సీఎం కేసీఆర్ ను జైలులో పెడతామని డైలాగులే తప్ప బీజేపీ ఆ పని ఎందుకు చేయలేకపోతోంది? టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన రిపోర్టులో ఏముంది? కాంగ్రెస్ తో చర్చల్లో భాగంగా తెలంగాణపై పీకే అంచనాలేంటి? లాంటి కీలక ప్రశ్నలకు సంచలన సమాధానాలు చెప్పారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈనెల 6, 7తేదీల్లో రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వస్తున్న క్రమంలో కాంగ్రెస్ రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నది. వరంగల్ సభ ప్రచారం నిమిత్తం పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ను జైలుకు పంపుతానన్న బండి సంజయే జైలుకు వెళ్లొచ్చారు. కాళేశ్వరంలో వేల కోట్ల కుంభకోణం జరిగిందని స్థానిక బీజేపీ చెబుతోంటే, కేంద్రం నుంచి వచ్చిన గడ్కరీ మాత్రం కేసీఆర్ ను పోగుడుతారని, కాళేశ్వరం అద్భుతం, దానికి తానే అనుమతులిచ్చానని గడ్కరీ చెప్పడం యాదృచ్చికం కాదని రేవంత్ రెడ్డి అన్నారు. వరుస పరిణామాలను బట్టి.. మోదీ-కేసీఆర్ మధ్య ఎలాంటి వైరుధ్యాలు లేవని, వారిద్దరూ కలిసే నాటకం ఆడుతున్నారని, కేసీఆర్ గూడుపుఠానీలో భాగంగానే అంతా జరుగుతోందని రేవంత్ ఆరోపించారు.
నిజానికి తెలంగాణలో కేసీఆర్ శకం ముగిసిందని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోతుందని, కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు, అలాగే ప్రశాంత్ కిశోర్ కీలక సర్వేల్లో ఇదే తేలిందని రేవంత్ చెప్పారు. పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాక తాను ప్రశాంత్ కిశోర్ను ఢిల్లీలో కలిశానని, తెలంగాణ రాజకీయాలపై చాలాసేపు చర్చించామని, కాంగ్రెస్ పార్టీకి పనిచేసేందుకు ఆసక్తి చూపించారని రేవంత్ గుర్తుచేశారు. అయితే, తాము కలిసిన విషయం కేసీఆర్కు తెలిసి.. ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ తో జతకలిస్తే టీఆర్ఎస్ కు నష్టమని భావించే కేసీఆర్ఆ పీకేను దగ్గరకు తీసుకున్నారని రేవంత్ చెప్పారు.
‘టీఆర్ఎ్సలోని 65 మంది ఎమ్మెల్యేలకు మళ్లీ సీట్లు ఇస్తే ఓడిపోతారు. అదే జరిగితే పార్టీ మూడో స్థానంలోకి వెళ్తుంది. కేవలం 20 స్థానాల్లోనే టీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది. మరో 20 స్థానాల్లో పోటీ తీవ్రంగా ఉండనుంది. 70 స్థానాల్లో టీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్సే. 20 నుంచి 25 సీట్ల మధ్యన బీజేపీ నుంచి పోటీ ఉంటుంది. టీఆర్ఎస్ ఓటింగ్ శాతం 50 నుంచి 35 శాతానికి పడిపోయే అవకాశముంది. టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ కాంగ్రె్సకు వెళ్తుంది. అందుకే వీలైనంత వరకు బీజేపీ గ్రాఫ్ను పెంచాలి. అలా చేస్తే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓటింగ్ టీఆర్ఎస్ వెంటే ఉంటుంది.’ అని సీఎం కేసీఆర్కు ప్రశాంత్కిశోర్ ఇచ్చిన నివేదికలో ఉందని రేవంత్ రెడ్డి బయటపెట్టారు.
కేసీఆర్ బీజేపీతో అంటకాగుతోంటే, కొడుకు కేటీఆర్ మాత్రం తమ ప్రధాన ప్రత్యర్థి కేఏ పాల్ అంటున్నాడని రేవంత్ మండిపడ్డారు. ‘టీఆర్ఎస్ కు కేఏ పాల్ ప్రధాన ప్రత్యర్థి అని కేటీఆర్ అన్నాడు. ఈ మాట విని కేసీఆర్ ఆత్మహత్య చేసుకోవాలి. వంగ్యంగా మాట్లాడాలన్నా కాసింత సెన్స్ ఉండాలి. కేటీఆర్ను వాళ్ల ఇంట్లోనే సీరియ్సగా తీసుకోరు. ఆయన సీఎం అనేది గోడ మీద రాసుకోవాల్సిందే. ఏ రోజు చదివినా కాబోయే సీఎం అనే ఉంటుంది’’ అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, CM KCR, Congress, Prashant kishor, Revanth Reddy, Telangana, Trs