తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి(JanaReddy) పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలతో కలసి పని చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్(BRS) పార్టీతో కాంగ్రెస్ పొత్తు అంశంపై జానారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడు దీనిపై ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు. తన కుమారుడు కొడుకు వచ్చే ఎన్నికల్లో నాగార్జున సాగర్(Nagarjuna Sagar) నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని జానారెడ్డి క్లారిటీ తెలిపారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఎంపీగా అనర్హత వేటు వేయడాన్ని ఖండిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. అందులో భాగంగా జానారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తామని, బీఆర్ఎస్ కూడా ఇప్పటికే రాహుల్ గాంధీకి అండగా నిలిచినట్లు చెప్పారు.
పార్లమెంట్లో అదానీ వ్యవహారంపై రాహుల్ గాంధీ మాట్లాడకుండా చేసేందుకే అనర్హత వేటు వేశారన్నారు. అయితే జానారెడ్డి పొత్తులపై చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. గతంలో బీఆర్ఎస్తో పొత్తుపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డ వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర చర్చ జరిగింది. స్వయంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావ్ థాక్రే రంగంలోకి దిగి కోమటిరెడ్డితో మాట్లాడారు. తెలంగాణలో ఎవరితోనే పొత్తులు ఉండవని స్వయంగా రాహుల్ గాంధీ చెప్పారని గుర్తు చేశారు. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ను తీవ్రంగా వ్యతిరేకించే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్నారు.
జానారెడ్డి తాజా వ్యాఖ్యలపై ఆయన ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు తన కుమారుడు రఘువీర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో నాగార్జునసాగర్ నుంచి పోటీ చేస్తారని జానారెడ్డి స్పష్టత ఇచ్చారు. ఇప్పటివరకు ఇక్కడి నుంచి జానారెడ్డి పోటీ చేస్తూ వచ్చారు. అయితే ఈసారి ఇక్కడి నుంచి తన కుమారుడు పోటీ చేస్తారని ఆయన చెప్పడంతో.. ఆయన ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారనే దానిపై చర్చ మొదలైంది.
Revanth Reddy: రకుల్, సమంత అంటూ కేటీఆర్ పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు
TSPSC Paper Leak: పేపర్ లీక్ కేసులో కీలక మలుపు..సిట్ ఏం చేయబోతుంది?
కుటుంబానికి ఒకటే సీటు అని కాంగ్రెస్ నాయకత్వం క్లారిటీ ఇవ్వడంతో.. జానారెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారేమో అని కొందరు భావిస్తున్నారు. అయితే కుమారుడిని నాగార్జునసాగర్ నుంచి బరిలోకి దింపి.. తాను మిర్యాలగూడ నుంచి బరిలోకి దిగాలని జానారెడ్డి ప్లాన్ చేస్తున్నట్టు చర్చ జరుగుతోంది. తమ కుటుంబానికి రెండు సీట్లు ఇచ్చేందుకు అధిష్టానం సుముఖత వ్యక్తం చేస్తే.. జానారెడ్డి మిర్యాలగూడ నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు భావిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.