TS POLITICS INTERNAL FIGHT IN TELANGANA BJP AS MLA RAGHUNANDAN REPORTEDLY SLAMS MP BANDI SANJAY HERE IS DETAILS MKS
Telangana BJP: కమలదళంలో కలకలం.. ఆ నేతకు భరించలేని అవమానం! -అసలేం జరుగుతోంది?
ఇటీవల రైతు దీక్ష వేదికపై ఈటల, రఘునందన్, బండి
టీబీజేపీలో ముఖ్యనేతల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. రోజూ అవమానిస్తుంటే భరించాలా? అని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైరయ్యారు. వ్యక్తిగతాలకు పోయేవాళ్లకు ఈసారి టికెట్లు రావని బండి సంజయ్ బాంబు పేల్చారు.
సీఎం కేసీఆర్ వర్సెస్ గవర్నర్ తమిళిసై అన్నట్లుగా సాగుతోన్న ఉదంతంలో టీఆర్ఎస్ సర్కారు ప్రోటోకాల్ పాటించడంలేదని ఆరోపిస్తోన్న టీబీజేపీ పెద్దలు.. సొంత పార్టీ వ్యవహారాల్లోనూ ప్రోటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. అదేంటి? ప్రభుత్వం అనుసరించాల్సిన ప్రోటోకాల్కు, పార్టీ అంతర్గత వ్యవహారాలతో పొలిక ఎందుకు? అని బయటి వాళ్లకు అనిపించినా, సొంత పార్టీలో సరైన గౌరవం దక్కకపోగా భరించలేని అవమానాలు ఎదుర్కొంటోన్న నేతలకు మాత్రం ఇది కచ్చితంగా పెద్ద విషయమే. అందుకే తీవ్రస్వరంతోనే స్పందించారు. తద్వారా కమలదళంలో కలకలం రేగింది.
టీబీజేపీలో ముఖ్యనేతల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. రోజూ అవమానిస్తుంటే భరించాలా? అని ఫైరైంది దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కాగా, వ్యక్తిగతాలకు పోయేవాళ్లకు ఈసారి టికెట్లు రావంటూ బండి సంజయ్ బాంబు పేల్చారు. బండి వ్యాఖ్యలు ఈటలను ఉద్దేశించినవనే ప్రచారం జరుగుతున్నా, రఘునందన్ ప్రశ్నించినరోజే పార్టీ చీఫ్ హెచ్చరించడం ప్రచ్ఛన్న యుద్ధాన్ని తలపిస్తోందనే కామెంట్లు వస్తున్నాయి.
తెలంగాణ బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర రెండోదశ, గురువారం ప్రారంభమవుతున్న నేపథ్యంలో పార్టీలో అసంతృప్త స్వరాలు అంతర్గతంగా కలకలం సృష్టిస్తోంది. కేంద్రం పెద్దల జోక్యంతో ఈ వ్యవహారం సర్దుమణిగినట్లు అనిపించినా పార్టీ కార్యక్రమాల వేదికలపై ప్రొటోకాల్ పాటించట్లేదంటూ దుబ్బాక ఎమ్మెల్యే ఎం. రఘునందన్రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం మరోసారి సంచలనం రేపుతున్నది. టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ వైఖరిని తప్పుబడుతూ, సంస్థాగత ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాసులుకు రఘునందన్ తన అసంతృప్తిని తెలియజేశారని వెల్లడైంది. రోజూ అవమానిస్తుంటే భరించాలా? అని, పార్టీ ప్రొటోకాల్ పాటించకపోతే కుదరదని రఘునందన్ తేల్చిచెప్పినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.
రాష్ట్ర పదాధికారుల సమావేశానికి ఆహ్వానించినా తనను వేదికపైకి పిలవకపోవడం, కొంత కాలంగా పలు సందర్భాల్లో బండి తీరు అవమానించేలా ఉందని రఘునందన్ బాహాటంగా అసంతృప్తి వెళ్లగక్కినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. తొలి దశ ప్రజా సంగ్రామ యాత్ర చార్మినార్ వద్ద ప్రారంభించినప్పుడు, ముగింపు సభ సిద్దిపేట జిల్లాలోని జరిగినప్పుడూ మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం అవమానించడం కాదా? అని రఘునందర్ ప్రశ్నిచినట్లు తెలుస్తోంది. ముగ్గురు ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, విప్ పదవులు ఇవ్వాలని రాష్ట్ర ఇంఛార్జి తరుణ్ ఛుగ్ చెప్పినా సంజయ్ దానిని అమలు చయడంలేదని, జీహెచ్ఎంసీతోపాటు కరీంగనర్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ ఫ్లోర్లీడర్ నియామకాల విషయంలోనూ బండి ధోరణి సరిగా లేదని దుబ్బాక ఎమ్మెల్యే విమర్శించినట్లు సమాచారం.
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ జిల్లాల పర్యటన పట్లా సంజయ్ అసంతృప్తిగా ఉన్నట్లూ ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో రఘునందన్ రావు తనకు అవమానం జరుగుతోందని నిలదీశారు. ఈ రెండిటికీ సమాధానమా? అన్నట్లుగా బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని.. టికెట్లు ఇప్పిస్తామంటూ ప్రచారం చేసుకుంటున్నారని.. వారికి, వ్యక్తుల కోసం పనిచేసేవారికి టికెట్లు రావని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. వ్యక్తిగతంగా, స్వచ్ఛంద సంస్థల కార్యక్రమాల్లో పాల్గొనవద్దని, అలా చేస్తే కఠినంగా వ్యవహరిస్తామనీ సంజయ్ హెచ్చరించారు. మొత్తంగా టీబీజేపీలో ముఖ్యనేతల మధ్య విభేదాలు చర్చకు దారితీశాయి.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.