‘వాయిలెన్స్.. వాయిలెన్స్.. వాయిలెన్స్..’అనే కేజీఎఫ్-2 రాకీ భాయ్ డైలాంగ్ మాదిరిగా ‘ప్లీజ్.. ప్లీజ్.. ప్లీజ్.. ఒక్క ఛాన్స్..’అనే సంజుభాయ్ డైలాగ్ ఇప్పుడు తెగవైరలవుతోంది. టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ రెండో విడత పాదయాత్ర ముగింపు సందర్భంగా తుక్కుగూడలో ఆ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక నుంచి ఒక్క అవకాశం ఇవ్వాలంటూ ప్రజల్ని సంజయ్ వేడుకున్న తీరు ట్రోలింగ్ కు గురవుతోంది. అదీగాక, తెలంగాణలో బీజేపీ అధికార సాధనకు, కేసీఆర్ ను కూలగొట్టడానికి బండి సంజయ్ ఒక్కడే చాలని అమిత్ షా వ్యాఖ్యానించడమూ తీవ్ర చర్చనీయాంశమైంది.
గులాబీ సోషల్ సైన్యం వన్ సైడెడ్ ట్రోలింగ్ కు ధీటుగా ఇతర రాజకీయ పక్షాలు, అపొలిటికల్ నెటిజన్లు భిన్నవాదనలు చేస్తున్నారు. కేసీఆర్ ను బండి సంజయ్ కూల్చడమేంటి? అసలు బండికి జాకీలు పెట్టి లేపిందే గులాబీ బాస్ కదా? అని, ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని అడుక్కోవడం నిజంగా సిగ్గుచేటని సీపీఐ జాతీయకార్యదర్శి కొనకళ్ల నారాయణ (కేఎన్) మండిపడ్డారు.
సంజయ్ని లేపిందే కేసీఆర్: తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ కు ధీటుగా సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిన కాంగ్రెస్ ను అన్ని రకాలుగా నిర్వీర్యం చేసిన సీఎం కేసీఆర్.. ఆ పార్టీ ఎమ్మెల్యేలను సైతం కొన్నారనే ఆరోపణలున్నాయి. 2018 ఎన్నికల తర్వాత కూడా కాంగ్రెస్ ను కేసీఆర్ ఆగంపట్టించడంతో ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో బీజేపీ ఎదుగుతూ వచ్చింది. లోక్ సభ మొదలు పలు ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవడానికి, పార్టీ అధ్యక్షుడైన ఏడాదిలోపే బండి సంజయ్ సీఎం అభ్యర్థి స్థాయికి ఎదడగానికి కేసీఆరే పరోక్షకారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ ఊసే లేదనేలా సీఎం తన ప్రతి ప్రెస్ మీట్ లో బండి సంజయ్ ని టార్గెట్ చేయడం, సంజయ్ సవాలును సీరియస్ గా తీసుకొని ఏకంగా కేంద్రంతో, ప్రధాని మోదీతో భీకర పోరాటానికి దిగడం, చివరికి తోకముడిచిన చందంగా చంద్రశేఖర్ రావు బీజేపీ డిమాండ్లనే అమలు చేయాల్సి రావడం లాంటి పరిణామాలు సంజయ్ ఎదుగుదలకు తిరుగులేని తోడ్పాడు అందించాయని, వరిపోరులో, ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రకటనలో బీజేపీదే విజయమని చాటుకునేలా సంజయ్ వ్యవహరించిన తీరు హైకమాండ్ వద్ద అతని పట్ల క్రేజ్ పెంచిందనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని..
తెలంగాణలో లేని బీజేపీకి చోటు కల్పించింది, బండి సంజయ్ ని హీరోను చేసింది ముమ్మాటికీ కేసీఆరే అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. విభజన హామీలను అడుగడుడునా తృణీకరించినా కేసీఆర్ గత ఎనిమిదేళ్లుగా బీజేపీకి బేషరతుగా మద్దతు ఇస్తూనే వస్తున్నాడని, తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న బిల్లులను సైతం టీఆర్ఎస్ సమర్థిస్తూ వచ్చిందని, మొత్తంగా బీజేపీ రాజకీయ బలం పెంచుకోడానికి అవకాశం కల్పించిందే కేసీఆర్ అని, సంజయ్ ని బడా నేత చేసిన ఘనతా గులాబీ అధినేతదేనని నారాయణ మండిపడ్డారు. తుక్కుగూడ సభలో అమిత్ షా మాట్లాడుతూ ‘కేసీఆర్ను అధికారం నుంచి తప్పించడానికి నేను అవసరం లేదు. బండి సంజయ్ ఒక్కడు చాలు..’అని ప్రకటన చేయడం ద్వారా భావి సీఎం అభ్యర్థి బీసీ వర్గానికి చెందిన బండేనని పరోక్షంగా హింట్ ఇచ్చినట్లయిందనే కామెంట్లు వస్తున్నాయి. ఇక,
అదే తుక్కుగూడ సభావేదిక నుంచి టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతూ -ఇప్పటివరకు అనేక పార్టీలకు అధికారం ఇచ్చారు. తెలంగాణలో ఒక్కసారి బీజేపీకి ఛాన్స్ ఇవ్వండి.. ప్లీజ్.. ప్లీజ్.. ప్లీజ్..ఒక్కసారి మాకు అధికారం ఇవ్వండి.. ’అని ప్రజల్ని వేడుకున్నారు. సహజంగానే టీఆర్ఎస్ సోషల్ సైన్యాలు బండిని ట్రోలింగ్ చేస్తున్నాయి. ‘చేసిన అభివృద్ది చెప్పుకోవాలి, లేదంటే మేనిఫెస్టో మాట్లాడాలి కానీ ఇలా ప్లీజ్ ప్లీజ్ అని అడుక్కోవడం నీకే చెల్లింది బండన్నా..’అంటూ గులాబీ శ్రేణులు మీమ్స్ తో ఆటాడుకుంటున్నాయి. అయితే, సంజయ్ తనకు తెలిసిన పద్ధతిలో జనాన్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాడని, ప్లీజ్ అని బతిమాలుకోవడం తప్పేమీ కాదనీ సమర్థనలూ వస్తున్నాయి.
అయితే, సంజయ్ కోరినట్లు బీజేపీకి గనుక ఒక్క అవకాశం ఇస్తే అది మనల్ని మనం ఉరి తీసుకున్నట్లేనని సీపీఐ నారాయణ ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేసిన బీజేపీ ఇవాళ ప్లీజ్.. ప్లీజ్.. ఒక్క అవకాశం ఇవ్వండని అడుక్కోవడం నిజంగా సిగ్గుచేటు అని నారాయణ ఫైరయ్యారు. మొత్తంగా ఇన్నాళ్లూ సీఎం కేసీఆర్ వర్సెస్ పీఎం మోదీ అన్నట్లుగా సాగిన టీఆర్ఎస్-బీజేపీ పోరు ఇకపై కేసీఆర్ వర్సెస్ బండి సంజయ్ గానే సాగుతాయనే థియరీని సెట్ చేయడంలో అమిత్ షా సక్సెస్ అయ్యారనే వాదన వినిపిస్తోంది. మరి నిజంగా సంజయ్ అంతటి సమర్థుడా? కాదా? అనేది కాలమే నిర్ణయిస్తుంది..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amit Shah, Bandi sanjay, Bjp, CM KCR, CPI, CPI Narayana, Hyderabad, Telangana, Trs