రాబోయే ఒకటి రెండు నెలల్లో తెలంగాణ బీజేపీలో భారీ మార్పులు చేర్పులుండే అవకాశం ఉంది. ముఖ్యంగా టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన హుజురాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Etala Rajender)రాష్ట్ర బీజేపీలో కీలకం కాబోతున్నట్లుగా తెలుస్తోంది. అంతే కాదు ప్రస్తుతం బీజేపీ(BJP) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్(Bandi sanjay)కి సైతం ఢిల్లీ(Delhi)కి ప్రమోషన్ లభించే అవకాశం ఉందని సమాచారం. అయితే ఇదంతా బీఆర్ఎస్(BRS)ని రాజకీయంగా దెబ్బ కొట్టడంతో పాటుగా..తెలంగాణలో బీజేపీ మరింత బలోపేతం చేసేందుకే అన్నట్లుగా కనిపిస్తోంది.
బీజేపీలో మార్పులు, చేర్పులు..
తెలంగాణ రాజకీయాల్లో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ హైకమాండ్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ క్యాబినెట్లో ఆర్ధిక, ఆరోగ్యశాఖ మంత్రి పదవులు చేపట్టిన అనుభవం కలిగిన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అనుభవాన్ని, నాయకత్వాన్ని ఉపయోగించుకోవాలని బీజేపీ చూస్తున్నట్లుగా ఉంది. అందుకే అతి త్వరలోనే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ని నియమించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.
మార్పు చిచ్చురేపేనా..
అంతే కాదు ఈటలను బీజేపీ ముఖ్యమంత్రి పదవికి అభ్యర్దిగా ప్రకటించ వచ్చేనే పుకార్లు కూడా పార్టీ వర్గాల నుంచి గట్టిగా వినిపిస్తోంది. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ స్థానంలో ఎవరిని నియమించినా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అసంతృప్తి చిచ్చు రాజుకోవడం ఖాయమని పార్టీ వర్గాల్లో కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే బీజేపీ అధ్యక్ష పదవికి అర్హత కలిగిన వాళ్ల జాబితా చూసుకుంటే ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీలు జితేందర్రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పేర్లు వినిపిస్తున్నప్పటికి పార్టీ హైకమాండ్ మాత్రం ఈటల పేరును మాత్రమే పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఈటలపైనే పెద్దల గురి...
అంతే కాదు కేసీఆర్పై తిరుగుబాటు ప్రకటించి ఉపఎన్నికల్లో గెలిచి సత్తా చాటుకున్న ఈటల ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయనకు నాయకత్వ పదవి కట్టబెడితే బీసీ ఓట్లు పార్టీకి అనుకూలంగా మారే అవకాశం ఉందని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం పార్టీ జాయినింగ్ కమిటీ చైర్మన్గా తన సత్తాను నిరూపించుకోవడమే కాకుండా మునుగోడు ఉపఎన్నికల్లో సమర్థవంతంగా ప్రచారం చేసి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ వివిధ సంఘాలు, ముఖ్యంగా యువత మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ను గద్దె దించడమే తన లక్ష్యమని ఇప్పటికే పలుమార్లు సవాల్ చేసారు ఈటల.
ఏమో జరగవచ్చు..?
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి మార్పు చేర్పులపై వస్తున్న ప్రచారాన్ని కమలం పార్టీ నేతలు తోసి పుచ్చుతున్నారు. బీజేపీ లాంటి జాతీయ పార్టీలో రాష్ట్ర అధ్యక్షులుగా పార్టీ సైద్ధాంతిక నేపధ్యం నుంచి వచ్చిన వారికే కట్టబెట్టారని పార్టీకి చెందిన ఓ లీడర్ చెప్పినట్లుగా జాతీయ పత్రిక పేర్కొంది. అయితే ఇతర పార్టీల నుంచి వచ్చిన కొత్త వాళ్లను అధ్యక్షుల్ని చేసినప్పటికి ఇప్పుడు మాత్రం ఆ విధంగా జరిగే పరిస్థితి లేదంటున్నారు.
బండి ఢిల్లీకి ప్రమోషన్..?
ఇక బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి మార్పుకు మరో కారణం కూడా ఉందనే టాక్ వినిపిస్తోంది. జనవరి లేదా ఫిబ్రవరిలో కేంద్ర క్యాబినెట్ విస్తరణ ఉంటుందని..అందులో వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్ వంటి రాష్ట్రాలకు చెందిన నాయకుల్ని మోదీ తన టీమ్లో తీసుకుంటారనే టాక్ కూడ ఉంది. అయితే కొత్త వాళ్లను చేర్చుకోవడానికి ప్రస్తుతం ఉన్న కేంద్రమంత్రుల్లో కొందరికి ఉద్వాసన పలికే అవకాశం ఉందట. అయితే కేవలం కేంద్రమంత్రుల పనితీరు ఆధారంగానే వడపోత కార్యక్రమం ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి మార్పు తధ్యమైతే ప్రస్తుతం ప్రెసిడెంట్గా ఉన్న బండి సంజయ్ని మోదీ కేంద్రమంత్రివర్గంలో చోటు కల్పించాలని చూస్తున్నట్లుగా ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, Bjp, Eetala rajender, Telangana Politics