తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ నేటి (ఏప్రిల్ 27)తో 21 ఏళ్లు పూర్తి చేసుకొని, 22వ యేట అడుగు పెట్టబోతోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్లో ప్రతినిధుల సభ (ప్లీనరీ) నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తికాగా, నేటి ప్లీనరీ వేదికగా పార్టీ శ్రేణులకు టీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ రాజకీయ, ప్రభుత్వపరమైన అంశాలపై కీలక దిశానిర్దేశం చేయనున్నారు. కేసీఆర్ జాతీయ పార్టీ లేదా జాతీయ ఫ్రంట్ ప్రకటన చేయనున్నారు.
ఇవాళ కేసీఆర్ జాతీయ ప్రణాళిక ప్రకటన చేయడానికి వీలుగానే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నిన్ననే(మంగళవారం నాడే) కాంగ్రెస్ తో తెగదెంపులు చేసుకున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ ప్లీనరీకి జాతీయ మీడియా ప్రతినిధులును పెద్ద సంఖ్యలో పిలవడం వెనుక కూడా ఇదే మతలు ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి.
దేశాన్ని సరైన దిశలో నడిపించడంలో కాంగ్రెస్, బీజేపీ రెండూ విఫలం అయ్యాయని, జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక వస్తే తప్ప భారతీయుల బతుకులు బాగుపడవని సీఎం కేసీఆర్ చాలా కాలంగా వాదిస్తున్నారు. ఆ దిశగా బీజేపీయేతర, కాంగ్రెసేతర ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకూ తీవ్రంగా కృషి చేశారు. కానీ ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయారు. అయితే ఇప్పుడు కేసీఆర్ కు వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తోడుకావడంతో సీన్ మరోలా మారబోతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. పీకేకు కావాల్సినంత స్వేచ్ఛ, అవసరమైన బ్యాకప్ అందిస్తూ ఆయన ద్వారా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేలా కేసీఆర్ భారీ ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.
నేటి ప్లీనరీలో కేసీఆర్ చేయబోయే ప్రసంగం, పార్టీ చేయబోయే తీర్మానాల ద్వారా జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పాత్రపై మరింత స్పష్టత ఇవ్వనున్నారు. బీజేపీ మతతత్వాన్ని క్యాన్సర్ తో పోల్చిన కేసీఆర్.. ఆ రోగాన్ని తెలంగాణకు అంటనీయొద్దని వాదిస్తూ, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నెలకొన్న మతఘర్షణ వైఖరిని హైలైట్ చేస్తూ, అదే సమయంలో కాంగ్రెస్ నాయకత్వలేమిని ప్రశ్నిస్తూ జాతీయ స్థాయి ప్రత్యామ్నాయ వేదికను కేసీఆర్ ఇవాళ ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు.. మోదీ-బీజేపీపై కేసీఆర్ యుద్ద ప్రకటన.. పార్టీ బలాబలాపై విస్తృతస్థాయి సర్వేలు.. ప్రశాంత్ కిషోర్ రంగ ప్రవేశం.. కేంద్రంతో యుద్దం.. అధికార విపక్షాల మధ్య తీవ్ర విమర్శల హోరు.. తదితర అంశాల నేపథ్యంలో ఈ ఏడాది టీఆర్ఎస్ ప్లీనరీకి ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. దీనిని కవర్ చేసేందుకు జాతీయ మీడియా నుంచి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులను కేసీఆర్ ఆహ్వానించారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని భావిస్తున్న నేపథ్యంలోనే ఈసారి ప్లీనరీకి పార్టీ వ్యూహకర్తలు జాతీయ మీడియాను ఆహ్వానించారు. మరికొద్ది గంటల్లోనే కేసీఆర్ జాతీయ ప్రణాళిక వెలువడనుండగా, అందులో ప్రశాంత్ కిషోర్ కీలక పాత్రధారిగా ఉంటారనే చర్చ నడుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, CM KCR, Congress, Hyderabad, Kcr, Prashant kishor, Telangana, Trs