తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (MP Revanth Reddy) మరోసారి విరుచుకుపడ్డారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోతూ రైతులు ఇబ్బందులు పడుతుంటే.. ఫాంహౌస్ లో రెస్ట్ తీసుకోవడానికి సిగ్గనిపించడం లేదా కేసీఆర్ (KCR)? అంటూ ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ కొనుగోలులో జాప్యం కారణంగా, అకాల వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయిందన్నారు. సర్కార్ కొనదు. దళారులేమో మద్దతు ధర ఇవ్వరు, అగ్గువకైనా అమ్ముకోకపోతే తమ కష్టం అంతా వర్షం పాలవుతుందనే భయంతో రైతులు ఉన్నారని అన్నారు. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ (TRS party Office) జిల్లా కార్యాలయానికి హైదరాబాద్ లో దాదాపు ఎకరం భూమిని (One Acre Land) కేటాయిస్తూ కేసీఆర్ సర్కార్ తీసుకున్న నిర్ణయం రాజకీయ దుమారం రేపుతోంది. ప్రభుత్వ పెద్దలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ హైదరాబాద్ నడిబొడ్డున వందలకోట్ల విలువైన భూమిని అప్పన్నంగా కొట్టేయడానికి ప్లాన్ వేశారని ఎంపీ రేవంత్ రెడ్డి (MP Revanth reddy) ఆరోపించారు.. అందులో భాగంగానే టీఆర్ఎస్ జిల్లా కార్యాలయం పేరిట నాటకాలాడుతున్నారని ఆరోపించారు.
నగరం నడిబొడ్డున రూ.100 కోట్ల విలువైన భూమి..
గిరిజన విశ్వవిద్యాలయానికి భూమి లేదని హామీ ఇచ్చిన దళితులకు మూడెకరాలు ఇవ్వడానికి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి భూమి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ రేవంత్. కానీ, టీఆర్ఎస్ జిల్లా ఆఫీసుకు నగరం నడిబొడ్డున రూ.100 కోట్ల విలువైన భూమి అప్పనంగా కొట్టేయడానికి మాత్రం భూమి ఉందని మండిపడ్డారు రేవంత్. ఎవని పాలయిందిరో తెలంగాణ జాతి సంపద దోస్తున్నవాడి పాలయిందిరో తెలంగాణ! అని రేవంత్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
దళితులకు మూడెకరాలు ఇవ్వడానికి భూమి లేదు.
గిరిజన విశ్వవిద్యాలయానికి భూమి లేదు.
టీఆర్ఎస్ జిల్లా ఆఫీసుకు నగరం నడిబొడ్డున రూ.100 కోట్ల విలువైన భూమి అప్పనంగా కొట్టేయడానికి భూమి ఉంది…
ఎవని పాలయిందిరో తెలంగాణ…
జాతి సంపద దోస్తున్నవాడి పాలయిందిరో తెలంగాణ!#kcrfailedtelangana pic.twitter.com/UHXldUFVPB
— Revanth Reddy (@revanth_anumula) May 13, 2022
ఆయా జిల్లాల్లోనూ ఉన్నాయంటూ..
తెలంగాణ ఏర్పాటు సమయంలో పది జిల్లాలుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని పునర్వ్యవస్థీకరించి 33 జిల్లాలుగా చేశారు. ఇప్పటికే పాతజిల్లాల్లో మాదిరిగానే కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో అదునాతనంగా సమీకృత కలెక్టరేట్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. అంతేకాకుండా ప్రభుత్వ కార్యాలయాలు, ఇతరత్రా మౌళికసదుపాయాల కోసం ప్రభుత్వ భూములు కేటాయిస్తోంది.
అయితే తెలంగాణలోని ఆయా జిల్లాల్లో టీఆర్ఎస్ కార్యాలయాల కోసం కూడా ప్రభుత్వ భూములు కేటాయించడం వివాదాస్పదంగా మారింది. జిల్లాల్లో భూముల ధరలు తక్కువగా వుంటాయి కాబట్టి టీఆర్ఎస్ కార్యాలయాలకు భూముల కేటాయింపుపై ప్రతిపక్షాలు కూడా సీరియస్ గా తీసుకోలేదు. కానీ తాజాగా హైదరాబాద్ జిల్లా కార్యాలయం కోసం నగర నడిబొడ్డును అత్యంత ఖరీదైన భూమిని కేటాయించడం తీవ్ర దుమారం రేపింది. బంజారాహిల్స్ ఎన్బీటీ నగర్లో వందలకోట్ల విలువచేసే 4,935 చదరపు గజాల స్థలాన్ని టీఆర్ఎస్ ఆఫీస్ కోసం కేటాయించడంపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. బంజారాహిల్స్ లో దాదాపు ఎకరం స్థలాన్ని అధికారికంగా కబ్జా చేయడానికి టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నించి సఫలీకృతమైందని కాంగ్రెస్ నాయకుడు దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఇది అధికారిక కేటాయింపు కాదు ముమ్మాటికీ అధికారిక భూకబ్జా అని అన్నారు దాసోజు శ్రవణ్. దీంతో దీనిపై అధికార పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Hyderabad, Revanth Reddy, Trs