(M.Balakrishna,News18,Hyderabad)
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. టీపీసీసీ ప్రెసిడెంటుగా రేవంత్ రెడ్డినే కొనసాగించాలని కొందరు ఆయన్ని తొలగించాలని మరికొందరు పట్టుబడుతున్నారు. ఇటు వలస వాదులు, మరో వైపు కాంగ్రెస్ సీనియర్ నేతల మధ్య వివాదం ముదిరి రచ్చకెక్కింది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం దిగ్విజయ్ సింగ్ ను రంగంలోకి దింపింది. హైదరాబాద్ గాంధీ భవన్ లో దిగ్విజయ్ సింగ్ ఉండగానే తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. రెండు వర్గాల నినాదాలతో గాంధీ భవన్ హోరెత్తిపోయింది.
ఇరు వర్గాల నాయకులతో దిగ్విజయ్ సింగ్ మాట్లాడే ప్రయత్నం చేశారు. వారిలో కొందరు రేవంత్ రెడ్డిని టీ కాంగ్రెస్ ప్రెసిడెంటుగా కొనసాగించాలని, ఆయన్ని తొలగించాలని మరికొందరు దిగ్విజయ్ సింగుకు ఫిర్యాదు చేశారు. పార్టీ పదవుల్లో సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని వి. హన్మంతరావు విజ్ఙప్తి చేశారు. వలస వాదులను రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడంటూ వీహెచ్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి అనుచరవర్గం నాయకులు రెచ్చిపోయారు.
మాకు చాలా బాధగా ఉంది. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మమ్మల్ని వలస వాదులని అంటున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం, కేంద్రంలో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే వారితో మేం పోరాడుతున్నామని ఆమె చెప్పుకొచ్చారు.
విహెచ్ వ్యాఖ్యలను ఆమె ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలు సంక్షోభాన్ని పరిష్కరించలేవని, వాస్తవానికి మరింత ఆగ్రహాన్ని పెంచుతాయని సీతక్క అన్నారు.
రేవంత్ రెడ్డి ఇతర పార్టీల వారి కోసం పని చేస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం నెలకొన్న సమస్య పరిష్కారానికి తాను సిద్దంగా ఉన్నానని జానారెడ్డి తెలిపారు. పార్టీలో కోవర్టులు లేరు. ఇది కావాలనే తాను చేసిన వ్యాఖ్యలుగా ప్రచారం చేస్తున్నారని జానారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్య. దీన్ని చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని..దిగ్విజయ్ సింగ్ అభిప్రాయపడ్డారు.
అన్ని వర్గాలతో ఆయన విడివిడిగా చర్చలు సాగిస్తున్నారు. అందరికీ న్యాయం చేస్తామని దిగ్విజయ్ హామీ ఇచ్చారు. దిగ్విజయ్ గాంధీభవన్ రావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. పార్టీలో అందరి అభిప్రాయాలు తీసుకుని న్యాయం చేస్తానని దిగ్విజయ సింగ్ హామీ ఇచ్చారు. రెండు వర్గాలుగా విడిపోయిన తెలంగాణ కాంగ్రెస్ ను పునరుద్దరించేందుకు ఆయన శాయశక్తులా కృషి చేస్తున్నారు. పార్టీలో నాయకత్వ సమస్యను పరిష్కరించి, సరైన నాయకుడిని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Hyderabad, Mp revanthreddy, Telangana, TS Congress