తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపు కోసం గౌరవప్రదమైన ఫలితం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ.. మునుగోడులో తాము ఆశించిన ఫలితాలు వస్తాయని భావిస్తోంది. ఈ ఉప ఎన్నిక కోసం తమ శక్తి మేరకు పని చేసిన కాంగ్రెస్ పార్టీ.. మునుగోడు ఉప ఎన్నిక తరువాత రాహుల్ గాంధీ జోడో భారత్ యాత్రపై మరింతగా ఫోకస్ చేయనుంది. ఈ యాత్ర కాంగ్రెస్కు అత్యంత ప్రతిష్టాత్మకం కావడంతో... మునుగోడు ఉప ఎన్నిక తరువాత కాంగ్రెస్(Congress) శ్రేణులు మరింత ఎక్కువ సంఖ్యలో ఈ యాత్రలో పాల్గొంటారని ఆ పార్టీ నేతలు చెబుతున్నాయి. అయితే మునుగోడు(Munugodu) ఉప ఎన్నిక తరువాత కాంగ్రెస్ నాయకత్వం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) వ్యవహారంపైనే ఎక్కువగా దృష్టి పెట్టనుందనే చర్చ జరుగుతోంది.
మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేస్తున్న తన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలని వెంకట్ రెడ్డి కోరడం పెద్ద దుమారం రేపింది. దీనిపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ నాయకత్వం షోకాజ్ నోటీసు కూడా ఇచ్చింది. దీనికి సమాధానం కోసం వెంకట్ రెడ్డికి ఇచ్చిన గడువు కూడా పూర్తి కావొచ్చింది. అయితే ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దీనిపై కాంగ్రెస్ హైకమాండ్కు వివరణ ఇచ్చారని.. అయితే ఆయన దీనిని బహిర్గతం చేయడం లేదనే చర్చ జరుగుతోంది. మరోవైపు విదేశాల నుంచి తిరిగొచ్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. తనకు కాంగ్రెస్ హైకమాండ్ క్లీన్ చీట్ ఇచ్చేవరకు బయటకు రాబోనని, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనని చెప్పినట్టు తెలుస్తోంది.
దీంతో ఆయన రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొనడం కూడా అనుమానంగానే మారింది. మరోవైపు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారంపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలనే యోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కారణంగా కాంగ్రెస్ పార్టీ అనేక ఇబ్బందులు పడుతోందని.. ఆయన వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బందిగా మారుతున్నాయని పలువురు పార్టీ నేతలు కాంగ్రెస్ హైకమాండ్ను కోరినట్టు సమాచారం.
Telangana | Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్లో మహిళా ఎమ్మెల్యే సీట్ల కోటా ఫిక్స్ .. టీపీసీసీ చీఫ్ వాగ్ధానం దేనికి సంకేతం ..?
Nizamabad: ఆ మాజీ ఎమ్మెల్యే దారెటు? ఈటలతోనే ఉంటారా? సీఎం కేసీఆర్కి జై కొడతారా?
ఆయన ఇదే రకంగా వ్యవహరిస్తే.. మిగతా పార్టీలకు తాము టార్గెట్ అవుతామని.. పార్టీ శ్రేణుల్లో నెలకొన్న గందరగోళం అదే రకంగా కొనసాగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆయన విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే అనేక మంది నేతలు ఏఐసీసీని కోరారని టాక్ వినిపిస్తోంది. దీంతో మునుగోడు ఉప ఎన్నికలు పూర్తయిన తరువాత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ హైకమాండ్ ఏదో ఒక తుది నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతోందని సమాచారం. మొత్తానికి మునుగోడు ఉప ఎన్నిక తరువాత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అంశంపై కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.