టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చుతూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. తమ పార్టీ పేరును మార్చాలంటూ టీఆర్ఎస్ నేతలు పార్టీ సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఇచ్చారు. సాధ్యమైనంత త్వరగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబోతున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ సమాయానికి ఈసీ తమ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందిస్తే.. మునుగోడులోనే(Munugodu) బీఆర్ఎస్ పేరు మీద పోటీ చేయాలని కేసీఆర్ ప్లాన్ చేశారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఇదిలా ఉంటే తాజాగా టీఆర్ఎస్(TRS) ఇప్పట్లో బీఆర్ఎస్గా(BRS) మార్చే అవకాశం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.
గులాబీ కూలీ పేరుతో టీఆర్ఎస్ పాల్పడిన వసూళ్లకు సంబంధించి తాను త్వరలోనే ఈసీకి ఫిర్యాదు చేయడంతో పాటు కేంద్ర ఇన్కమ్ టాక్స్ సంస్థకు కూడా ఫిర్యాదు చేయబోతున్నానని అన్నారు. అలాగే దీనిపై కోర్టును కూడా ఆశ్రయిస్తానని అన్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారితే.. ఈ కేసు దర్యాప్తుకు ఆటంకం కలుగుతుందని.. దీనిపై కోర్టు నుంచి ఆదేశాలు వచ్చే అవకాశం ఉంటుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బట్టి టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారకుండా ఉండేందుకు ఆ పార్టీ సరికొత్త వ్యూహాలను అమలు చేయబోతోందని తెలుస్తోంది.
అయితే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ప్లాన్ను ఎందుకు అడ్డుకోవాలని అనుకుంటోందనే అంశంపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి.. జాతీయ రాజకీయాల్లోకి వెళతామని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. ముందుగా కర్ణాటక ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని అన్నారు. వచ్చే ఏడాది జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ ఎంతగానో శ్రమిస్తోంది. అయితే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పేరుతో కర్ణాటకలో పోటీ చేయడంతో పాటు అక్కడ బరిలో ఉండే జేడీఎస్కు పూర్తి సహకారం అందించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు జేడీఎస్ ముఖ్యనేత కుమారస్వామితో పాటు ఇతర నేతలతో కేసీఆర్ సమాలోచనలు జరిపారు.
కేసీఆర్ సహకారం తీసుకునేందుకు జేడీఎస్ పూర్తి సంసిద్ధత వ్యక్తం చేసింది. ఒకవేళ కేసీఆర్ జేడీఎస్కు సహకారం అందించి.. కర్ణాటకలో విపక్షాల ఓట్లు చీల్చేలా చేస్తే.. అది తమకు ఎక్కువగా నష్టం కలిగిస్తుందనే అంచనాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. అందుకే కేసీఆర్ వ్యూహాలు కర్ణాటకలో అమలు కాకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచే కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమవుతోందని.. ఇందులో భాగంగానే కేసీఆర్ బీఆర్ఎస్కు చెక్ చెప్పేందుకు కాంగ్రెస్ పార్టీ న్యాయపరంగా రంగంలోకి దిగుతోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Revanth Reddy, Telangana