TS POLITICS PRAJA SHANTI PARTY CHIEF KA PAUL ALLEGES THAT TRS CM KCR BEHIND PRASHANT KISHOR NEW POLITICAL PARTY MKS
CM KCR వ్యూహంతోనే ప్రశాంత్ కిషోర్ కొత్త జాతీయ పార్టీ: తప్పైతే పాస్ పోర్ట్ సీజ్: KA Paul
కేసీఆర్, కేఏ పాల్, పీకే
బీజేపీయేతర, కాంగ్రెసేతర ఫెడరల్ ఫ్రంట్ కలగా ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రోద్బలంతోనే.. గులాబీ బాస్ వ్యూహాల మేరకే ప్రశాంత్ కిషోర్ కొత్త జాతీయ పార్టీ పెట్టబోతున్నారని, ఈ విషయాన్ని పీకే స్వయంగా వెల్లడించారని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ అన్నారు.
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేస్తోన్న ప్రశాంత్ కిషోర్.. తన సొంత రాష్ట్రం బీహార్ నుంచి సరికొత్త రాజకీయ ప్రయాణం మొదలుపెట్టారు. ఇక జనంలోకి వెళతానని చెప్పిన ఆయన త్వరలోనే కొత్త పార్టీని ప్రకటించబోవడం ఖాయమైంది. కాంగ్రెస్ తో చర్చల క్రమంలో పీకే అనూహ్యరీతిలో చివరి రెండు రోజులు హైదరాబాద్ లో మకాం వేసి, సీఎం కేసీఆర్ తో భేటీ అయిన తర్వాత.. సోనియా గాంధీ ఆఫర్ తిరస్కరిస్తున్నట్లు ప్రకటించడం తెలిసిందే. బీజేపీయేతర, కాంగ్రెసేతర ఫెడరల్ ఫ్రంట్ కలగా ఉన్న కేసీఆర్ ప్రోద్బలంతో, గులాబీ బాస్ వ్యూహాల మేరకే పీకే కొత్త పార్టీ పెట్టబోతున్నారా? అని జాతీయ మీడియాలో సైతం చర్చ జరిగింది. ఇప్పుడు అదే విషయాన్ని కరాకండిగా చెబుతున్నారు కిలారి ఆనంద్ పాల్..
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా, సంచలనాలకు కేంద్రంగా మారారు ప్రజాశాంతి పార్టీ చీఫ్ కిలారి ఆనంద్ పాల్ అలియాస్ కేఏ పాల్. ప్రస్తుతం హైదరాబాద్ లో హౌజ్ అరెస్టులో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలపై అనూహ్య వ్యాఖ్యలు చేశారు. 150 దేశాలను వణికించి వచ్చిన తాను.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు నేను భయపడబోనని పాల్ అన్నారు. సిరిసిల్ల జిల్లాలో తనపై జరిగిన దాడిని నిరసిస్తూ డీజీపీకి ఫిర్యాదు చేస్తానని కేఏ పాల్ ప్రకటించిన నేపథ్యంలో పంజాగుట్ట పోలీసులు అమీర్పేటలోని ఆయన నివాసానికి చేరుకుని గృహ నిర్బంధంలో ఉంచారు. ఇలా తనను ఎంత కాలం నిర్బంధిస్తారని ప్రశ్నించారు. డీజీపీ మహేందర్ రెడ్డికి నిన్నటి నుంచి ఫోన్ చేస్తున్నా లిఫ్టు చేయడం లేదని చెప్పారు. ఆంధ్రా వాడినని కొందరు మాట్లాడుతున్నారని, అయితే వారు.. కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకోవాలని కేఏ పాల్ హితవు పలికారు. ఇక పీకే వ్యవహారంపై..
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొత్తగా ఏర్పాటు చేయబోయేది కేవలం బిహార్ కు పరిమితమయ్యే ప్రాంతీయ పార్టీ కాదని, పీకే జాతీయ స్థాయిలోనే పార్టీ పెట్టబోతున్నారని, నిజానికి జాతీయ పార్టీ పెట్టాలని పీకేకు చెప్పింది సీఎం కేసీఆరేనని కేఏ పాల్ తెలిపారు. కేసీఆర్ చెబితేనే కొత్త పార్టీ పెడుతోన్న విషయాన్ని ప్రశాంత్ కిషోర్ స్వయంగా స్వయంగా చెప్పినట్లు కేఏ పాల్ తెలిపారు. అయితే, ఎందరు పీకేలు, కేసీఆర్లు ఉన్నా తెలంగాణలో ప్రజా శాంతి పార్టీనే అధికారంలోకి వస్తుందని, ప్రభుత్వంలోకి వచ్చాక ఆరు నెలల్లోనే లక్ష ఉద్యోగాలు ఇస్తానని, ఇవ్వకుంటే తన పాస్ పోర్టును సీజ్ చేసుకోవచ్చని సంచలన సవాలు చేశారు కేఏ పాల్.
తెలంగాణ రాజకీయాల్లో గడిచిన కొద్ది వారాలుగా కిలారి ఆనంద్ పాల్ అలియాస్ కేఏ పాల్ హాట్ టాపింగ్ మారడం తెలిసిందే. ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన కేఏ పాల్ గత ఎన్నికల్లో ఆంధ్రాలో అదృష్టాన్ని పరీక్షించుకొని, దెబ్బైపోయి ఇప్పుడు తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చారు. గవర్నర్ తమిళిసైని కలిసి, రాజ్ భవన్ ఆవరణలోనే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ త్వరలోనే అరెస్టు కాబోతున్నారని చెప్పిన కేఏ పాల్.. మూడు వారాలుగా వరుస ప్రెస్ మీట్లు, కార్యక్రమాలతో కేసీఆర్-టీఆర్ఎస్ పై విరుచుకుపడుతున్నారు. విపక్షాలను ఎద్దేవా చేసేక్రమంలో ‘కేఏ పాల్ మాకు ప్రధాన ప్రత్యర్థి అవుతారేమో’అని కేసీఆర్ కొడుకైన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించిన తర్వాత పాల్ మరింత దూకుడు పెంచారు..
అన్ని సమస్యలపై మాట్లాడుతోన్న కేఏ పాల్ ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించడానికి వెళ్లిన సమయంలో అధికార టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆయనపై దాడి చేయడం, మంత్రి కేటీఆర్ ఇలాకాలో ఆయన కనుసైగతోనే పోలీసుల సహకారంతోనే తనపై దాడి జరిగిందని పాల్ ఆరోపించడం, ఈ మేరకు డీజీపీ మహేందర్ రెడ్డికి కలిసి ఫిర్యాదు చేస్తానన్న ఆయనను పోలీసులు హైదరాబాద్ లో హౌజ్ అరెస్టు చేయడం లాంటి పరిణామాలు జరిగాయి. హౌజ్ అరెస్టులో ఉన్న కేఏ పాల్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ పలు సంచలన విషయాలు చెప్పుకొచ్చారిలా..
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.