(G.SrinivasReddy,News18,Khammam)
ఒకే జిల్లా, ఒకే సామాజికవర్గం, గతంలో ఒకే పార్టీ కూడా. కాని ఇప్పుడు మాత్రం వాళ్లిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఖమ్మం(Khammam)జిల్లాకి చెందిన రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్కుమార్(Puvada Ajaykumar)కేంద్ర మాజీ మంత్రి రేణుకచౌదరి మధ్య వైరం ముదిరింది. ఒకప్పుడు కలిసి రాజకీయాలు చేసిన వాళ్లు ఇప్పుడు ఒకరిపైన మరొకరు కత్తులు దూస్తున్నారు. రేణుకచౌదరిRenuka Chowdhury)జిల్లాలో అడుగు పెట్టిందంటే అలజడే. సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది ఆమె వైఖరి అంటున్నారు సొంత పార్టీ నేతలు. కాంగ్రెస్(Congress)చేపట్టిన రైతు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న రేణుకాచౌదరి మంత్రి పువ్వాడను ఉద్దేశించి ఏకవచనంతో చేసిన కామెంట్స్ పెద్ద దుమారం రేపుతున్నాయి.
ఖమ్మంలో కమ్మనేతల మధ్య పోరు..
ఎవడ్రా నా కాంగ్రెస్ కార్యకర్తలపైన అక్రమ కేసులు పెట్టేది.. పువ్వాడ అజయ్ నేనొక్కదాన్నే వస్తా.. ఏంచేస్తావో చూస్తా అంటూ ఆమె కామెంట్స్ చేశారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ఖిల్లా అంటూ ఆమె పార్టీ కార్యకర్తలు, అభిమానుల కేరింతల మధ్య తన దూషణల పర్వం కొనసాగించారు. ఇంకా అనేక అంశాలను ప్రస్తావిస్తూ మమత మెడికల్ కాలేజి, పువ్వాడ కుటుంబంపై తరచుగా వస్తున్న ఆరోపణలను ఆమె ప్రస్తావించారు. తన కార్యకర్తలపై పువ్వాడ అజయ్ అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ఇకపై ఈ దౌర్జన్యాలు, దాష్టీకాలు సాగవంటూ హెచ్చరించారు.
పరస్పర విమర్శలు..
రేణకాచౌదవి వ్యాఖ్యలపై మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అంతే ధీటుగా స్పందించారు. ఆయన కూడా పాల్గొన్న ప్రతి సభలో ఆమెను వలస పక్షిగా పేర్కొన్నారు. ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చిన రేణుకచౌదరి.. రేపు ఎక్కడికి పోతుందో.. ఏంచేస్తుందో ఎవరికీ తెలియదదంటూ ఏకవచనంతోనే విమర్శల దాడికి దిగారు. ఖమ్మంపై మాట్లాడే నైతిక నీకు లేదంటూ రేణుకాచౌదరిని హెచ్చిరించారు పువ్వాడ. గతంలో టికెట్ ఇప్పిస్తానంటూ సొంత పార్టీ కార్యకర్తలను మోసం చేసిన కోట్లు సంపాధించిన నీ చరిత్ర ఎవరికి తెలియదంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. వైరా టికెట్ ఇప్పిస్తానంటూ ఒక గిరిజన వైద్యుని వద్ద కోటిన్నర వసూలు చేసి టికెట్ ఇప్పించకపోతే అతను ఆత్మహత్యకు పాల్పడిన చరిత్ర అప్పుడే మరచిపోయావా అంటూ ఎద్దేవా చేశారు.
ఎవ్వరూ తగ్గట్లేదు..
ఎలక్షన్ వస్తుందనగానే రావడం.. గాజులు చూపడం.. ట్రాక్టర్లు ఎక్కడం.. ముసుగులు వేసుకుని డ్యాన్సులు వేయడం తప్ప నువ్వు.. ఖమ్మం జిల్లాకు ఏమైనా చేసిన చరిత్ర ఉందా అని ప్రశ్నించారు. . రచ్చబండ పేరుతో పెద్ద కళ్లజోడు పెట్టుకొని డైలాగులు చెబితే ఇక్కడ నమ్మేవాళ్లు ఎవరూ లేరని మండిపడ్డారు. 20ఏళ్లు జిల్లా ప్రజలు ఆదరిస్తే వాళ్లకు ఏం చేశావో చెప్పమని సూటిగా ప్రశ్నించారు. నాకు బ్రేక్లు వేస్తే ఆడవాళ్ల అభివృద్ధికి బ్రేకులు వేసినట్లేనన్న పువ్వాడ అజయ్కుమార్ ..రేణుకాదేవిని స్క్రాప్తో పోల్చారు. తాను మంత్రిగా ఉన్న రవాణాశాఖలో 15ఏళఅలు పూర్తి చేసుకున్న వాహనాల్ని స్క్రాప్గా ట్రీట్ చేస్తామని ..అలాగే రాజకీయాల్లో పనికి రాని వాళ్లను కూడా స్క్రాప్గానే భావించి ఇంటికి పంపించాలన్నారు.
నువ్వెంతంటే నువ్వెంతా..
ఖమ్మం జిల్లాలో నిన్నటి వరకు బీజేపీ వర్సెస్ పువ్వాడ అజయ్కుమార్గా ఉన్న రాజకీయ జగడం ఇప్పుడు రేణుకాచౌదరి, పువ్వాడగా మారిపోయింది. కార్పొరేటర్గా రాజకీయ అరంగేట్రం చేసిన రేణుకాచౌదరి ఖమ్మం నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచి కేంద్రమంత్రి పదవి చేపట్టారు. చొచ్చుకుపోయే స్వభావం, డైనమిక్గా ఉండే వైఖరితో కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు దగ్గరయ్యారు. దాంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దశాబ్ధకాలం చక్రం తిప్పారు. 2014లో ఖమ్మం సీటును సీపీఐకి కేటాయించడం ఆపైన 2019లో పోటీచేసినా ఓటమి చవిచూడడంతో ఆమె జిల్లా వ్యవహారాలను పెద్దగా పట్టించుకోవడంలేదనే చెప్పాలి.
పొలిటికల్ వార్ ..
సీఎల్పీ నేత భట్టివిక్రమార్కకు రేణుకకు పొసగకపోవడం వల్ల ఆమె తన అనుయాయులకు న్యాయం చేయలేకపోయారన్న ముద్ర పడింది. పీసీసీ చీఫ్గా రేవంత్రెడ్డి బాద్యతలు చేపట్టడంతో మళ్లీ తన దూకుడు పెంచారు. బీజేపీ నేత సాయిగణేష్ కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా రేవంత్తో కలిసి వెళ్లారు. ఇక రచ్చబండను రాజకీయ బండగా మార్చుకొని విమర్శలు గుప్పిస్తున్నారు. వీటన్నింటి కంటే ముందు పీడీ యాక్టులో అరెస్టు అయిన కార్పోరేటర్ భర్త ముస్తఫా జైలు నుంచి విడుదలైన తర్వాత రేణుకచౌదరి హైదరాబాద్లోని తన నివాసంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితో కలసి ఓ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అప్పుడే మంత్రి పువ్వాడపై విరుచుకుపడ్డారు. అప్పటి నుంచి మొదలైన రగడ రోజురోజుకూ పెరుగుతునే ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.