల్, శ్రామిక్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డ్రైవర్లకు రూ.19వేలు, కండక్టర్లకు రూ.17వేలు, ఆర్టీసీ కానిస్టేబుళ్లు, శ్రామిక్లకు రూ.15 వేల చొప్పున జీతాలు ఇవ్వనున్నారు. కారుణ్య నియామకాలు పొందిన సిబ్బంది మూడేళ్ల పనితీరు ఆధారంగా వారిని రెగ్యులర్ చేస్తారు. పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ టెస్ట్ నిర్వహించి అందులో 60 శాతం మార్కులు సాధించడంతో పాటు, ప్రతి ఏడాది 240 రోజులు పనిచేసిన వారు, ప్రయాణికులతో వారి ప్రవర్తనను ఆధారంగా చేసుకొని రెగ్యులరైజ్ చేస్తారు. వచ్చిన దరఖాస్తుల్లో సీనియారిటీని అనుసరించి సంస్థ అవసరాల మేరకు విడతల వారీగా పోస్టులను భర్తీ చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కారుణ్య నియామకం వివరాలు..
అయితే ఈ కారుణ్య నియామకాలపై (Karunya appointments) చాలా మందికి చాలా అనుమానాలున్నాయి. ఎప్పుడిస్తారు, ఎలా ఇస్తారు, ఎవరికిస్తారు, ఎక్కడిస్తారు, ఎప్పటిలోపు ఇవ్వాలి, ఏ పోస్టులిస్తారు ఇలా అనేక అనుమానాలున్నాయి. మీకోసమే ఈ సమాచారం
కారుణ్య నియామకాలు : రెండు రకాలు. ఒకటి : మరణించిన ఉద్యోగి కుటుంబీకులకు ఇచ్చేది. రెండు : వైద్య కారణాల వల్ల ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగి ఆధారితులకు ఇచ్చేది.
కారుణ్య నియామకాల లక్ష్యం ఏమిటి : మరణించిన లేక అనారోగ్య సమస్య వల్ల ఉద్యోగం చేయలేని అసక్తత ఏర్పడిన ఉద్యోగుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడం.
కారుణ్య నియామకాలకు అర్హులెవరు?
మరణించిన ఉద్యోగి వారసులు, వైద్య కారణాల వల్ల రిటైర్మెంట్ తీసుకున్న ఉద్యోగి వారసులు, ఏడేళ్లపాటు కనిపించకుండాపోయిన ఉద్యోగి వారసులు ఈ నియామకాలకు అర్హులు. వైద్య కారణాల వల్ల కనీసం ఐదేళ్ల సర్వీసు ఉండగా రిటైర్మెంటు తీసుకుంటే ఆ ఉద్యోగిపై ఆధారపడిన కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇస్తారు. కనిపించకుండాపోయిన ఉద్యోగి విషయంలో పోలీసు రిపోర్టు ఆధారంగా ఉద్యోగం ఇస్తారు.
ఎవరికిస్తారు?
ఎలాంటి కారణ్య నియామకమైనా ఎవరికిస్తారన్న అనుమానం చాలా మందికి ఉంటుంది. దానికి విధివిధానాలు ఉన్నాయి. 1.ఉద్యోగి భార్య/భర్త, 2.కుమారుడు/కుమార్తె, 3.ఉద్యోగి మరణించిన నాటికి కనీసం ఐదేళ్ల మునుపు చట్టబద్ధంగా దత్తత తీసుకున్న కుమారుడు/కుమార్తె, 4.ఉద్యోగి భార్య/భర్త నియామకానికి ఇష్టపడని సందర్భంలో ఆ కుటుంబంపై ఆధారితురాలైన వివాహిత కుమార్తె, 5. మరణించిన ఉద్యోగికి ఒక వివాహిత కుమార్తె, మైనర్ కుమార్తె ఉంటే వారి తల్లి సూచించినవారికి ఉద్యోగం ఇస్తారు, 6.ఉద్యోగి అవివాహితుడై మరణించినపుడు అతని తమ్ముడు, చెల్లెలు కారుణ్య నియామకానికి అర్హులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.