మునుగోడులో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారయ్యారు. బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి రంగంలో ఉన్నారు. అయితే ఈ సీటును ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్న టీఆర్ఎస్ (TRS) మాత్రం అభ్యర్థి ఎంపిక విషయంలో నిర్ణయం తీసుకోలేదు. టీఆర్ఎస్ ఈ అంశంలో ఇంత ఆలస్యం చేయడం వెనుక కారణం ఏంటనే దానిపై పార్టీ వర్గాల్లో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేసీఆర్(KCR) ఇప్పుడప్పుడే మునుగోడుపై ఫోకస్ చేయలేదని.. ఆయన జాతీయ పార్టీపై దృష్టి పెట్టారని కొందరు చర్చించుకుంటున్నారు. మరోవైపు మునుగోడు(Munugodu) ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాతే కేసీఆర్ తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. అయితే ఈ విషయంలో మరో వాదన కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.
మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీఆర్ఎస్ తరపున నలుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ వంటి వాళ్లు ఉన్నారు. తమకు టికెట్ రాదనే కారణంగా వీరిద్దరూ పార్టీతో అంటీముట్టనట్టుగా ఉంటున్నారనే టాక్ ఉంది. బూర నర్సయ్య గౌడ్ ఈ విషయంలో తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్లో పరిస్థితి ఇలా ఉంటే ఉప ఎన్నికల్లో గెలుపు ఎలా సాధ్యమని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం.
అందుకే నియోజకవర్గం పరిధిలోని పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాలు, అసంతృప్తి నేతలను పూర్తిస్థాయిలో బుజ్జగించిన తరువాతే మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థిని ప్రకటించాలనే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారని కొందరు చర్చించుకుంటున్నారు. ఇప్పుడే పార్టీ అభ్యర్థిని ప్రకటించి రంగంలోకి దింపడం వల్ల అనవసరంగా ఈ ఉప ఎన్నికకు ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుందనే యోచనలో కేసీఆర్ ఉన్నారని.. హుజూరాబాద్ విషయంలో జరిగిన ఈ తప్పును మునుగోడు విషయంలో రిపీట్ కావొద్దనే ఆలోచనలో ఆయన ఉన్నారని పలువురు విశ్లేషిస్తున్నారు.
KCR | Telangana Assembly: ప్రధాని మోదీ ఏపీ చేతిలో కీలుబొమ్మగా మారి తెలంగాణ పట్ల నియంతలా వ్యవహరిస్తున్నారు: కేసీఆర్
Etala Rajender : అసెంబ్లీకి ఆ బీజేపీ ఎమ్మెల్యే వచ్చారా .. సభలో ఈటల రాజేందర్ ఎక్కడా..?
ఈ ఉప ఎన్నిక ఇప్పట్లో జరిగే అవకాశం లేదని.. వచ్చే ఏడాదిలోనే ఈ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకుని కేసీఆర్ మునుగోడు అభ్యర్థి ఎంపిక అంశాన్ని తాత్కాలికంగా పక్కనపెట్టారనే వాదన కూడా ఉంది. మొత్తానికి ఉప ఎన్నికలంటే ఎప్పుడూ దూకుడుగా ముందుకు సాగే టీఆర్ఎస్.. ఈసారి మిగతా పార్టీల కంటే కాస్త మెల్లిగా స్పందిస్తుండటం చాలామంది ఆశ్చర్యం కలిగిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Munugodu By Election, Trs