(P.Srinivas,New18,Karimnagar)knr
తెలంగాణ(Telangana)లోని అనేక పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను విచిత్రమైన భయం వెంటాడుతోంది. ఏ పుట్టలో ఏ పాముందో అనే చందంగా ఎవరి ఫోన్ కాల్(Phone call)కి రిప్లై ఇస్తే అది ఏ మీడియా(Media)లో, లేదా సోషల్ మీడియా(Social media)లో రచ్చ అవుతుందో అనే ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే అలాంటి సమస్యల్లో చిక్కుకోకుండా సున్నితంగా బయటపడేందుకు వెరైటీ టెక్నిక్ ఎంచుకున్నారు. ప్రజల్ని, తమ మద్దతుదారుల్ని, అనుచరుల్ని చివరకు పార్టీకి చెందిన కిందిస్థాయి నేతలకు కూడా ఇదే మార్గాన్ని ఫాలో కావాలని సూచిస్తున్నారంట. అసలు ఇదంతా ఎందుకు జరుగుతోంది..? నేతల ముందు జాగ్రత్త కోసం ఎంచుకున్న మార్గం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
ఫోన్ కాల్స్ అంటే భయం..
తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఫోన్లో మాట్లాడాలంటే జంకుతున్నారంట. ఫోన్లో మాట్లాడటం వల్ల పక్క రాష్ట్రంలో జరుగుతున్న రచ్చ చూసి తీరు మార్చుకున్నారో లేక ముందు జాగ్రత్త పడుతున్నారో తెలియదు కాని..ఫోన్లో మాట్లాడటం మాత్రం మంచిది కాదనే ఫీలింగ్కి వచ్చేశారంట. అందుకే ఎవరు ఫోన్ చేసి నియోజకవర్గ సమస్యలు చెబుతున్నా ...లేక ఇతర అవసరాల కోసం నార్మల్ ఫోన్ కాల్స్ చేస్తుంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రధాన పార్టీ నాయకులు, మంత్రులు కేవలం వాట్సాప్ కాల్స్ మాత్రమే అంటూ బదులిస్తున్నారంట. ఎవరు ఫోన్ చేసినా వాట్సాప్ కాల్ చేయండి బ్రదర్ అంటూ ఫోన్ కాల్ కట్ చేస్తున్నారంట.
వాట్సాప్ కాల్సే సేఫ్..
ఈ సమస్య అన్నీ పార్టీల నేతలు ఫేస్ చేస్తున్నప్పటికి ప్రధానంగా అధికార పార్టీ నేతల్లో మాత్రం ఈ భయం మరింత ఎక్కువగా ఉందని ..వాళ్లు ఎక్కువగా వాట్సాప్ కాల్స్కే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు మంత్రులకు నాయకులకు ఇలాంటి అనుభవాలు చాలానే ఎదురయ్యాయి. దాంతో నియోజకవర్గంలోని కింది స్థాయి పార్టీ కార్యకర్తలైనా , తోటి ఎమ్మెల్యేలు అయినా సరే అందరికీ ఇదే సూత్రాన్ని వర్తింపజేస్తున్నారు. టీఆర్ఎస్ , బీజేపీ , కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలందరూ దీనినే ఫాలో అవుతున్నారు. నార్మల్ కాల్ చేస్తే ఫోన్ ఎత్తడమే మానేస్తున్నారు.
కొత్తరకం భయం..
నాయకులు ఇంతలా భయపడటానికి కారణాలు లేకపోలేదు. ఫోన్ చేసిన వ్యక్తి ఎక్కడ తాను మాట్లాడే మాటలను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తారో అనే భయం వెంటాడుతోంది. గతంలో ఇలాంటి చేదుఅనుభవాలు ఎదురైన కారణంగా వీలైనంత వరకు ఓపిగ్గానే మాట్లాడుతూ సంయమనం కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తప్పని పరిస్థితుల్లో ఫోన్ కాల్స్ ఎత్తడం లేదు. దీనికి తోడు ఇంటెలిజెన్స్ పోలీసులు సైతం తమ ఫోన్లను టాప్ చేస్తారేమోననే అనుమానం కూడా ఉందట.
సేఫ్టీ కోసం ముందు జాగ్రత్త..
బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ చేపడుతున్న నేపధ్యంలో అధికార పార్టీకి చెందిన నేతల్లో ఈ భయం ఎక్కుగా ఉందట. ట్యాపింగ్ జరిగే విషయం కూడా తెలియదని , ఇంటెలిజెన్స్ ద్వారా ఆ మాటలన్నీ పార్టీ అధినేతకు చేరుతాయనే డౌట్ టీఆర్ఎస్ లీడర్ల నుంచి వ్యక్తమవుతోంది. ఇలాంటి కొన్ని సందర్భాల్లో నార్మల్ ఫోన్ కాల్ వస్తే లిఫ్ట్ చేయకుండా కట్ చేసి పక్కన ఉన్న కార్యకర్తల ఫోన్ల నుంచి మాట్లాడుతున్నారట నేతలు. పార్టీ హైకమాండ్ ఎక్కడ తమపైన నిఘా పెట్టిందోననే భయంతో యాండ్రాయిడ్ ఫోన్లను మానేసి ఐ - ఫోన్లను ఆశ్రయిస్తున్నారంట. అవి అయితే సెక్యూరిటీ పరంగా కాస్త సేఫ్ అని ఫీలవుతున్నారు.
ఎలక్షన్స్ వరకు ఇంతేనా..
ఇంతకాలం కాంగ్రెస్ మాత్రమే ప్రధాన ప్రతిపక్షంగా ఉండడంతో ఆ పార్టీ నేతలు ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు బీజేపీ సైతం ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మారడంతో ఇలాంటి జాగ్రత్తలకు నేతలు అలవాటు పడుతున్నారు . ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారే యాక్టివిటీస్ ఇటీవల ఎక్కువయ్యాయి . ఆపరేషన్ ఆకర్ష్ ప్రయత్నా లు ముమ్మరంగా సాగుతున్నాయి . నార్మల్ కాల్స్ చేస్తే ముందుగానే లీక్ అవుతుందని భయపడుతున్నారు. అందుకే వాట్సాప్ను ఆశ్రయిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karimnagar, Telangana Politics