తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఓ వైపు తెలంగాణలో బీజేపీ బలపడుతుంటంతో.. ఆ పార్టీకి చెక్ చెప్పేందుకు ఏం చేయాలో అన్నీ చేస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. తెలంగాణ(Telangana) ఆవిర్భావానికి ముందు నుంచి రాష్ట్రానికి నిజాం నుంచి విముక్తి లభించిన సెప్టెంబర్ 17న కూడా అధికారికంగా జరుపుకోవాలనే డిమాండ్ ఉంది. తెలంగాణ ఏర్పడితే సెప్టెంబర్ 17న అధికారికంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని గతంలో కేసీఆర్(KCR) ప్రకటించారు. కానీ తెలంగాణ ఏర్పడిన తరువాత ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17న అధికారిక కార్యక్రమాలు నిర్వహించేందుకు అంగీకరించడం లేదు. మజ్లిస్(Majlis) ఒత్తిడి కారణంగానే టీఆర్ఎస్ ఈ రకంగా చేస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది.
అయితే తెలంగాణలో బీజేపీ బలపడుతుండటంతో.. రాబోయే రోజుల్లో బీజేపీ ఈ అంశాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లి తమను టార్గెట్ చేసే అవకాశం ఉండటంపై టీఆర్ఎస్ సర్కార్ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది నుంచి సెప్టెంబర్ 17న అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించే అవకాశం ఉందని.. తెలంగాణ మంత్రివర్గంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నిజంగానే తెలంగాణ ప్రభుత్వం ఈ రకమైన నిర్ణయం తీసుకుంటే.. టీఆర్ఎస్ బీజేపీకి చెక్ చెప్పినట్టు అవుతుందా ? లేక ? ఆ పార్టీకి మరింత ఊతమిచ్చినట్టు అవుతుందా ? అన్న చర్చ కూడా సాగుతోంది.
ఇప్పటివరకు ఈ అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోని ప్రభుత్వం.. బీజేపీ ఒత్తిడి కారణంగానే ఈ రకమైన నిర్ణయం తీసుకుందనే వాదనలు మొదలవుతాయి. అదే జరిగితే.. తమ ఒత్తిడి కారణంగానే టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రకమైన నిర్ణయం తీసుకుందని బీజేపీ చెప్పొచ్చు. ఇదంతా తెలంగాణలో బీజేపీ బలం పుంజుకోవడం వల్లే అని ఆ పార్టీ ప్రచారం చేసుకునే అవకాశం లేకపోలేదు.
Hyderabad: రాత్రి పది గంటల తర్వాత హైదరాబాదీలు స్విగ్గీలో ఏం ఆర్డర్ పెడుతున్నారో తెలుసా..?
Raja Singh wife: బీజేపీ అధిష్టానానికి ఎమ్మెల్యే రాజాసింగ్ సతీమణి లేఖ.. ఏం రాశారంటే..?
ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిజంగానే ఈ రకమైన నిర్ణయం తీసుకుంటుందా ? లేక ఎప్పటిలాగానే కేవలం పార్టీపరంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందా ? అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈసారి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలనే అంశంపై పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. తాము అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించిన బీజేపీ.. మరోసారి ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సిద్ధమవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.