ప్రభుత్వం ప్రవేశపెట్టే అన్నీ పథకాలు ఎప్పటికి కొనసాగుతాయనే నమ్మకం లేదు. కొన్నింటిని మొదలుపెట్టి మధ్యలో ఆపేసిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ(Telangana)లో టీఆర్ఎస్(TRS) ప్రభుత్వం గతంలో అమలు చేసిన కంటి వెలుగు పథకం (Kanti velugu scheme)ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టినప్పటికి ఆ తర్వాత కంటి చూపులాగానే మసకబారిపోయింది. ఈపథకం ద్వారా రాష్ట్రంలోని ఎంతో మంది వృద్ధులు, చిన్నారులు, పేదలకు ఉచితంగా కళ్ల అద్దాలు, కంటి ఆపరేషన్(Operation)లు చేయిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికి అది కార్యరూపం దాల్చలేదు. కంటి వెలుగు ద్వారా పరీక్షలు చేసి అద్దాలు ఇచ్చిన ప్రభుత్వం..ఆ తర్వాత ఆ పథకాన్ని అటకెక్కించింది. అయితే మరో ఏడాదిలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ..ఇప్పుడు కొనసాగిస్తున్న పథకాలతో పాటు కంటి వెలుగును కూడా పూర్తి స్థాయిలో అమల్లోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్ (KCR)అన్నీ జిల్లాల అధికారులకు పథకం అమలుకు సంబంధించి దిశానిర్ధేశం, తీసుకోవాల్సిన ఏర్పాట్లపై ఆదేశాలు కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
కంటి చూపు కాపాడేందుకు..
తెలంగాణలోని జిల్లాల్లో కంటి సమస్యలతో సతమతమవుతున్న వాళ్ల సంఖ్య పెరుగుతోంది. చాలా మంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో టెస్టులు, కళ్ల అద్దాలతో పాటు కంటి ఆపరేషన్లకు క్యూ కడుతున్నట్లుగా వైద్యశాఖకు వచ్చిన నివేదిక ప్రకారం అదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. వైద్యశాఖ అధికారుల సూచనల మేరకు సీఎం కేసీఆర్ మళ్లీ కంటి వెలుగు పథకాన్నిఅమలు చేయాలని భావిస్తోంది. అందుకు తగినట్లుగానే ప్రతి జిల్లాల్లో క్యాంపులు నిర్వహించాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ప్రతి క్యాంప్లో డాక్టర్తో పాటు నలుగురు వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు. స్థానిక ప్రాధమిక వైద్యశాల సిబ్బంది సమన్వయంతో కంటి పరీక్షలు, కళ్ల అద్దాలను అందజేయడంతో పాటుగా కంటి ఆపరేషన్లను కూడా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం వైద్యశాఖ అధికారులకు మార్గనిర్దేశం చేసింది.
బాధితులకు ముందుగా చికిత్స..
గతంలో కూడా ఇదే విధంగా కంటి వెలుగు పథకం ద్వారా టెస్ట్లు భారీగా నిర్వహించిన ప్రభుత్వం అందులో కొందరికి కళ్ల అద్దాలు ఇచ్చి కంటి నీరు తుడిచింది. ఆపరేషన్లు చేయాల్సిన వాళ్లను ప్రభుత్వ కంటి ఆసుపత్రులకు రెఫర్ చేశారు. కొందరికి ఆపరేషన్ తర్వాత సమస్యలు తలెత్తినప్పటికి పట్టించుకోలేదు. కంటి వెలుగు బాధితులు న్యాయం కోసం ఆసుపత్రులు, అధికారుల కార్యాలయాల చుట్టూ తిరిగినప్పటికి ప్రయోజనం లేకపోయింది.
స్కూళ్లలో కూడా టెస్ట్లు..
ఇలాంటి సమస్యలను ముందుగా గుర్తించి..గతంలో ఉన్న బాధితులతో పాటు కొత్తగా కంటి పరీక్షలు చేసిన తర్వాత ఆపరేషన్ అవసరమైన వారికి చికిత్స అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం వైద్యశాఖను ఆదేశించింది. దీంతో అధికారులు హడావుడిగా ఆ కార్యక్రమాన్ని చేపట్టారు. కంటి వెలుగు పథకం తిరిగి పునఃప్రారంభం కావడంతో ఇప్పటికే స్కూళ్లలో చిన్నారులకు సైతం పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Eye sight, Telangana News