హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఓ వైపు తుమ్మల మరోవైపు పొంగులేటి..ఖమ్మంలో రాజకీయ కాక..వారి అడుగులు ఎటు?

ఓ వైపు తుమ్మల మరోవైపు పొంగులేటి..ఖమ్మంలో రాజకీయ కాక..వారి అడుగులు ఎటు?

తుమ్మల వర్సెస్ పొంగులేటి

తుమ్మల వర్సెస్ పొంగులేటి

Khammam Politics: ఖమ్మం రాజకీయం వేడెక్కింది. ఓ వైపు తుమ్మల నాగేశ్వర్ రావు, మరోవైపు పొంగులేటి శ్రీనివాస్ తమ బలా బలాలను ప్రదర్శిస్తున్నారు. మరి ఈ ఇద్దరి నేతల దారెటు అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana | Khammam

(G.SrinivasReddy,News18,Khammam)

అవును. ఇప్పుడు ఆ ఇద్దరు నేతల అడుగులు ఎటు పడబోతున్నాయనేది పెద్ద చర్చ. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉద్దండులుగా పేరు ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అదేవిధంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  తమ రాజకీయ భవిష్యత్తుపై కీలక మలుపు తీసుకోబోతున్నారా..లేక తమ పార్టీ అధినేత తేల్చే దాకా ఓపిక పట్టనున్నారా..అన్నదే ప్రస్తుత అందరిలో ఉన్న ప్రశ్న. అయితే ఎంత మాత్రం ఓపిక పట్టాల్సిన అవసరం లేదన్నది ఆయా నేతల అభిమానులు, అనుచరుల నుంచి వస్తున్న ఒత్తిడి. ఒకవైపు పరిస్థితులను ఎదిరించలేక..మరోవైపు తమకు అండగా నిలుస్తున్న క్యాడర్ ను సముదాయించలేక సతమతమవుతున్న పరిస్థితి ఉంది.

తమ క్యాడర్ కు దిశా నిర్దేశం చేయడానికి అన్నట్టు న్యూ ఇయర్ ఫస్ట్ డే నాడు ఎవరికి వారే తమ బలాన్ని చాటుకోవడానికి ఒక ప్రయత్నం చేశారని చెప్పుకోవచ్చు. పెద్దగా జన సమీకరణ చేయనప్పటికీ, ఖర్చు పెట్టకపోయినప్పటికీ  అభిమానంతో వేల సంఖ్యలో కార్యకర్తలు కదిలి రావడంతో ఆయా నేతల శిబిరాల్లో ఉత్సాహం నిండింది. ఈ సభలు సమావేశాల వల్ల ఇప్పటికిప్పుడు తేలేది ఏమీ లేకపోయినప్పటికీ..అప్పుడప్పుడు తమకు ప్రజల్లో ఉన్న పలుకుబడిని, పట్టుని నిరూపించుకుంటున్నట్టు అర్థం అవుతుంది. పార్టీ అధినేత తమను అక్కున చేర్చుకున్న..చేరదీసుకోకపోయినా తమకు పోయిందేమీ లేదన్న ధోరణి ఈ నేతల్లో వ్యక్తం అవుతోంది. నిజానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటికీ గ్రౌండ్ లెవెల్లో పాదుకోలేకపోయిన బీఆర్ఎస్ పార్టీ.. బరువు మోస్తున్న నేతల భుజాలశక్తి మీదనే నడుస్తుందని చెప్పొచ్చు.

ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ లో అసంతృప్త నేతలు పార్టీ తమను పక్కనపెట్టడంపై తాడో, పేడో తేల్చుకునేందుకు సిద్ధమైయ్యారు. ప్రధానంగా మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటి కొత్త సంవత్సరం సందర్భంగా తమ రాజకీయ భవిష్యత్ నిర్ణయించుకునేందుకు సిద్ధమైయ్యారు. మరో 10 నెలల్లో ఎన్నికలు ఉండటంతో గులాబీ పార్టీలో ఆదరణ లేకపోవడంతో ప్రత్యాన్మాయ మార్గాలపై వారు ఆలోచనలు చేస్తున్నారనే ప్రచారానికి బలం చేకూర్చే విధంగా నూతన సంవత్సరం రోజున ఆత్మీయ కలియక పేరుతో బలప్రదర్శన చేశారు .

ఖమ్మంలోని తన నివాసంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజలను కలుసుకోగా..తుమ్మల పాలేరు నియోజకవర్గ పరిధిలోని రూరల్ మండలం శ్రీసిటీ లో నూతనంగా నిర్మించిన గృహ ప్రవేశ సందర్భంగా ఆత్మీయ కలయిక పేరుతో వేలాది మందిని పిలిపించారు. వందలాది వాహనాలతో ఉమ్మడి జిల్లాలోని నలుమూలల నుంచి ప్రజలు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన తుమ్మల తన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ముగ్గురు ముఖ్యమంత్రుల వద్ద పని చేశానని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 లక్షల ఎకరాలకు నీరందించడమే తన లక్ష్యమని అన్నారు. జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత తనదేనని పేర్కొన్నారు

ఖమ్మంలో విందు రాజకీయాలతో నూతన సంవత్సర వేడుకలు వేడి పుట్టించాయి. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముఖ్య నాయకులంతా విందు రాజకీయాలకు తెర లేపారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ తన సొంత నియోజకవర్గం ఖమ్మంలోని 17వ డివిజన్‌ నుంచి వాడ వాడకు పువ్వాడ పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ప్రతి డివిజన్‌లో స్థానిక నాయకులు, ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరారవు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి న్యూ ఇయర్‌ సందర్భంగా విందు రాజకీయాలకు తెర లేపారు.

తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయ భవితవ్యంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరం ఆరంభంలోనే ఇద్దరు నేతలు తమ సత్తా చాటేందుకు విందు రాజకీయాలకు శ్రీకారం చుట్టడం చర్చనీయాంశం అయింది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నూతన గృహ ప్రవేశ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పాలేరు నియోజకవర్గానికి చెందిన తుమ్మల అభిమానులు, నాయకుల ఆత్మీయ కలయిక పేరుతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు పాలేరు నియోజకవర్గం నుంచి తుమ్మల అభిమానులు భారీగా తరలివచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో తామంతా తుమ్మల వెంటే ఉంటామని నాయకులు స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా అభివృద్ధికి తుమ్మల చేసిన కృషిపై దాదాపు 10వేల పుస్తకాలు ముద్రించి పంపిణీ చేస్తున్నారు. తుమ్మల మళ్లీ పాలేరు నుంచే పోటీ చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

బీఆర్ఎస్ లో ఎలాంటి గౌరవం దక్కిందో తెలుసంటున్న పొంగులేటి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కార్యకర్తలు, అభిమానుల కోసం తన నివాసంలో ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల నుంచి తరలివస్తున్న నాయకులు, కార్యకర్తలు ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా పొంగులేటి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ..‘‘భారత రాష్ట్ర సమితి లో గత నాలుగేళ్లుగా మనకు ఎలాంటి గౌరవం దక్కిందో మీ అందరికీ తెలుసు. భవిష్యత్తులో ఎలాంటి గౌరవం దక్కాలని మీరు భావిస్తున్నారో కూడా నాకు తెలుసు. మీ అందరి మనసులో ఏముందో తెలుసు. కానీ, ఇంకా ఓపిక పట్టాల్సిన అవసరం ఉంది’’ అని పార్టీ శ్రేణులకు ఒక సంకేతమిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు. భద్రాచలం, మధిర మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ భారాస ఎమ్మెల్యేలే ఉన్నారు.

ఖమ్మం జిల్లాలో ఆయనతో పాటు తన అనుచరులు కూడా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తారని పొంగులేటి చెప్పడం భారాసతో పాటు ఖమ్మం జిల్లా రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. 2019 ఎన్నికల సందర్భంగా అప్పటి సిట్టింగ్‌ ఎంపీ పొంగులేటిని కాదని భారాస తరఫున నామా నాగేశ్వరారవుకు టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో నామా విజయం సాధించారు. అయితే, అప్పటి నుంచి పొంగులేటికి పార్టీలో సరైన ప్రాధాన్యం దక్కలేదని ఆయన అబిమానులు భావిస్తున్నారు. పొంగులేటి పార్టీ మారుతారని ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. కానీ, దీనిపై ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా పొంగులేటి తన మనసులో మాటను బయటపెట్టారు. మొత్తం మీద ఎన్నికల ఏడాదిలో ఖమ్మం జిల్లాలో రాజకీయాలు హాట్‌ టాపిక్‌గా మారాయి.

First published:

Tags: Khammam, Ponguleti srinivas reddy, Telangana, Telangana Politics, Tummala nageshwara rao

ఉత్తమ కథలు