(G.SrinivasReddy,News18,Khammam)
వైఎస్ షర్మిల. మొన్నటిదాకా తండ్రి చాటు కుమార్తె.. నిన్నటిదాకా అన్న వదిలిన బాణం.. కానీ నేడు ఓ పరిణతి చెందిన రాజకీయనాయకురాలు. తెలంగాణలో తన రాజకీయాలను ముమ్మరం చేయడానికి వైఎస్ఆర్ (YSRTP)తెలంగాణ (Telangana)పేరుతో ఓ పార్టీని స్థాపించారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు తండ్రి, అన్నయ్య తరహాలోనే పాదయాత్రను కొనసాగిస్తున్న వైఎస్ షర్మిల ఇప్పుడు తన పొలిటికల్ టార్గెట్ని ఉమ్మడి ఖమ్మం(Khammam)జిల్లాగా చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మండుటెండల్ని సైతం లెక్కచేయకుండా 87రోజులుగా పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిల (YS Sharmila).. ప్రజల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్(TRS) ప్రభుత్వం ప్రజలకు ఏమి చేయలేదన్న సంకేతంతో పాటు సీఎం కేసీఆర్(KCR) టార్గెట్గా ఘాటు విమర్శలు, ఆరోపణలతో డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ నుంచి మంత్రులు కేటీఆర్(KTR), హరీష్రావు(Harishrao)ను సూటిగా ప్రశ్నిస్తున్నారు షర్మిల.
తండ్రి పాలన గుర్తు చేస్తూ..
తన తండ్రి వైఎస్ఆర్ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలకు ప్రస్తుతం అధికారంలో ఉన్న కేసీఆర్ మంగళం పాడుతున్నారనే విషయాన్ని తన పాదయాత్ర సభల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. అలాగే తానకు అవకాశం కల్పిస్తే చేయబోయే కార్యక్రమాలు, పథకాలతో కూడిన ఓ ప్రత్యేక డేటాను రూపొందించుకున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో రాజకీయ శక్తిగా ఎదగాలన్న తన శ్రమ వృధా కాకుండా గెలిచే అవకాశాలు మెండుగా ఉన్న ప్రాంతాలపైనే షర్మిల ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మరికొన్ని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా ఆమె మాటలను చూస్తే అర్ధమవుతోంది.
బలం ఉన్నచోట గెలవాలని..
ఇందులో భాగంగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోనూ పర్యటిస్తున్నారు షర్మిల. ప్రతి మండల కేంద్రంలోనూ.. తన పాదయాత్ర దారిలో తారసపడే ప్రతి గ్రామంలోనూ ప్రజలను పలకరిస్తూ, ప్రభుత్వంపై నేరుగా విమర్శలు చేస్తున్నారు. వైఎస్సార్టీపీగా తెలంగాణలో పెద్దగా బేస్ లేకపోయినా, ఎట్టి పరిస్థితుల్లోనూ కనీసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖాతా తెరవాలన్నది వైఎస్షర్మిల వ్యూహంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
అన్నీ అంశాలను పరిగణలోకి తీసుకొని..
ఆమె 2014 ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ సాధించిన సీట్లు, ఓట్లను షర్మిల బేరీజు వేసుకొని వ్యూహాలు రచిస్తున్నట్లుగా కనిపిస్తోంది. నిజానికి అప్పట్లో తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్న రోజుల్లోనూ వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ఖమ్మం లోక్సభతో పాటు మరో మూడు అసెంబ్లీ స్థానాల్ని వైసీపీ కైవసం చేసుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తీవ్రమైన ప్రభావాన్ని చూపిన అప్పటి ఎన్నికల తరహాలోనే ఇక్కడ ఖాతా తెరిచే అవకాశం ఎంతమేరకు ఉంటుందన్న దానిపై వైఎస్ షర్మిల వ్యూహరచన చేస్తున్నట్టు చెబుతున్నారు.
శ్రమకు తగ్గ ఫలితం దక్కేలా..
2014 ఎన్నికల్లో వైరా, పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాలను వైసీపీ గెల్చుకోగా, మరికొన్ని చోట్ల ఓటింగ్ శాతం మెరుగ్గా నమోదు చేసుకుంది. ఎనిమిదేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతీయ సెంటిమెంట్ బలంగా ఉంది. కానీ ఇన్నేళ్ల తర్వాత అది అంత తీవ్రంగా లేదంటున్నారు. దీనికి తోడుగా ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి, వ్యతిరేకత వంటి అంశాలను తమకు అనువుగా మార్చుకొని బోణీ కొట్టాలన్నది వైఎస్సార్టీపీ వ్యూహంగా చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. దీనికోసం రాష్ట్రం మొత్తం ప్రభావం చూపలేని పరిస్థితుల్లో తమ ప్రభావం బలంగా ఉండే చోట్ల ఫోకస్ పెట్టాలని భావిస్తున్నారు. అందుకే దివంగతనేత వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాల ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు, ఆయన్ని అభిమానించే ప్రాంతాలను గుర్తించి అక్కడే తమ సమయాన్ని పెంచుకుంటున్నరు షర్మిల.
ఇది చదవండి : గ్యాంగ్ రేప్ ఉదంతంలో ట్విస్ట్.. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్పై కేసు
పక్కా ప్రణాళికతోనే..
ఆ విధంగా చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాలేరు, పినపాక, అశ్వరావుపేట, కొత్తగూడెం, వైరా, సత్తుపల్లి, మధిరలపై దృష్టి పెట్టారు. పాలేరు నుంచి వైఎస్ షర్మిల బరిలోకి దిగుతారన్న ప్రచారం కూడా జరిగింది. దీనికితోడు నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్ సహా హైదరాబాద్లోని కొన్ని నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టినట్టుగా చెబుతున్నారు. ఏదైనా పార్టీతో పొత్తుకు వెళ్లాల్సి వచ్చినా సీట్ల సర్దుబాటులో తమకు మేలు జరిగేలా చూసుకునే యోచన కూడా చెబుతున్నారు. ఇన్ని రకాలుగా రాజకీయ వ్యూహాలు రచిస్తున్న వైఎస్ షర్మిలకు ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Khammam, Telangana Politics, YS Sharmila