తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారారు ప్రముఖ క్రైస్తవ బోధకుడు, ప్రజాశాంతి పార్టీ చీఫ్ కిలారి ఆనంద్ పాల్ అలియాస్ కేఏ పాల్ (KA Paul). గత ఎన్నికల్లో ఏపీలో పోటీ చేసి ఒక్కచోట కూడా డిపాజిట్ పొందలేని ఆయన.. దేశానికి ప్రత్యామ్నాయం తానే అంటూ ఈసారి తెలంగాణలో (Telangana)నూ పోటీకి సిద్దమని ప్రకటించారు. ఓవైపు సీఎం కేసీఆర్ (Telangana CM KCR), ఆయన కొడుకైన మంత్రి కేటీఆర్ పై సంచలన విమర్శలు చేస్తూ, మరోవైపు కేంద్రం పెద్దయిన అమిత్ షా (Amit Shah)ను, రాష్ట్ర ప్రథమ పౌరురాలైన గవర్నర్ తమిళిసై (Governor Tamilisai)నీ తరచూ కలుస్తూ, అదే నోటితో ప్రధాని మోదీని, బీజేపీని తీవ్రంగా విమర్శిస్తూ అంతుచిక్కని విధంగా వ్యవహరిస్తున్నారు కేఏ పాల్.
తెలంగాణలో వచ్చే ఏడాది ఎన్నికల్లో పాల్ ప్రభావం ఉంటుందా? ఆయన చీల్చబోయే ఓట్లతో ఏ పార్టీకి లాభం చేకూరుతుంది? అసలు ఆయనను తెరపైకి తెచ్చిందెవరు? లాంటి సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో, ఆంధ్రజ్యోతి ఎండీ నిర్వహించే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూలో కేఏ పాల్ పలు సంచలన విషయాలను రివీల్ చేశారు. దేశాన్ని అప్పుల బారి నుంచి కాపాడటానికి, తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేయడానికే తాను పార్టీని స్థాపించానని, ప్రజలు అవకాశమిస్తే అద్భుతాలు చేస్తానని ఆయన చెప్పారు. సీఎం కేసీఆర్, దివంగత సీఎం వైఎస్సార్ పేర్లను ప్రస్తావిస్తూ అనూహ్య కామెంట్లు చేసిన పాల్.. తన సోదరుడి హత్య కేసు అంశంలోనూ క్లారిటీ ఇచ్చారు.
క్రైస్తవ బోధకుడు, శాంతిదూత, రాజకీయ నాయకుడిగానే కాకుండా మొత్తం ఎనిమిది అంశాల్లో ప్రపంచంలో నంబర్వన్ అయ్యానని, ఈ రోజుకు కూడా ప్రపంచ దేశాల అధినేతలు తన కోసం ఎదురుచూస్తుంటారని, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ను చివరిసారిగా 2021 ఫిబ్రవరి 1న కలిశానని కేఏ పాల్ తెలిపారు. తన పిలుపుమేరకే ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తోన్న రష్యాకు వ్యతిరేకంగా 141 దేశాలు ఏకమయ్యాయని, ఈ మధ్యే 26 మంది జాతీయ నేతలు తన హోటల్కు వచ్చారని, కేంద్ర హోం మంత్రి అమిత్షా ఇప్పటికి పదిసార్లు అధికారికంగా కలిశారని, అనధికారిక కలయికల లెక్కే లేదని కంగానైతే లెక్కే లేదని పాల్ పేర్కొన్నారు.
ఒకప్పుడు తనిచ్చే ఆశీర్వాదాలు, డబ్బుల కోసం ఎంతో మంది నేతలు ఎదురుచూసేవారని, అయితే ఇప్పుడు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో కనీసం ప్రార్థనా కూటములకు కూడా అనుమతులు ఇవ్వడంలేదని కేఏ పాల్ వాపోయారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ రూ.10 కోట్లు అడిగారని, ఆ ఫిగర్ విని తాను ఆశ్చర్యపోయానని, ఏ10 వేల కోట్లు అడుగుతారనుకుంటే, పాపం, 2008 లో కేసీఆర్ స్థాయి 10కోట్లేనని ఒక వ్యక్తి చెప్పాడని కేఏ పాల్ పేర్కొన్నారు. ‘నిజానికి కేసీఆర్ నా శిష్యుడే. కానీ ఇప్పుడు కళ్లు నెత్తికెక్కాయి. ఆయనకు ప్రజలే బుద్ది చెప్పబోతున్నారు’అని పాల్ వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు భారత ప్రజలకు 62 బిలియన్ డాలర్ల డబ్బును పంచిపెట్టానని, మొత్తం 38 వేల గ్రామాలకు రూ.5లక్షల కోట్లు ఇచ్చానని శాంతిదూత చెప్పుకున్నారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ తండ్రి, ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఉద్దేశించి కూడా కేఏ పాల్ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ‘‘ఒకప్పుడు సోనియాగాంధీ 56 మంది నేతలను రాకుండా అడ్డుకున్నారు. నేను దైవాంశసంభూతుడినని, నా కార్యక్రమాలకు అనుమతి ఇస్తే.. కాంగ్రెస్ భూస్థాపితమవుతుందని వైఎస్ రాజశేఖర్రెడ్డి అప్పట్లో సోనియాగాంధీకి లేఖలు రాశారు. వైఎస్ నన్ను భూస్థాపితం చేయలేదు. ఆయనే భూస్థాపితమైపోయాడు’అని పాల్ అన్నారు.
ఒకప్పుడు తీరిక లేని కార్యక్రమాలతో అంతర్జాతీయంగా బిజీగా గడిపిన కేఏ పాల్.. కొన్నేళ్లుగా ప్రభుత్వం విదేశీ నిధుల రాకపై కట్టడి విధించడంతో రాజకీయాలవైపు మళ్లారు. 2010లో సోదరుడు డేవిడ్ పాల్ హత్యోదంతం కేఏ పాల్ ఇమేజీని పూర్తిగా డ్యామేజ్ చేసింది. డబ్బుల విషయంలో తేడాలు రావడంతో కేఏ పాలే సొంత తమ్ముణ్ని చంపించారని అప్పట్లో కథనాలు వచ్చాయి. అయితే, ఆనాడు పోలీసులు, మీడియా కథనాన్ని వక్రీకరించాయని పాల్ తెలిపారు.
‘‘నా తమ్ముణ్ని చంపించాను అనేది మీడియా వక్రీకరణ. డబ్బులు తీసుకొని తప్పుడు రిపోర్టు రాశానని సీఐ శ్రీనివాస్ కోర్టులో అంగీకరించారు. అప్పటి డీజీపీ చాలా మంచివారు. వాస్తవాన్ని తెలుసుకున్నారు’’అని కేఏ పాల్ వివరించారు. ఇంటర్వ్యూ జరుగుతున్న సమయంలో ‘వచ్చే ఎన్నికల్లో కేసీఆర్, కేఏ పాల్ ప్రత్యర్థులుగా తలపడితే ఎవరు గెలుస్తారు?’ అన్న ప్రశ్నకు 67 శాతం మంది కేఏ పాల్ గెలుస్తారని, కేవలం 30 శాతం మందే కేసీఆర్ గెలుస్తారని అభిప్రాయపడ్డారు. సదరు పోల్ రిజల్ట్ స్క్రీన్ షాట్ వైరలవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Ka paul, Praja shanti party, Telangana, Trs, YSR