తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. అన్నీ పార్టీలు ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా.. పార్టీలు మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా దూసుకుపోతున్నాయి. మరోసారి అధికారం దక్కించుకునేందుకు టీఆర్ఎస్ (TRS) ప్లాన్ రెడీ చేసుకుంటుంటే.. ఈసారి తెలంగాణ టార్గెట్ మిస్ కాకూడదని బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తోంది. దక్షిణాదిలో తాము పాగా వేయబోయే రెండో రాష్ట్రం తెలంగాణనే కావాలని ఆ పార్టీ హైకమాండ్ గట్టి పట్టుదలతో ఉంది. ఇక ఇటీవల తెలంగాణలో పర్యటించిన రాహుల్ గాంధీ(Rahul Gandhi).. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మరోసారి బలపడి అధికారం దక్కించుకోవాలని స్థానిక నేతలకు దిశానిర్దేశం చేశారు. దీంతో తెలంగాణలో త్రిముఖ పోటీ దాదాపుగా ఖాయమైంది.
అయితే అధికార టీఆర్ఎస్, బీజేపీ మాత్రం తెలంగాణలో ద్విముఖ పోటీ ఉంటుందనే భావనలో ఉన్నాయి. అందుకే ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ పార్టీని విమర్శించే విషయంలో పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. బీజేపీ సంగతి ఎలా ఉన్నా.. అధికార టీఆర్ఎస్ సైతం కాంగ్రెస్ పార్టీని అంత సీరియస్గా తీసుకోవడం లేదనే చర్చ జరుగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ముఖ్యనేతలు కొద్దిరోజుల వ్యవధిలోనే పర్యటించారు. అయితే టీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ కంటే ఎక్కువగా బీజేపీ నేతలు చేసిన విమర్శలపైనే ఎక్కువగా స్పందిస్తోంది. అయితే అధికార టీఆర్ఎస్ ఈ రకంగా చేయడం వెనుక పెద్ద వ్యూహమే ఉందనే చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్ పార్టీని విమర్శించడం ద్వారా ఆ పార్టీని కూడా రేసులోకి తీసుకొచ్చినట్టు అవుతుందనే భావన గులాబీ పార్టీలో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే కాంగ్రెస్ పార్టీని అంత సీరియస్గా తీసుకోవద్దనే ఆలోచనలో టీఆర్ఎస్ నాయకత్వం ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ మాత్రమే కాదు.. ఆ పార్టీని ఎక్కువగా టార్గెట్ చేస్తున్న బీజేపీ కూడా అదే రకమైన వ్యూహంతో ముందుకు సాగుతోంది. తెలంగాణలో తమ టార్గెట్ టీఆర్ఎస్ మాత్రమే అని ఫిక్స్ అయిన బీజేపీ.. కాంగ్రెస్పై విమర్శలు చేయడం లేదు. ఇటీవల తెలంగాణకు వచ్చిన ఆ పార్టీ ముఖ్యనేత అమిత్ షా సైతం కాంగ్రెస్ జోలికి వెళ్లలేదు.
BJP New Slogan: తెలంగాణలో బీజేపీ సరికొత్త నినాదం.. అదే జరిగితే.. ఆ పార్టీకి అధికారం దక్కుతుందా ?
సాధారణంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీనే ఎక్కువగా చేసే అమిత్ షా.. తెలంగాణలో మాత్రం ఆ పార్టీని లక్ష్యంగా చేసుకోకపోవడం విశేషమే. అయితే తెలంగాణలో బలహీనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని విమర్శించడం ద్వారా పెద్దగా ప్రయోజనం ఉండదనే ఉద్దేశ్యంతోనే అమిత్ షా అలా చేశారని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు తెలంగాణలో బలపడేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ సైతం బీజేపీపై విమర్శలు చేయకుండా.. టీఆర్ఎస్ను టార్గెట్ చేయడానికే ప్రయత్నిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.