బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కారుపై యుద్దాన్ని మరింత ఉధృతం చేస్తానన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ దిశగా కార్యాచరణ సిద్ధం చేశారు. మోదీ సర్కార్ వ్యవసాయ రంగాన్ని, రైతులను మోసపుచ్చుతోందని ఆరోపించిన టీఆర్ఎస్ అధినేత.. రైతు సంఘాల ఆధ్వర్యంలో జరుగనున్న మహాసంఘటనంలో తన వంతు పాత్రపోషిస్తానని ఇటీవల ప్రకటించిన క్రమంలో రైతులపై హింసాకాండ చోటుచేసుకున్న లఖీంపూర్ ఖేరీని సందర్శించనున్నారు. గతంలో లఖీంపూర్ సందర్శనకు వెళ్లిన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఉత్తరప్రదేశ్ యోగి సర్కారు అడ్డుకున్న దరిమిలా కేసీఆర్ కు ఎలాంటి అనుభవం ఎదురుకాబోతున్నదనేది ఉత్కంఠగా మారింది.
రైతుల అంశంలో బీజేపీపై పోరును కొనసాగిస్తామన్న కేసీఆర్ తాజాగా మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలిసింది. ఈసారి 10 రోజులపాటు అక్కడే ఉండనున్నట్లు సమాచారం. అయితే ఈసారి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేసీఆర్.. ఉత్తరప్రదేశ్లోని లఖీంపూర్ ఖీరీకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన రైతులను కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిశ్ మిశ్రా కారుతో తొక్కించి చంపిన ఘటనకు కేంద్రమైన లఖీపూర్ ఖేరీని సందర్శించి, బాధిత రైతు కుటుంబాలను కేసీఆర్ కలవనున్నారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి యూపీ ఎన్నికల సమయంలోనే కేసీఆర్ అక్కడికి వెళ్లాలని భావించినా, చివరి నిమిషంలో ఆగిపోయారు.
రైతులు, జర్నలిస్టు, బీజేపీ కార్యకర్తలు అంతా కలిపి 8 మంది మృతి చెందిన లఖీంపూర్ ఖేరీ హింసాకాండపై దేశంలో ప్రకంపనలు సృష్టించడం, కేంద్రంలో, ఉత్తరప్రదేశ్లో అధికారంలో ఉన్న బీజేపీపై తీవ్ర నిరసనలు పెల్లుబికిన తర్వాత ప్రధాని మోదీ స్వయంగా రైతులకు క్షమాపణలు చెప్పి, మూడు సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం తెలిసిందే. అయితే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో రైతులపై హింసాకాండ ప్రభావం ఇంతైనా కనిపించలేదు. రాష్ట్రంలో బీజేపీ తిరిగి అధికారంలోకి రావడంతోపాటు లఖీంపూర్ ఖీరీలోనూ ఆ పార్టీ అభ్యర్థే విజయం సాధించారు. లఖీంపూర్ ఘటనకు ప్రాధాన్యం తగ్గుతోందనుకునేలోపే కేసీఆర్ మళ్లీ దానిని హైలైట్ చేసేందుకు సమాయత్తం అవుతున్నారు..
ఈసారి ఢిల్లీ పర్యటనలో 10 రోజులు అక్కడే మకాం వేయనున్న సీఎం కేసీఆర్.. యూపీలోని లఖీంపూర్ ఖేరీ జిల్లాకు వెళ్లి బాధిత రైతు కుటుంబాలను పరామర్శించనున్నారు. శుక్రవారం హైదరాబాద్ లో జరిగిన న్యాయాధికారుల సదస్సులో పాల్గొన్న కేసీఆర్ నిన్న సాయంత్రమే ఎర్రవల్లిలోని ఫాంహౌస్కు వెళ్లారు. శనివారం ఓ వివాహానికి హాజరుకానున్నారు. ఇవాళ సాయంత్రం లేదా ఆదివారం ఉదయం నాటికి కేసీఆర్ ఢిల్లీ టూర్ తేదీలపై స్పష్టత వచ్చే అవకాశముంది.
ఇటీవలే ఏప్రిల్ 3న ఢిల్లీ వెళ్లిన తెలంగాణ సీఎం 8 రోజులపాటు అక్కడే ఉండి, 11న జరిగిన టీఆర్ఎస్ రైతు దీక్షలో పాల్గొన్నారు. కాగా, గత ఢిల్లీ పర్యటనలో కేసీఆర్ ఎక్కువ సమయం వ్యక్తిగతానికే కేటాయించారు. పంటి నొప్పితో బాధపడుతూ అక్కడి ఆస్పత్రిలో చూపించుకున్నారు. ఈసారి మాత్రం పూర్తిగా రాజకీయ కాలాపాలకే కేసీఆర్ పరిమితం కాబోతున్నట్లు తెలుస్తోంది. వరి పోరులో భాగంగా ఢిల్లీలో దీక్ష చేసి వచ్చిన తర్వాత తెలంగాణలో యాసంగి సీజన్ లో పండిన ధాన్యం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని సీఎం ప్రకటించడం తెలిసిందే.
కాగా, మరో సారి ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్ పలువురు ఆర్థికవేత్తలు, రైతు సంఘాల ప్రతినిధులతో భేటీ అయ్యే అవకాశముంది. దేశ రైతాంగం కోసం ఇంటిగ్రేటెడ్ న్యూ అగ్రికల్చరల్ పాలసీ అవసరమంటూ ఇటీవల ప్రగతి భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అభిప్రాయపడ్డ కేసీఆర్ దీనిని సాధించేందుకు తన సర్వశక్తులను ధారపోసి ప్రయత్నం చేస్తానన్నారు. ఇందుకోసం పలువురు ఆర్థికవేత్తలను పిలుస్తున్నానని, కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసె్స(సీఏసీపీ) మాజీ చైర్మన్ అశోక్ గులాటి, రైతు నాయకులు హైదరాబాద్కు వస్తామన్నారని తెలిపారు.
అన్ని రాష్ట్రాల రైతు ప్రతినిధులను, ఢిల్లీలో ఉద్యమం నిర్వహించిన రైతు సంఘాల నాయకులను హైదరాబాద్కు పిలిపించి వర్క్షాప్ పెట్టి, ఇంటిగ్రేటెడ్ న్యూ అగ్రికల్చర్ పాలసీని డిక్లేర్ చేస్తామనీ కేసీఆర్ మొన్నటి ప్రెస్ మీట్ లో వెల్లడించారు. అందులో భాగంగానే ఢిల్లీలో వారితో భేటీ అవుతారని తెలుస్తోంది. వారితో మంతనాలు జరిపి, కేంద్ర వ్యతిరేక పోరాటంపై ప్రణాళికను రచించుకుంటారని సమాచారం. తాజా ఢిల్లీ పర్యటనలో జాతీయ కూటమి అంశంపైనా కేసీఆర్ ఫోకస్ చేయనున్నారు. లఖీంపూర్ ఖేరీ సందర్శన తర్వాత కేసీఆర్.. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తో భేటీ అవుతారని తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, CM KCR, Farmers, Farmers Protest, Telangana, Trs, Uttar pradesh