తెలంగాణ గవర్నర్ తమిళి సైపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. గవర్నర్ బయట చాలా నరికారని.. పులి తీరుగా గాండ్రించారని అన్నారు. కానీ పిల్లి తీరుగా సభలో ప్రసంగించారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం చేసే పనులను గవర్నర్ ప్రసంగంలో పేర్కొనడం సాధారణమేనని జగ్గారెడ్డి (Jagga Reddy) వ్యాఖ్యానించారు. గవర్నర్ బయట పెద్ద పెద్ద మాటలు చెప్పారని.. కానీ ప్రసంగంలో మాత్రం తుస్ అనిపించారని విమర్శించారు. మొన్నటి దాకా తమిళిసై, కేసీఆర్ కు మధ్య యుద్ధాలే జరిగాయని.. కానీ ఇప్పుడు ఇద్దరూ కలిసి ఒకటే దారిలో నడిచారని ఆరోపించారు. ఒకరికొకరు దండాలు పెట్టుకున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ డైరెక్షన్ లో గవర్నర్ నడిచారని విమర్శించారు. తప్పనిసరి పరిస్థితిలో కేసీఆర్, గవర్నర్ మధ్య రాజీ కుదిరిందని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీకి గవర్నర్ బీ టీమ్గా మారిపోయిందని అన్నారు. ఇది ఎన్నికల ఏడాది అని.. అసెంబ్లీలో మాట్లాడటానికి ఎన్నో సమస్యల్యూ ఉన్నాయన్నారు.
అంతకుముందు తెలంగాణలోని(Telangana) ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(Tamilisai Soundararajan) పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులు, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనా దక్షతతో తెలంగాణ దేశానికే మార్గదర్శకంగా నిలుస్తోందని చెప్పారు. రాష్ట్రాభివృద్ధిని చూసి దేశమంతా ఆశ్చర్యపోతోందని తెలిపారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు.
ఒకప్పుడు విద్యుత్ కోతల కారణంగా రాష్ట్రం అంధకారంలో ఉండేదని తమిళిసై చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రస్తుతం 24 గంటల నిరంతర విద్యుత్ తో రాష్ట్రం వెలుగులు విరజిమ్ముతోందని తెలిపారు. కుదేలయిన వ్యవసాయ రంగాన్ని తన ప్రభుత్వం ఆదర్శవంతంగా తీర్చిదిద్దిందని చెప్పారు. నేడు దేశానికే అన్నం పెట్టే ధాన్యాగారంగా తెలంగాణ అవతరించిందని వివరించారు.
రాష్ట్రంలో తాగునీటి కష్టాలు తొలగిపోయాయని, గ్రామాల్లో ఇంటింటికీ ఉచితంగా స్వచ్ఛమైన జలాలను ప్రభుత్వం సరఫరా చేస్తోందని తమిళిసై తెలిపారు. తెలంగాణలోని గ్రామాల రూపురేఖలు నేడు మారిపోయాయని, జీవన ప్రమాణాలు పెరిగాయని గవర్నర్ పేర్కొన్నారు. పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంగా మారిందన్నారు. ఐటీ రంగంలో మేటిగా పరుగులు పెడుతూ ప్రపంచ స్థాయి సంస్థలకు రాష్ట్రం గమ్యస్థానంగా నిలుస్తోందని తెలిపారు.
PM Modi Tweet: తెలంగాణపై ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్..రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టు!
తెలంగాణ అసెంబ్లీలో ముగిసిన బీఏసీ సమావేశం..6న బడ్జెట్ సహా షెడ్యూల్ ఇలా..
పర్యావరణం, పచ్చదనం పెంపులో ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ప్రశంసలు అందుకుంటోందని గవర్నర్ తమిళిసై చెప్పారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆదాయం రూ.62 వేల కోట్లు మాత్రమేనని, ప్రభుత్వ కృషితో 2021 నాటికి ఆదాయం రూ.1.84 లక్షల కోట్లకు పెరిగిందని వివరించారు. తలసరి ఆదాయంలోనూ తెలంగాణ మిగతా రాష్ట్రాలకంటే ముందు ఉందని చెప్పారు. రాష్ట్రం ఏర్పడేనాటికి తలసరి ఆదాయం రూ.1.24 లక్షలుగా ఉందని, ఇప్పుడు రూ.3.17 లక్షలకు చేరిందని గవర్నర్ వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Governor Tamilisai Soundararajan, Jagga Reddy, Telangana, Telangana Budget