TS POLITICS NEW DISCUSSION ON CM KCR KARIMNAGAR SENTIMENT AFTER DAMODAR RAO SELECTED FOR RAJYA SABHA SEAT KNR AK
KCR| Karimnagar: కరీంనగర్ అంటే కేసీఆర్కు ప్రేమా ? లేక భయమా ?.. ఆయనకు పదవితో కొత్త చర్చ
దామోదర్ రావు, కేసీఆర్ (ఫైల్ ఫోటో)
Telangana: ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కేసీఆర్ పెద్దపీట వేస్తూనే వస్తున్నారు. అయితే ఇలా పదవులు ఇవ్వడం వెనుక అసలు విషయం ఏంటనే అంశం ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో హాట్ టాపిక్గా మారింది.
ఉద్యమ జిల్లాగా పేరొందిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆయా పదవుల రూపంలో నేతలకు వరస అవకాశాలు లభిస్తున్నాయి. ఇటీవల ఎమ్మెల్సీగా హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన పాడి కౌశిక్ రెడ్డికి టీఆర్ఎస్ నాయకత్వం కీలక పదవి కట్టబెట్టింది . స్థానిక సంస్థల కోటాలో తెదెపాను వీడి తెరాసలో చేరిన జగిత్యాల జిల్లాకు చెందిన ఎల్.రమణ ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. బీసీ కమిషన్ చైర్మన్గా హుజూరాబాద్కు చెందిన వకులాభరణం కృష్ణమోహను పదవి దక్కింది . ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ఇలా అటు తెరాస పార్టీతోపాటు కార్పొరేషన్ పదవుల్లో ఉమ్మడి కరీంనగర్(Karimnagar) జిల్లాకు చెందిన చాలామందికి ఇదివరకే పదవులు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతను మరో కీలక పదవి వరించబోతోంది. టీఆర్ఎస్ తరపున రాజ్యసభ స్థానానికి అభ్యర్థిగా జగిత్యాల జిల్లాకు చెందిన దీవకొండ దామోదర్ రావు పేరును టీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) ఖరారు చేశారు. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోవడంతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది.
తెరాస ఆవిర్భావం నుంచి కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా మెదులుతూ వస్తున్న దామోదర్ రావు(Damodar Rao) స్వగ్రామం జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూరు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ సాగిస్తున్న పోరాటంలో ఆయన వెంటే ఉంటూ రాష్ట్ర సాధనలో తనవంతు పాత్రను పోషించారు. టీఆర్ఎస్లో పలు హోదాల్లో పనిచేశారు. పోలిట్ బ్యూరో సభ్యుడిగా, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగానూ కొన్నాళ్లు కొనసాగారు.
గతంలోనే ఆయనను రాజ్యసభ సభ్యుడిగా కీలకమైన పదవికి ఎంపిక చేస్తారనే ప్రచారం పార్టీలో జరిగింది. బండా ప్రకాశ్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి నిర్వహించే ఉప ఎన్నికకు ఇదివరకే నోటిఫికేషన్ జారీ అయింది. ఇందుకు సంబంధించిన పోలింగ్ 30న జరగనుంది. మరోవైపు ఉమ్మడి జిల్లానుంచి ఇప్పటికే ప్రాతినిథ్యం వహిస్తున్న రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావుతోపాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన డి. శ్రీనివాస్ పదవి విరమణ చేయడంతో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి.
కరీంనగర్ జిల్లాపై కేసీఆర్కు ప్రేమా ? లేక భయమా..?
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కేసీఆర్ పెద్దపీట వేస్తూనే వస్తున్నారు. అయితే ఇలా పదవులు ఇవ్వడం వెనుక అసలు విషయం ఏంటనే అంశం ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. రాజకీయ పరంగా ఆలోచిస్తే తెలంగాణలో బీజేపీ పుంజుకోవడం.. బండి సంజయ్ పాదయాత్ర చేయడం, రేవంత్ రెడ్డి టీపీసీసీ పగ్గాలు చేపట్టి కాంగ్రెస్ను బలోపేతం చేయడనికి ప్రయత్నించడం వంటివి టీఆర్ఎస్లో అంతర్మధనం మొదలయ్యేలా చేసిందనే వాదన కూడా ఉంది. అందుకే భవిష్యత్తులో వీరిని ఢీ కొట్టాలని ఉమ్మడి జిల్లాకు వరాల జల్లు కురిపిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే కేసీఆర్కు ఎవరికో భయపడాల్సిన అవసరం లేదని.. ఆయన ఏ పని మొదలుపెట్టినా కరీంనగర్ నుంచి మొదలుపెట్టడం అలవాటు అని.. కరీంనగర్ జిల్లాకు ఆయన మొదటి నుంచి అధిక ప్రాధాన్యత ఇస్తారని చెబుతున్నారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.