తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై(YS Sharmila) అసెంబ్లీ స్పీకర్కు టీఆర్ఎస్(TRS) ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, దాస్యం వినయ భాస్కర్, లక్ష్మారెడ్డి, కాలే యాదయ్య స్పీకర్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం అందించారు. ప్రజాప్రతినిధులు అనే విషయాన్ని మరిచి ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేసేవిధంగా షర్మిల అవమానిస్తుందని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధుల హక్కులకు, గౌరవానికి భంగం కలిగించినందుకు, నిరాధార ఆరోపణలు, జుగుప్సాకర ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదులో ప్రస్తావించారు. షర్మిలపై చర్యలు తీసుకోవాలని కోరారు. షర్మిలపై ఇప్పటికే డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి(Pocharam Srinivasa Reddy) పేర్కొన్నారు. ఈ మేరకు ప్రివిలేజ్ కమిటీకి అంశాన్ని సిఫారసు చేస్తానని వారికి హామీ ఇచ్చారు. మరోవైపు దీనిపై సభాహక్కుల ఉల్లంఘన కమిటీ సమావేశం అయ్యే అవకాశం ఉందని సమాచారం.
ఇదిలా ఉంటే ఈ జరుగుతున్న పరిణామాలను వైఎస్ఆర్టీపీ కూడా నిశితంగా గమనిస్తోంది. తెలంగాణ ప్రభుత్వానికి ఏ కౌంటర్ ఇవ్వాలనే దానిపై వ్యూహరచన చేస్తోంది. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు తనపై స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేసిన కొద్దిసేపటికే వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ అంశంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. తనపై చర్యలకు ఆలోచించే ముందు పరాయి ఆడదాన్ని, ఒక తల్లిని మరదలంటూ తనతో పాటు తన తోటి మహిళలను కించపరిచిన సంస్కార హీనుడైన మంత్రి నిరంజన్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో నిరుద్యోగుల కోసం తాను చేసిన దీక్షలను వ్రతాలంటూ కామెంట్ చేసిన కేటీఆర్పై చర్యలు తీసుకోవాలని కోరారు.
స్పీకర్ @PSRTRS గారు, ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుద్యోగ యువతకు తోడుగా ప్రతి మంగలవారం నేను చేస్తున్న నిరుద్యోగ నిరాహార దీక్షలను వ్రతాలంటూ.. నన్ను, ఏ పనినైనా నిష్టగా చేసే ప్రతి మహిళను, నిరుద్యోగులను కించపరిచిన మరో మంత్రి @KTRTRS పై చర్యలు తీసుకోవల్సిందిగా విజ్ఞప్తి.
— YS Sharmila (@realyssharmila) September 13, 2022
ఈ అంశంపై షర్మిల కూడా స్పందించడంతో.. ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో అనే చర్య మొదలైంది. ఒకవేళ స్పీకర్ వైఎస్ షర్మిలపై చర్యలు తీసుకోవాలని అనుకుంటే.. ఆమెపై ఏ రకమైన చర్యలకు ఆదేశిస్తారు ? అందుకు షర్మిల వైపు నుంచి ఏ రకంగా రియాక్షన్ ఉంటుందనే అంశం కూడా ఆసక్తిరేపుతోంది. అయితే ఉన్నట్టుండి టీఆర్ఎస్ ప్రభుత్వం షర్మిలను టార్గెట్ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటన్న చర్చ కూడా మొదలైంది. గత కొన్ని నెలల నుంచి టీఆర్ఎస్పై షర్మిల విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.
Telangana : కరీంనగర్ కారు గుర్తు పార్టీలో నేతల మధ్య కయ్యాలు .. హైకమాండ్కి చేరిన కంప్లైంట్స్
Revanth Reddy: రేవంత్ రెడ్డి కొత్త నినాదం.. తెలంగాణ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా ?
అప్పుడు వాటిని పెద్దగా పట్టించుకోని టీఆర్ఎస్.. ఉన్నట్టుండి ఇప్పుడు ఆమెపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్ చర్యల ద్వారా షర్మిలకు రాజకీయంగా కావాల్సినంత మైలేజీ లభించే అవకాశం వస్తుందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి వైఎస్ షర్మిలపై స్పీకర్ చర్యలకు ఆదేశిస్తే.. ఈ మొత్తం వ్యవహారం మరింత ఆసక్తిరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Telangana, Trs, YS Sharmila