తెలంగాణ(Telangana)లో అధికార పార్టీ నాయకత్వం ఎన్నికలకు అనుగూణంగా వ్యూహాలు పన్నుతోంది. బీఆర్ఎస్(BRS) జాతీయ పార్టీగా ఆవిర్భావం చెందడంతో కొత్తగా పార్టీలో చేరే నాయకులు, ఇతర పార్టీల్లోంచి చేరే వాళ్లకు ప్రాధాన్యత ఇస్తూనే సొంత పార్టీలో ఉన్న సీనియర్లు, సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో అసంతృప్తికి చోటులేకుండా ముందస్తుగా ఆలోచనలు చేస్తోంది. ప్రత్యేక పదవులతో సంతృప్తి పరచాలని చూస్తోంది. అందుకే ప్రస్తుతం జరగాల్సిన ఉపాధ్యాయ, స్థానిక సంస్థల కోటలో రెండు ఎమ్మెల్సీ పదవులతో పాటు త్వరలో కాళీ అవుతన్న ఐదు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ(MLC) పదవుల్ని సరైన వారికి కేటాయించి ఎక్కడా లోటుపాటులు రాకుండా చూసేందుకు గులాబీ బాస్ ఆలోచిస్తున్నారు. అంతే కాదు ఇదే ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది మొదట్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం సాధ్యం కాని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది. రాజకీయ అవసరాలు, సామాజిక సమీకరణాలు, పార్టీలో సీనియర్లను బ్యాలెన్స్ చేస్తూ ఎమ్మెల్సీ పదవులను భర్తీ చేయనున్నట్లుగా తెలుస్తోంది.
బీఆర్ఎస్లో పదవుల పందారం..
జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టిన బీఆర్ఎస్ పార్టీ అందుకు తగినట్లుగానే రాష్ట్రంలో నాయకత్వాన్ని పటిష్టం చేసుకుంటోంది. పార్టీకి పని చేసిన సీనియర్లు, పదవులు దక్కని నేతలను ఇంతకాలం బుజ్జగిస్తూ వచ్చిన గులాబీ బాస్ ..ఇప్పుడు మాత్రం వారికే ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. అందుకే జరగబోతున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలోని రెండు సీట్లతో పాటు త్వరలో జరగబోయే గవర్నర్ కోటా ఐదు ఎమ్మెల్సీ పదవుల్ని సీనియర్లకు కట్టబెట్టాలని చూస్తున్నారట. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన గంగాధర్గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి, నవీన్కుమార్ల పదవీ కాలంతో వచ్చే నెలాఖరుతో పదవీ కాలం ముగియనుంది. ఇక గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన రాజేశ్వర్రావు , ఫరూక్ హుస్సేన్ పదవీ కాలం కూడా వచ్చే నెలలోనే ముగుస్తుండటంతో ఆ పదవులు తమకు కట్టబెట్టాలని ఇప్పటికే చాలా మంది సీనియర్లు గులాబీ బాస్ చెవిన పడేయటమే కాకుండా ..వారికి అనుకూలమైన దార్లలో ప్రయత్నాలు చేస్తున్నారు.
సీనియర్లు, అసంతృప్తులకు..
అయితే ఇందులో రెండు ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించలేదు ఎన్నికల కమిషన్. వచ్చే నెల్లో కాళీ అవుతున్న ఐదు స్తానాలను పార్టీ అధిష్టానం నిర్ణయం ప్రకారం భర్తీ చేసేవే కావడంతో ఆ ఐదు సీట్లపైనే ఎక్కువమంది సీనియర్లు గురి పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ పదవుల్ని సీనియర్లతో భర్తి చేసి వాళ్ల అసంతృప్తిని తగ్గించడంతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఎవరికైతే టికెట్ ఆశాజనకంగా ఉంటుందో వారికి ప్రత్యేక పదవులు కట్టబెట్టి బ్యాలెన్స్ చేయాలని బీఆర్ఎస్ అధినాయకత్వం యోచిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: BRS, CM KCR, Telangana Politics