‘ఏక్నాథ్ షిండేలు, తోకనాథ్ షిండేలతో కేసీఆర్ ను ఢీకొడతారా?.. కట్టప్పనా? కాకరకాయా?.. ఇలాంటి చిల్లర మాటలతోని కేసీఆర్ ను కొడతారా? దెబ్బతీస్తారా? ఇంత కురచ ఆలోచనా? బీజేపీకి నిజంగా దమ్ముంటే ముందస్తు ఎన్నికల తేదీని ప్రకటించమనండి. నేనే అసెంబ్లీని రద్దు చేస్తా. అందరం ఎన్నికలకు పోదాం.. ’ అంటూ సంచలన రీతిలో టీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ (CM KCR) విసిరిన సవాళ్లపై తెలంగాణ బీజేపీ (BJP)నేతలు సైతం అంతే ఘాటుగా స్పందించారు. కేసీఆర్ కుటుంబంలోనే ఏక్నాథ్ షిండేలు ఉన్నారని, టీఆర్ఎస్ లో చాలా మంది ఏక్నాథ్ షిండేలు ఉన్నారని బండి సంజయ్ (Bandi Sanjay) బాంబు పేల్చారు.
తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో తీజుకోవాల్సిన జాగ్రత్తలపై ఆదివారం సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించిన సీఎం కేసీఆర్.. దాదాపు రెండున్నర గంటలు మాట్లాడారు. పలు రాజకీయ అంశాలపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, బీజేపీపై నిప్పులు చెరిగారు. కచ్చితంగా జాతీయ పార్టీ పెడతామన్నారు. కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత రాత్రికి రాత్రే టీబీజేపీ చీఫ్ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు మీడియా ముందుకొచ్చి, గులాబీ అధినేత మాట్లాడిన ప్రతి మాటకు తీవ్రస్థాయిలో కౌంటరిచ్చారు. బండి మరో అడుగు ముందుకేసి.. కేసీఆర్ హిందూ దేవతలను అవమానించారని ఆరోపించారు.
టీఆర్ఎస్లో ఏక్నాథ్షిండేలు చాలామంది ఉన్నారని, కేసీఆర్ కుటుంబసభ్యుల్లోనూ ఏక్నాథ్షిండేలు ఉండొచ్చని, అందుకే సీఎం ముఖంలో భయం తాండవిస్తోందని, షిండేల భయం వల్లే కేసీఆర్ పదేపదే మహారాష్ట్ర పరిణామాలను గుర్తుచేసుకుని మాట్లాడుతున్నారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సొంత పార్టీ మనుగడపై కేసీఆర్కు భయం పట్టుకుందని, మంచి పార్టీలోకి పోవాలని టీఆర్ఎస్ లోని ఏక్నాథ్షిండేలు ఆలోచిస్తున్నరని చెప్పారు.
నిజానికి మహారాష్ట్రలో ఏక్నాథ్షిండే ఎపిసోడ్ బీజేపీ అధికారం కోసం చేసింది కాదని, సీఎం పదవి చేపట్టే అవకాశం ఉన్నా వదులుకున్నామని, పక్కా పార్టీలను చేర్చుకోవడంలో కేసీఆర్ చేస్తే సంసారం.. ఇతరులు చేస్తే వ్యభిచారమా? అని బండి సంజయ్ నిలదీశారు. ‘దేశ్కీ నేత దిన్బర్ పీతా, మోదీపే రోత, ఫామ్హౌస్మే సోతా, అమవాస్య, పున్నమికి బాహర్ ఆతా’అన్నట్టుగా కేసీఆర్ పరిస్థితి ఉందని ధ్వజమెత్తారు. బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీలో ఏం చర్చించారో కేసీఆర్ కు చెప్పాల్సిన అవసరం లేదని, బీజేపీ, ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి పేర్లు వింటేనే కేసీఆర్కు నిద్రపట్టట్లేదని, అందుకే ఇన్ని రోజుల తర్వాత ఫామ్హౌస్ నుంచి బయటికొచ్చాక కూడా మోదీపై విమర్శలకు పరిమితమయ్యారని విమర్శించారు.
ప్రధాని మోదీని గౌరవించలేని కుసంస్కారి కేసీఆర్ అని, మోదీని ఉద్ధేశించి ఇష్టానుసారం కేసీఆర్ మాట్లాడడాన్ని ఖండిస్తున్నామని, మేం కూడా మీరు మాట్లాడే భాషనే ఉపయోగిస్తే కేసీఆర్ ముఖం ఎక్కడ పెట్టుకుంటారో అని బండి మండిపడ్డారు. ప్రెస్ మీట్ లో కేసీఆర్.. మోదీని ఎద్దేవా చేస్తూ తెలంగాణ దేవాలయాల పేర్లు చదివిన సందర్భంలో ‘జోగులాంబ.. ఆ అంబ.. ఈ అంబ..’అని వ్యాఖ్యానించడం హిందూ దేవతలను అవమానించినట్లేనని సంజయ్ అన్నారు. ఇందుకుగానూ కేసీఆర్ హిందువలకు క్షమాపణలు చెప్పాలన్నారు.
‘హిందుగాళ్లు.. బొందుగాళ్లంటే కరీంనగర్లో బొందపెట్టిన సంగతి మర్చిపోయిండు. జోగులాంబ అమ్మవారు శక్తిపీఠం. అటువంటి అమ్మవారిని ఈ అంబ.. ఆ అంబ అని చులకనగా మాట్లాడుతవా? నీకు మూడింది.. దగ్గర పడింది...నువ్వు దేవుడిని తిడతవా?.. ధర్మాన్ని తిడతవా? ఎందుకు బతుకున్నవో అర్థం కావడంలేదు.. ఇదే నీ రాజకీయానికి సమాధి అవుతుంది గుర్తుంచుకో.. వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పు’అని బండి సంజయ్ డిమాండ్ చేశారు. మరోవైపు..
కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని మరిచి ప్రధాని మోదీపై విమర్శలు చేసి సీఎం కేసీఆర్ తన డొల్లతనాన్ని బయటపెట్టుకున్నారని అన్నారు. రెండు గంటల పాటు ఏకధాటిగా మీడియా సమావేశం నిర్వహించి అసలు విషయాన్ని విస్మరించారని విమర్శించారు. దేశ, రాష్ట్ర ప్రజలు అంత అమాయకులు కాదని, పదే పదే అబద్ధాలు చెప్పడాన్ని కేసీఆర్ మానుకోవాలని సూచించారు. ఇంకా..
జోగులాంబ అమ్మవారిపై కేసీఆర్ వ్యంగ్యంగా మాట్లాడారని, ఆయన పతనం ప్రారంభమైనట్లేనని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేర్కొన్నారు. మొత్తంగా కేసీఆర్ మాటలకు కౌంటర్లు ఇవ్వడం తప్ప అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికల సవాలుపై బీజేపీ నేతలు స్పష్టమైన సమాదానం చెప్పకపోవడం గమనార్హం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, Bjp, CM KCR, Kishan Reddy, Telangana, Trs