(Bureau Report, News18)
ఖమ్మం(Khammam)రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ జిల్లాల్లో గతంలో కుల ప్రస్తావన వచ్చిన దాఖలాలు పెద్దగా లేదు. మొదట్లో కమ్యునిస్టులు, ఆ తర్వాత టీడీపీ(TDP), మధ్య కాంగ్రెస్ (Congress), ఇప్పుడు టీఆర్ఎస్..ఇలా పార్టీలు ఏవైనా..ఎవరు అధికారంలో ఉన్నా..రాజకీయ నాయకుల మధ్య వర్గ విభేదాలు, ఆధిపత్య ధోరణి ఉందే తప్ప..కుల కుంపటితో వేదికలపై చర్చించుకున్న పరిస్థితి లేదు. కాని ఖమ్మం జిల్లాలో ఈనెల 14న ఆత్మహత్యకు పాల్పడిన బీజేపీ అనుబంధ కార్మిక సంఘం భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు సామినేని సాయి గణేష్ (Samineni Sai Ganesh)మృతిచెందిన తర్వాత ఈ కుల చిచ్చు రాజుకుంది. అందులో ఒకే సామాజికవర్గం పేరుతో కమ్మ(Kamma), సూడో కమ్మ(Pseudo kamma)అనే పదాలు గత పదిరోజులుగా టీఆర్ఎస్(TRS) శ్రేణులు, ఆ పార్టీ అనుకూల వర్గాలతో పాటు ప్రసార సాధనాలు, సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది.
ఆత్మహత్యతో రాజుకున్న చిచ్చు..
జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ వేధింపుల వల్లే సాయి గణేష్ ప్రాణాలు తీసుకున్నాడని బీజేపీ, కాంగ్రెస్ నేతలు మంత్రిని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే మృతుని అమ్మమ్మ, సోదరి సైతం జిల్లాకి చెందిన మంత్రి ప్రోద్భలంతోనే సాయి గణేష్ ప్రాణాలు తీసుకున్నాడని..ఆరోపించారు. బీజేపీ నాయకుడి మృతి ఖమ్మం జిల్లా నుంచి ఢిల్లీ వరకూ వెళ్లింది. స్వయాన కేంద్ర హోంమంత్రి ఫోన్ ద్వారా మృతుని కుటుంబాన్ని పరామర్శించడం, మరో కేంద్రమంత్రి కిషన్రెడ్డి సాయిగణేష్ సంస్మరణసభకు వచ్చి తమ పార్టీ నాయకుడి మృతికి కారకులైన వారిని వదిలే ప్రసక్తి లేదని చెప్పడంతో ఈ టాపిక్ మరింత హీటెక్కింది.
సామాజికవర్గం పేరుతో రాజకీయాలు..
ఈ పరిణామాలు జరిగిన తర్వాతే మంత్రి పువ్వాడ అజయ్ వైరాలో జరిగిన ఓ సభలో తాను కమ్మ సామాజికవర్గానికి చెందిన వాడ్ని కాబట్టే మంత్రి పదవి నుంచి తొలగించేందుకు కుట్ర పన్నుతున్నారని..తనకు కమ్మ కులస్తులు అండగా నిలవాలని కోరారు. అంతటితో ఆగకుండా కొందరు సూడో కమ్మలు చేస్తున్న ప్రయత్నాల్ని తిప్పికొట్టాలన్న పువ్వాడ వ్యాఖ్యలతో జిల్లాలో కమ్మ, సూడో కమ్మ అనే పదాలు విస్తృతంగా వాడకంలోకి వచ్చాయి. ఒకరకంగా పువ్వాడ చేసిన కామెంట్స్ కాస్త కొత్తగా అనిపించినప్పటికి తర్వాత జరిగిన పరిణామాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి.
తెరపైకి కమ్మ-సూడో కమ్మ పదాలు..
కేంద్ర మాజీమంత్రి రేణుకచౌదరి నుంచి వచ్చిన కామెంట్లపై మంత్రి అజయ్ వర్గం విరుచుకుపడింది. ఆమె దిష్టిబొమ్మను తగలబెట్టడమే కాకుండా రేణుకాచౌదరిని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. మరో ప్రవేట్ టెలివిజన్ ఛానెల్ అధినేతపైన ఈ తరహా సూడో వ్యాఖ్యలు ట్రోల్ అయ్యాయి. తనపైన అటు భాజపా, కాంగ్రెస్లు చేస్తున్న దాడిని తిప్పికొట్టడంలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తన పూర్తి స్థాయి శక్తియుక్తుల్ని వినియోగిస్తున్నారు. కుల సంఘాల వారిగా, కార్పోరేటర్లు, ఇంకా పలువురు నామనేటెడ్ పదవుల్లో ఉన్నవాళ్లు, ఉద్యోగ, వృత్తి సంఘాల నేతలతో మాట్లాడుతూ వారి మద్దతు కూడగట్టుకుంటున్నారు. కులాల పేరుతో ప్రశాంతంగా ఉంటే ఖమ్మంలో రాజకీయాలు సృష్టిస్తున్నారని అజయ్ వర్గం ఆరోపిస్తోంది. అదే సమయంలో చనిపోయిన బీజేపీ నేత సాయిగణేష్ కులం విషయంలోనూ చర్చ నడుస్తోంది. సాయిగణేష్ తల్లి బిందు కమ్మ కులానికి చెందగా, తండ్రి ఎస్టీ కులానికి చెందిన వారు. వీరిద్దరూ సాయిగణేష్ చిన్నతనంలోనే విడిపోయారు. దీంతో అమ్మమ్మ వద్దే సాయిగణేష్, అతని చెల్లెలు పెరిగారు. మే 4వ తేదీన వివాహం చేసుకోవాలని ముహూర్తం పెట్టుకున్న సాయిగణేష్ చౌదరి సైతం ఎస్టీ వర్గానికే చెందిన యువతిని ప్రేమించి, పెళ్లి నిశ్చయించుకున్నారు. అయితే తండ్రికి చెందిన ఎస్టీ కులాన్ని కాకుండా, తల్లికి చెందిన కమ్మ కులానికి చెందిన చౌదరి అని సాయిగణేష్ పెట్టుకున్నాడన్న చర్చ నడుస్తోంది. పేరు ఎలా పెట్టుకోవాలి. ఎవరి కులాన్ని రికార్డులోకి తీసుకోవాలి అనేది పూర్తిగా వ్యక్తిగతం అయినప్పటికీ, ఇది రాజకీయ రంగు పులుముకుని 'కమ్మ వర్సెస్ సూడో కమ్మ'గా పరిస్థితి మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Khammam, Politics, Puvvada Ajay Kumar